సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : క్యాష్ టార్గెట్లు రీచ్ కావాల్సిందేనని డిపో మేనేజర్లు కండక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు. నిర్దేశించిన టార్గెట్లు తేకపోతే మెమోలు ఇస్తున్నారంటూ కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అన్నీ ఆధార్ కార్డ్ టిక్కెట్లేనా? డబ్బులేవీ? కనీసం 60 శాతం క్యాష్ తీసుకురావాలన్న టార్గెట్ మరిచిపోతే ఎట్లా’ అంటూ డిపో మేనేజర్లు హెచ్చరిస్తున్నారని వాపోతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా 90 శాతం మహిళా ప్రయాణికులతోనే నిండిపోతున్నది.
పురుషులు కూర్చోవడానికి సీట్లు దొరకడం లేదని ఎక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టార్గెట్లు పెట్టడం సరైంది కాదని యూనియన్ నాయకులు అంటున్నారు. బస్సులో ఆక్యుపెన్సీ పెరిగినా అందులో చెల్లింపులు చేసే పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో క్యాష్ కలెక్షన్స్ తగ్గుతున్నదని అంటున్నారు. గ్రేటర్లో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో మహిళా ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న విషయం యాజమాన్యం దృష్టిలో ఉన్నా.. డిపో మేనేజర్ల ద్వారా కండక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
నగరంలో ఒక్క కండక్టర్కు రోజుకు 10వేలపైనా కలెక్షన్ తీసుకురావాలంటున్నారని కొందరు కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్షన్ తక్కువగా వచ్చిందని వివరణ కోరడం, మెమోలు ఇవ్వడం, పనితీరును ప్రశ్నించడం వంటి చర్యలు పెరిగాయని కండక్టర్లు చెబుతున్నారు. మరోవైపు రద్దీగా ఉండే బస్సులో ఉచిత బస్సు స్కీంతో ఆధార్ నంబర్ చూసి జీరో టికెట్ ఇవ్వడం కండక్టర్లకు పెద్ద అవరోధంగా మారింది. టికెట్స్ జారీ చేసే టిమ్ యంత్రాలు మోరాయిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.