ఖలీల్వాడి, ఆగస్టు 12: జిల్లాలో కొన్నిరోజులుగా రోడ్డు పక్కన నవజాత శిశువులను పారేయడం, ముళ్ల పొదల్లో పసికందు మృతదేహాలను వదిలివెళ్లడం వంటి అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు పురిటిలోనే బిడ్డలను కాటికి పంపుతున్నారు.. మరికొందరు ముళ్ల పొదల్లోకి విసిరేస్తున్నారు..ఇంకొందరు రోడ్డుపక్కన వదిలేసి జారుకుంటున్నారు.. మానవత్వానికి మచ్చగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు అందరినీ కలిచివేస్తున్నాయి. వివాహేతర సంబంధమో లేదా ఇంకేం బంధమో గానీ నవజాత శిశువులను కన్ను తెరవకముందే వదిలించుకుంటూ మానవత్వానికి మచ్చ తెస్తున్నారు. ఈ నెల 4న జిల్లా ప్రభుత్వ దవాఖాన వద్ద ఉన్న ఓ డ్రైనేజీలో నవజాత శిశువు లభ్యమైంది. ఎవరు వదిలి వెళ్లారో తెలియదు..తాజాగా బుధవారం మోపాల్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ పరిధిలోని సిర్పూర్ రోడ్డు పక్కన ఓ శిశువును వదిలేసివెళ్లారు. స్థానికులు గుర్తించి వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఏఎన్ఎం, డబ్ల్యూపీసీ సభ్యులు అక్కడికి చేరుకొని శిశువును ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పురిటిలోనే చిదిమేస్తున్నారు..
వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, డేటింగ్లు మానవ సంబంధాలను మంటగలుపుతున్నాయి. నవ మాసాలు మోసి..కని మొగ్గలోనే పసికందును చిదిమేస్తున్నారు. ఒకవేళ మృతి చెందితే ఖననం చేయాలి కానీ, మురికి కాలువల్లో, ముళ్ల పొదల్లో పడేసి మానవత్వానికి మచ్చ తెస్తున్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానకు నిత్యం 800 నుంచి వెయ్యి మందికి పైగా అవుట్పేషంట్లు వస్తుంటారు. ప్రస్తుతం వందల సంఖ్యలో ప్రసవాల కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 4న డ్రైనేజీలో దొరికిన శిశువు గురించి విచారణ చేపట్టగా, రికార్డుల ప్రకారం ఆ శిశువు ప్రభుత్వ దవాఖానలో ప్రసవం కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇంతపెద్ద దవాఖానకు మొత్తం 60 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉంది. సీసీ కెమెరాలు ఉన్నాయి. అయినా శిశువును వదిలివెళ్లిన వారీ ఆచూకీ లభించకపోవడం గమనార్హం. పురిటిలోనే చిన్నారులను చిదిమేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.