లక్నో : హనుమాన్ చాలీసా పఠించి.. దేశాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమికొడుదామని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 8:30 గంటలకు ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను పఠించాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మురార్ జి త్రిపాఠి పిలుపునిచ్చారు. హనుమాన్ చాలీసా ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత శ్రీరామ్ జై రామ్ జైజై రామ్ అని నినదించాలని చెప్పారు. హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల కరోనాను తరిమికొట్టొచ్చని సాధువులు నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రయాగ్రాజ్లోని కాశీకి సమీపంలోని 26 జిల్లాల ప్రజలు ఆన్లైన్ వేదికగా ఒకేసారి హనుమాన్ చాలీసా పఠిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రయాగ్ పీఠాధిశ్వర్ జగద్గురు స్వామి వివేకానంద సరస్వతి, అఖిల భారత అఖారా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి, స్వామి జితేంద్రనంద జీ, స్వామి కైవల్య దాస్ జీ, స్వామి బ్రిజ్ చైతన్య జీ మహారాజ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.కరోనాను తరిమికొట్టేందుకు ఆన్లైన్ వేదికగా హనుమాన్ చాలీసాను పఠించడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు తెలిపారు.