తెలుగులో ఎప్పుడూ బిజీగా ఉండే నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఎందుకంటే ఒక్క ఏడాది కూడా ఈయన ఖాళీగా ఉండడు. కుదిరితే ఒక్కో ఏడాది అరడజన్ సినిమాలు కూడా విడుదల చేసేంత సత్తా ఉన్న నిర్మాత ఈయన. ఒకప్పుడు రామానాయుడు లాంటి నిర్మాతలు ఫాలో అయిన పద్దతిలోనే ఇప్పుడు దిల్ రాజు కూడా వెళ్తున్నాడు. అప్పట్లో మూవీ మొఘల్ చిన్న సినిమాలతో పాటు భారీ సినిమాలు కూడా నిర్మించేవాడు. ఇప్పుడు దిల్ రాజు ఇదే చేస్తున్నాడు. ఓ వైపు చిన్న సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు భారీ సినిమాలతో వస్తున్నాడు. కొన్నాళ్లుగా చిన్న సినిమాలు నిర్మిస్తున్న ఈయన.. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలతో సిద్ధమైపోయాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్లో వరసగా భారీ సినిమాలు నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమాలతో రచ్చ చేయాలని చూస్తున్నాడు. రాబోయే నాలుగు సినిమాలకు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నాడు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఈయనే నిర్మించాడు. ఏప్రిల్ 9న విడుదల కానుంది ఈ చిత్రం. దాంతో పాటు ఇప్పుడు రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో సినిమాను కూడా ప్రకటించాడు. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో రూ.130 కోట్లతో నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం మొదలు కానుంది.
మరోవైపు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని నిర్మించాలని చూస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో సలార్ సినిమా వస్తుంది. దాంతో పాటు మరో సినిమాను కూడా చేయాలని చూస్తున్నాడు.
షాహిద్ కపూర్తో హిందీలో జెర్సీ రీమేక్ను నిర్మిస్తున్నాడు దిల్ రాజు. అల్లు అరవింద్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమాను కూడా లైన్లో ఉంచాడు ఈయన. ఇప్పటికే ఆర్య, పరుగు, డిజే సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. ఇప్పుడు 4వ సారి ఈ కాంబినేషన్లో సినిమా రానుంది.
తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ లైన్లోకి తీసుకొస్తున్నాడు దిల్ రాజు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే విజయ్ డేట్స్ కోసం కూడా చర్చలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ రానుంది. ఇన్ని భారీ సినిమాలు ఒకేసారి పట్టాలెక్కించడం అంటే అది కేవలం దిల్ రాజుకు మాత్రమే సాధ్యమవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి