పంజాబీ గాయకుడు దిల్జాన్(31) మార్చి 30(మంగళవారం) ఉదయం అమృత్సర్ సమీపంలోని జండియాలా గురులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు. అమృత్సర్ నుండి కర్తార్పూర్ వెళుతుండగా, దిల్జాన్ కారు జలంధర్ జిటి రోడ్డులో పక్కన ఆపి ఉంచిన ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దిల్జాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గల పూర్తి కారణాలేంటనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. గాయకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే అతి వేగం వలననే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.
దిల్జాన్ భార్య, పిల్లలు కొన్నాళ్లుగా కెనడాలో ఉంటున్నారు. ఈ వార్త తెలిసిన వారు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతికి పంజాబీ సంగీత పరిశ్రమ సంతాపం తెలియజేసింది. చాలా మంది ప్రముఖులు తమ సోషల్ మీడియా పేజ్లో దిల్జాన్కు సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు.