కట్టంగూర్, జూలై 30 : తెలంగాణ జలసిరి – జల సంచాయ్, జన భాగిదరి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేసి, గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్.ప్రేమ్ కరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కట్టంగూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తెలంగాణ జలసిరి, జల సంచయ్, జన భాగీదారి, వీబీ జీ-రామ్ జీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పనుల పురోగతి, గ్రామ సభల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో జల సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, పనుల నాణ్యతతో పాటు పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జి.అంజన్ రెడ్డి, కార్యాలయ పర్యవేక్షకులు బి.రమేష్, ఏపీఓ కడెం రామ్మోహన్, టీఏలు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.