నగోయా: ఆసియా క్రీడాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటే ఆటల పండుగ మొదలైంది. నిర్వహణ లోపాలు, ఇరుకైన వసతుల వివాదాలను పక్కనబెడుతూ 20వ ఎడిషన్ ఆసియా గేమ్స్ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఐచి-నగోయా వేదికగా హార్మోనిక్ హార్ట్బీట్ (హృదయాల స్పందన) అనే ప్రధాన ఇతివృత్తంతో సాగిన ప్రారంభోత్సవంలో ఆతిథ్య జపాన్ తన హైటెక్ పారిశ్రామిక శక్తిని, ప్రాంచీన సాంస్కృతిక మూలాలను ప్రపంచానికి చాటిచెప్పింది. మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య అధిపతి కోవర్టీ, ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు అల్ థానీ సమక్షంలో జపాన్ చక్రవర్తి నరుహిటో క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. అక్టోబర్ 4 వరకు జరిగే మెగా ఈవెంట్లో 45 దేశాల నుంచి దాదాపు 11 వేల మంది అథ్లెట్లు 43 క్రీడల్లో పోటీపడనున్నారు.
సాంకేతికత, సంస్కృతిని జోడించి
1958 (టోక్యో), 1994 (హిరోషిమా) తర్వాత మూడోసారి ఆసియాడ్కు ఆతిథ్యమిస్తున్న జపాన్ ఆరంభ వేడుకల్లో తన మార్కును చాటుకుంది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఓపెనింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఆసియా ఖండమంతా హృదయపూర్వకంగా అనుసంధానం కావాలనే భావనకు సంకేతంగా ప్రధాన వేదికను గుండె ఆకారంలో తీర్చిదిద్దారు. జపాన్ సాంప్రదాయ కాబుకి రంగాన్ని, పారిశ్రామిక నగరమైన నగోయా ప్రతీకగా జెండా ఊపుతున్న భారీ రోబోటిక్ హ్యాండ్ను ప్రదర్శించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు టారో హకాసే సంగీతానికి అనుగుణంగా గుండె ఆకారపు రెక్కలున్న డ్రోన్లు, లేజర్ వెలుగులు స్టేడియాన్ని కాంతివంతం చేశాయి. వేదిక కింద నుంచి వచ్చిన 240 మంది డ్యాన్సర్లు ఆయా దేశాల క్రీడాకారులకు స్వాగతం పలుకుతున్నట్టుగా వెల్కమ్ అనే అక్షరాలను నృత్య రూపకంతో ఆవిష్కరించారు. వేడుకల రెండో భాగం ఐచి-నగోయా ప్రాచీన సంస్కృతిని, ఆధునిక సాంకేతిక ప్రతిభను ఆవిష్కరించింది. పాతకాలపు గడియారాల తయారీ నుంచి నేటి డిజిటల్ సాంకేతికత వరకు సాధించిన ప్రగతిని చాటుతూ నిర్వహించిన లేజర్ షో, ఎల్ఈడీ నృత్యాలు అలరించాయి. టార్చ్ రిలే ముగింపులో ప్రధాన జ్యోతిని వెలిగించడంతో ప్రారంభోత్సవం ముగిసింది.
ఆకట్టుకున్న భారత మార్చ్పాస్ట్
46 జట్ల మార్చ్పాస్ట్లో భారత బృందం ఎంతో ఉత్సాహంగా ప్రవేశించింది. స్టార్ షూటర్ మను భాకర్ ముదురు నీలం రంగు చీరలో, కబడ్డీ స్టార్ పవన్ సెహ్రావత్ బంద్ గలా జాకెట్లో భారత జాతీయ పతాకాన్ని చేతబూని 150 మంది సభ్యుల క్రీడా దళాన్ని ముందుండి నడిపారు. సాంప్రదాయం ప్రకారం చివరగా అడుగుపెట్టిన జపాన్ జట్టుకు ప్రేక్షకుల నుంచి భారీ కరతాళ ధ్వనులు లభించాయి. జపాన్ ఈ క్రీడల్లో అత్యధికంగా 900 మందికి పైగా అథ్లెట్లను దించుతోంది.
కిట్ ఆలస్యం.. మారిన భారత పతాకధారి
ప్రారంభోత్సవానికి ఎంపికైన భారత పతాకధారి చివరి నిమిషంలో మారడం చర్చనీయాంశమైంది. ముందుగా మను భాకర్తో కలిసి వెటరన్ అథ్లెట్ తజీందర్ సింగ్ను ఎంపిక చేశారు. కానీ, ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా తీసుకొస్తున్న దుస్తులు (సెరమోనియల్ కిట్) లగేజ్ నగోయా విమానాశ్రయానికి చేరుకోవడం ఆలస్యమైంది. దాంతో నిర్ణీత సమయానికి వేదికకు చేరుకోలేక తజీందర్పాల్ వేడుకకు దూరమయ్యాడు. అతని స్థానంలో గత ఆసియాడ్ పసిడి విజేత, కబడ్డీ స్టార్ పవన్ సెహ్రావత్ను పతాకధారిగా భారత ఒలింపిక్ సంఘం ఎంపిక చేసింది.