ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్లు తమకు వద్దంటే వద్దంటున్నారు ముంబైలోని వాంఖడే స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్లు. నగరంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోతుండటంపై వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వాళ్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు లేఖ కూడా రాయడం విశేషం. ఈ నెల 2వ తేదీనే వీళ్లు సీఎంకు లేఖ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో తమ అభిమాన క్రికెటర్లను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానుల గుమిగూడతారని ఆ లేఖలో వాళ్లు రాశారు.
ఇండ్లు లేని చోటికి మ్యాచ్లను షిఫ్ట్ చేయాలని మరైన్ డ్రైవ్ రెసిడెంట్స్ అసోసియేషన్ సభ్యుడు ఒకరు కోరారు. పెళ్లిళ్లు, మత సంబంధమైన కార్యక్రమాలు, చివరికి అంత్యక్రియలకు కూడా ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం.. ఐపీఎల్ మ్యాచ్కు ఎలా అనుమతి ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఏటా ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా తమకు పార్కింగ్ కష్టాలు తప్పవని, కొవిడ్ విజృంభిస్తున్న ఈ సమయంలో ఐపీఎల్ ఏంటని స్టేడియానికి దగ్గర్లోనే ఉండే మరో నివాసితుడు ప్రశ్నించాడు. ఇప్పటికే వాంఖడే స్టేడియంలోని 11 మంది సిబ్బందికి కొవిడ్ సోకిన విషయం తెలిసిందే. దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నా.. అక్కడి ప్రభుత్వం మాత్రం ఐపీఎల్ మ్యాచ్కు అనుమతి ఇవ్వడం గమనార్హం.