మంచిర్యాల అర్బన్, అగస్టు 7 : కేసులకు భయపడేది లేదు.. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన పై నమోదైన కేసులో శుక్రవారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు. దీంతో కేసు విచారణను న్యాయస్థానం వచ్చేనెల సెప్టెంబర్ 25కు కేసును వాయిదా వేసింది. అనంతరం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు మెజారిటీ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు అక్రమ మార్గాలను ఆశ్రయించిందని ఆరోపించారు.
ఆ ఘటనలో తమపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేయడానికి కోట్ల రూపాయలు, బ్లాంక్ చెక్కులు చూపించినా వారు లొంగలేదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసినందుకే తమపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడినా, ఉద్యమాలకు పిలుపునిచ్చినా గతంలో తనపై కేసులు పెట్టి 20 రోజుల పాటు చంచల్ గూడ జైలులో ఉంచారన్నారు.
మరోవైపు అధికార పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రతిపక్ష నాయకులకు ఒక చట్టం, అధికార పార్టీ నేతలకు మరో చట్టం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం..కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు బీఆర్ఎస్ తరఫున గట్టిగా నిలబడతాం అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.