శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఇలవేల్పుగా కొలిచే కన్నడిగులు లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ శ్రీశైల క్షేత్రం చేరుకుంటున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా దేవస్థానం అనేక ఏర్పాట్లు చేసిందని, నిబంధనలకు అనుగుణంగా స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నట్లు ఈవో కేఎస్ రామారావు చెప్పారు.
కాగా, నేడు కర్ణాటకలోని 13 జిల్లాల్లో బంద్ నేపథ్యంలో అక్కడి నుంచి రావలసిన ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. దీంతో పాదయాత్ర చేస్తూ క్షేత్రానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజంతా వేచి చూసినప్పటికీ బస్సులు రాకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో బస్టాండ్, టోల్ గేటు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న యాత్రికులతో ఈవో రామారావు మాట్లాడారు. దేవస్థాన సిబ్బందితో కలిసి తాత్కాలికంగా రవాణా ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని తరలించారు. వారికి అవసరమైన ఆహార, తాగునీటి వసతి కల్పించారు. టీఎస్ఆర్టీకి చెందిన అచ్చంపేట, ఆత్మకూర్ డిపోల అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులు పంపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..