బెర్లిన్ : కరోనా వైరస్ కేసులు తిరిగి విజృంభిస్తుండటంతో జర్మనీలో నియంత్రణలను కఠినతరం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొద్దికాలం పాటు లాక్డౌన్ విధించేందుకు ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ సానుకూలంగా ఉన్నారని ఆమె ప్రతినిధి గురువారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా కొద్దిరోజుల పాటు లాక్డౌన్ అమలుకు మెర్కెల్ సంసిద్ధంగా ఉన్నారని ఉరిక్ డెమ్మెర్ పేర్కొన్నారు. తాజా పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్ధపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న దృష్ట్యా లాక్డౌన్కు కసరత్తు సాగిస్తున్నామని చెప్పారు.
గత ఏడాది నవంబర్ నుంచి జర్మనీలో లాక్డౌన్ తరహా నియంత్రణలు అమల్లో ఉన్నా గత కొద్ది వారాలుగా బ్రిటన్ వేరియంట్ కేసుల పెరుగుదలతో మహమ్మారిని అదుపులోకి తీసుకురావడం సంక్లిష్టంగా మారింది. మార్చిలో మెర్కెల్ సహా పదహారు రాష్ట్రాల నేతలు పాల్గొన్న సమావేశంలో వైరస్ను కట్టడి చేసేందుకు కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన షట్డౌన్లు, కర్ఫ్యూ విధించాలనే అభిప్రాయం వెల్లడైంది. మరోవైపు కరోనా నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టేలా ఇన్ఫెక్షన్ ప్రొటెక్షన్ చట్టాన్ని సవరించేందుకు మెర్కెల్ సన్నద్ధమయ్యారు.