వేణన్నయ్య చెప్పే జోకుల్లో ఒకటి.. గుర్రప్పందాలలో పెట్టుబడి పెట్టే వ్యక్తి ఒక కొత్త గుర్రాన్ని కొనుక్కొచ్చాడట. ఎవరో మోసం చేసి అమ్మారేమో… ఆ గుర్రం బాగా తినేది కానీ పరిగెత్తడం లేదట. వెంటనే ఆయనొక గుర్రాల డాక్టర్ దగ్గరికి వెళ్లి ‘నేను ఈ గుర్రం మీద బోలెడు ఖర్చు పెట్టాను, ఎలాగైనా సరే నా గుర్రం పందెంలో గెలవాలి’ అంటే ఆ డాక్టర్ మొట్టమొదట ఒక పసుపు రంగు టాబ్లెట్ ఇచ్చి ‘పందెం మొదలయ్యే ముందు గుర్రం తోక లేపి ఈ టాబ్లెట్ పెట్టు, బాగా పరిగెత్తుతుంది’ అని చెప్పాడట.
ఆయన అట్లాగే చేస్తే గుర్రం ఆరోజు మూడోస్థానంలో వచ్చిందట. మళ్లీ ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్లి జరిగింది చెబితే ఈసారి డాక్టర్ మరికొన్ని డబ్బులు తీసుకొని ఒక ఆకుపచ్చ టాబ్లెట్ ఇచ్చి అదే విధంగా పెట్టమన్నాడట. ఈయన అలాగే తోక కింద మళ్లీ పెట్టాడు. ఈసారి గుర్రం రెండో స్థానంలో వచ్చింది. సరే మళ్లీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. ఈసారి ఆయన ఎర్రటి టాబ్లెట్ ఇచ్చాడట. ‘ఇదేంటీ, ఈ టాబ్లెట్ ముందు వాటికంటే చిన్నగా ఉంది?’ అని గుర్రమాయన అడిగాడట. ‘మరి గుర్రం ఫస్ట్ రావాలంటున్నావు కదా! ఈసారి ఇది నువ్వు పెట్టుకో!’ అన్నాడట డాక్టర్. ఈ జోక్ చెబుతుంటే ఉష వాళ్లాయన్ని కోప్పడి ‘ఛీ! ఇట్లా కుళ్లు జోకులు చెప్పొద్దు’ అని వారించింది.
ఉష వాళ్ల చెల్లి గీత చాలా స్పీడుగా, గంటకు నూటా ఇరవై కిలోమీటర్ల వేగంతో మాట్లాడేది. తను మాట్లాడే మాటల్లోంచి అర్థాన్ని వెతుక్కోవడం చాలా కష్టంగా వుండేది. ‘ఏందీ? ఏందీ.. ఏమన్నవ్?’ అని మళ్లీ మళ్లీ అడిగేవాళ్లం. ఆమె చదువు ఎందుకోగానీ కొనసాగలేదు. గీతకి కూడా తొందరగానే పెళ్లి చేశారు. వాళ్లు ఇక్కడి నుంచి వరంగల్ వెళ్లాక పెళ్లి జరిగిందనుకుంటా! అయితే గీత ప్రెగ్నెంట్ అయ్యాక బాగా వీక్ అయిందనీ, ఆమె డెలివరీ టైమ్లో రక్తం చాలా పోవడం వల్ల నిమిషాల మీద ప్రాణాపాయం కలిగిందనీ, రక్తం ఎక్కించినా కూడా ఆమెను కాపాడుకోలేకపోయారనీ, అప్పుడే గీత చనిపోయిందనీ తర్వాత చాలా రోజులకి తెలిసి ఎంతో బాధ కలిగింది. మనం బాగా దగ్గరగా చూసిన వ్యక్తి… ఆడుతూ పాడుతూ బాగా కబుర్లు చెబుతూ ఉన్న మనిషి లేకుండా పోయిందని తెలిసిన రోజున తనను తల్చుకుని దుఃఖపడ్డాను.
కాలం ఎంత చిత్రమైందంటే ఎంత దూరం ఉన్న మనుషుల్ని కూడా ఒక్కోసారి ఎక్కడో ఒకచోట కలుపుతుంది. ఎంత దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని కూడా దూరం చేస్తుంది. అలాగే ఈ ప్రపంచం ఎంత చిన్నది అంటే మనం మళ్లీ కలవరేమో అనుకున్న వ్యక్తులు కూడా ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ మనకు తారసపడతారు. ఉష వాళ్ల తమ్ముడు జయపాల్ ఆ తర్వాత ఎక్కడ చదువుకున్నాడో ఏమో కానీ మళ్లీ కలవలేదు.
ఆరేడేళ్ల తర్వాత నా డిగ్రీ పూర్తయి పెళ్లి అయినాక నేను మొదట కాకతీయ గ్రామీణ బ్యాంకులో సెలెక్ట్ అయి చేరాక దాదాపు ఆరు నెలలకే మరొక రిక్రూట్మెంట్ అయింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పెట్టుబడితో అప్పట్లో గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయి. కాకతీయ గ్రామీణ బ్యాంకు ఎస్బీఐ కంట్రోల్లో ఉండేది. నేనప్పుడు హెడ్ ఆఫీస్లో హెచ్ఆర్లో పనిచేస్తూ ఉండేదాన్ని. వాళ్ల ఇంటర్వ్యూస్కి కావలసిన అన్ని పేపర్లు నేనే సమకూర్చాను. బ్యాంకు చైర్మన్ రంగనాయకులుగారు ఉండేవారు. అప్పుడు ఫైల్స్ చూస్తుంటే ఎస్. జయపాల్ అనే పేరు కనబడి చూస్తే జయపాల్ ఫొటోనే కనిపించింది. అతని పేరు చివర రెడ్డి అని పెట్టుకునేవాడు కాదు. చైర్మన్ గారికి నా వర్క్, సిన్సియారిటీ బాగా నచ్చేవి. ‘వీళ్లల్లో ఎవరైనా మీకు తెలుసామ్మా?’ అనడిగితే జయపాల్ తెలుసు అని చెప్పాను. అఫ్ కోర్స్.. జయపాల్కి మెరిట్ని బట్టే జాబ్ వచ్చిందనుకోండి.
తొందర్లోనే కొత్త బ్యాచ్ వచ్చి చేరారు. మొట్టమొదట జయపాల్ జాయిన్ అయిన రోజున ‘అక్కా! నువ్వు ఇక్కడే ఉన్నావు, నాకు బాగా హ్యాపీగా ఉంది!’ అన్నాడు. జయపాల్ నాతోపాటు చేరటంతో నాక్కూడా చాలా సంతోషం అయింది. ఇద్దరం మళ్లీ పాత ముచ్చట్లు కొన్ని గుర్తు చేసుకున్నాం. ఆ తర్వాత నేను ఆంధ్ర బ్యాంకులో సెలెక్ట్ అవడంతో ఆ బ్యాంకు వదిలేసి ఆంధ్ర బ్యాంకులో చేరాను. జయపాల్ కూడా ఆ బ్యాంకులో ఉద్యోగం రిజైన్ చేసి అమెరికాకు వెళ్లిపోయాడు. చాలా రోజుల తర్వాత ఎప్పుడో ఒకసారి కలిశాడు. కానీ, మళ్లీ ఆ తర్వాత ఎప్పుడు కూడా వాళ్ల గురించి వినలేదు. ఉష కానీ, జయపాల్ కానీ టచ్లో లేరు. ఇప్పుడు ఎక్కడున్నారో గానీ, ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడల్లా ఆ రోజులు, ఆ స్నేహాలు గుర్తొస్తాయి.