Delhi AIIMS : ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్లో అభ్యంతరకర ఘటన జరిగింది. ఒక మహిళా పేషెంట్తో సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై ఢిల్లీ ఎయిమ్స్ చర్యలు తీసుకుంది. అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఈ ఘటన జరిగింది. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఒక మహిళా పేషెంట్తో అక్కడ విధుల్లో ఉన్న ధనంజయ్ సింగ్ అనే సెక్యూరిటీ గార్డు అనుచితంగా ప్రవర్తించాడు. దీనిపై పేషెంట్ కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఎయిమ్స్ ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపారు. ఈ ఘటనలో గార్డు ధనంజయ్ సింగ్ అభ్యంతరంగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో వెంటనే అతడిని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఎయిమ్స్ ప్రకటించింది. అంతేకాదు.. అతడికి జరిమానా కూడా విధిస్తున్నట్లు తెలిపింది. అలాగే, ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించామని ఒక ప్రకటనలో పేర్కొంది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. న్యూఢిల్లీ ఎయిమ్స్ పరిధిలో మహిళలపై లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనల్ని ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మహిళా రోగులు, వారి సంబంధీకుల భద్రత, గౌరవానికి కట్టుబడి ఉన్నామని వివరించింది.
ఎయిమ్స్లో అరుదైన చికిత్స
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఒక అరుదైన చికిత్స నిర్వహించారు. స్థూలకాయం కారణంగా నిద్రలేమి, శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ఒక పేషెంట్కు శస్త్రచికిత్స నిర్వహించారు. 32 ఏళ్ల ఒక వ్యక్తి 209 కేజీల బరువున్నాడు. ఈ బరువు కారణంగా అతడు శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యేది. యంత్రాల సాయంతో మాత్రమే రాత్రిపూట శ్వాస తీసుకునేవాడు. ఈ క్రమంలో నిద్రలేమిని ఎదుర్కొనేవాడు. కానీ, ఎయిమ్స్ వైద్యులు ట్రాకియోస్టోమి అనే చికిత్స నిర్వహించారు. దీనివల్ల గొంతు ద్వారానే శ్వాస తీసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో 14 రోజుల్లో అతడి బరువు తగ్గించారు. బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించిన వైద్యులు ఆ రోగి బరువును 49 కేజీలు తగ్గించారు. అంటే, అతడి బరువును 160 కేజీలకు తీసుకొచ్చారు.