Konda Surekha : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ పర్యటనలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కనిపించపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మూడు జిల్లాలను చుట్టేసిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా.. ఏ ఒక్క వేదికపై కూడా సురేఖ ఆసీనులు కాలేదు. అంతేకాదు దేవదాయ శాఖ మంత్రి అయిన ఆమె లేకుండానే మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించారు సీఎం. దాంతో, రాజకీయంగా అంతర్గత విభేదాల కారణంగానే మినిస్టర్ సురేఖ హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఇటీవల తరచూ బయటపడుతూనే ఉన్నాయి. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య వర్గపోరు.. ఇక కాంగ్రెస్లో ఫిరాయింపులను, పాలన తీరును విమర్శించే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నాయకురాలైన కొండా సురేఖ సైతం పార్టీపై కాసింత అసంతృప్తితోనే ఉన్నట్టు సమాచారం.
Shock for Konda Surekha! During his Warangal tour, CM Revanth Reddy publicly backed sitting MLA Revuri Prakash Reddy for Parkal in the next elections — dashing Surekha’s repeated push for daughter Sushmitha’s candidacy. Konda couple’s absence from the tour today adds to the buzz.… pic.twitter.com/ygR4ztk7jS
— Digital Prime News (@DigiPrimeNews) August 16, 2026
అందుకే కాబోలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలకు ఆమె దూరమయ్యారు. పరకాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ సురేఖ కనిపించలేదు. ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అయితే.. ఇదివరకే సురేఖ కుమార్తె సుస్మిత తాను పరకాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో.. తమ ప్రాంతంలోనే సీఎం పర్యటిస్తున్నా.. సురేఖ అంటీముట్టనట్టు వ్యహహరించడానికి రాజకీయపరమైన విభేదాలే కారణమని తెలుస్తోంది.