లండన్: గత ఆరు నెలల నుంచి కోవిడ్తో బాధపడుతున్నవారిలో.. డిప్రెషన్, మతిమరుపు, మానసిక సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడిచారు. కోవిడ్ ఇన్ఫెక్షన్తో మానసిక లేదా నరాల సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. హాస్పిటల్లో.. ఇంటెన్సివ్ కేర్లో చేరిన వారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుందన్నారు. వైరస్ వల్ల మానసిక వత్తిడి ఎక్కువై.. ఆ తర్వాత అది నేరుగా మెదడుపై ప్రభావం చూపుతోందన్నారు. అమెరికాలోని లక్షల మంది రోగుల ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను పరిశీలించిన యూకే శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు. మానసిక, నరాలకు సంబంధించిన 14 రకాల వ్యాధులు పీడిస్తున్నట్లు గుర్తించారు. ఆందోళన, మానసిక ప్రవర్తనలో విపరీత మార్పులు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇది కేవలం అబ్జర్వేషనల్ స్టడీ నివేదిక అని శాస్త్రవేత్తలు చెప్పారు.
వైరస్ నేరుగా బ్రెయిన్లోకి వెళ్లి అక్కడ డైరక్ట్ డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయని, దానికి ఆధారాలు కూడా ఉన్నట్లు ఆక్స్ఫర్డ్ వర్సిటీ న్యూరాలజీ ప్రొఫెసర్ మసూద్ హుసేన్ తెలిపారు. మతిమరుపు(డిమెన్షియా) వ్యాధి ఉన్నవారిలో కోవిడ్19 తీవ్రత ఎక్కువగా ఉంటుందని బ్రిటన్లో అల్జీమర్స్ పరిశోధకులు డాక్టర్ సారా ఇమరిసో తెలిపారు. కోవిడ్ కేవలం శ్వాస సంబంధిత వ్యాధి మాత్రమే కాదు అని, దీని వల్ల మానసిక, నరాల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించామని కింగ్స్ కాలేజీ సైక్రియాట్రీ ప్రొఫెసర్ డేమ్ టిల్ వైక్స్ తెలిపారు.