న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ మధ్య సెంట్రల్ విస్టా నిర్మాణంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు సంధిస్తున్నాయి. పనులను నిలిపివేసి నిధులను కరోనాపై పోరాడేందుకు వాటిని ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినా ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. మరో వైపు పనులను వేగవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే ఏడాది (2022) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మిస్తున్న భవనంలోనే జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ కవాతును కూడా.. పూర్తిగా మెరుగులు దిద్దిన సెంట్రల్ విస్టా ప్రాంతంలో జరపాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ సెంట్రల్ విస్టాపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ‘ముంబైలో ఎమ్మెల్యేల బంగ్లాలను రూ.900 కోట్ల నిర్మిస్తున్నారని, కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూకు కలిపి రూ.1300 కోట్లు ఖర్చవుతుంది’ అని ఓ అధికారి పేర్కొన్నారు. రెండు ప్రాజెక్టుల టెండర్లు కరోనాకు ముందే పూర్తయ్యాయని, సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టు కింద మిగతా ప్రాజెక్టులు తర్వాత చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ రెండు ప్రాజెక్టుల సైట్లలో సుమారు 400 మంది కార్మికులు పని చేస్తున్నారని సదరు అధికారి తెలిపారు. వాస్తవానికి ప్రారంభించని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులను ఆపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని, ఇది సరికాదని అన్నారు.
కాగా, ప్రాథమిక అంచనా ప్రకారం.. సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి బంగ్లాలు సహా 13 భవనాలుండే మొత్తం సెంట్రల్ విస్టాకు సుమారు రూ.17వేల కోట్ల ఖర్చువుతుందని అంచనా. 2026 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి ఉండగా.. బాధ్యతలు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చూస్తోంది. ఇదిలా ఉండగా.. అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని, సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపాలని పలు ప్రతిపక్ష పార్టీలు ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్టును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రాజెక్టును సమర్థించారు. టీకాలకు ఇంతకంటే రెండు రెట్లు అధికంగా బడ్జెట్ కేటాయించినట్లు పేర్కొన్నారు.