Basara : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గోదావరి జలాలు పారుతున్నా గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లి(Boyagalli)కి చెందిన 30 కుటుంబాల ప్రజలు. గత నాలుగు రోజుల నుండి కాలనీలో మంచినీరు రావడంలేదు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు మండిపడుతున్నారు.
పనులు మానుకొని గంటల తరబడి నీటి పంపుల వద్ద మంచి నీటి కోసం వేచి చూస్తున్నామని వాపోతున్నారు. నీటి కొరత కారణంగా తమ పిల్లలను బడికి స్నానాలు చేయించకుండానే పంపుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీకి త్రాగునీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.