హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘చెరపకురా చెడేవు..’ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ సామెతను గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై తప్పుడు ఆరోపణలతో బట్టకాల్చి మీదేసే వ్యవహారం వారిలో ఆందోళన కలిగిస్తున్నది. రెండు రోజుల క్రితం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యి, ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పుడు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై, కేటీఆర్, హరీశ్రావుపై, వారి కుటుంబంపై భూముల విషయంలో చేస్తున్న రాజకీయ ఆరోపణలు భవిష్యత్తులో తమకు ముప్పు తెచ్చిపెట్టడం ఖాయమని వారు ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం. ‘ఇప్పుడు వాళ్ల లెక్కలు తీస్తున్నాం.
రేపు బీఆర్ఎస్ వాళ్లు మన భూముల లెక్కలు తీస్తే పరిస్థితి ఏంది?’ అని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంను ప్రశ్నించినట్టు తెలిసింది. ‘వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడేమీ కాదు.. మనం అధికార పక్షంలో ఉన్నాం, ప్రజలకు ఏం సమాధానం చెప్తాం’ అని నిలదీసినట్టు తెలిసింది. మనందరికీ నిబంధనలకు విరుద్ధంగా భూములు లేవా? వాటి గురించి ఏం చేద్దాం? అని ప్రశ్నించినట్టు సమాచారం. అందరికీ ఎక్కడో ఒక చోట చిన్నదో, పెద్దదో ఫామ్హౌస్లు ఉన్నాయని, ఇది ప్రస్తుత కాలంలో కామన్గా మారిపోయిందని అన్నట్టుగా తెలిసింది. బీఆర్ఎస్ వాళ్లు మనందరి ఫామ్హౌస్ల లెక్కలు తీసి ప్రజల ముందుపెడితే ఎలా? అని ప్రశ్నించినట్టుగా సమాచారం.
ఎలాగూ మన ప్రభుత్వం మరోసారి వచ్చే పరిస్థితిలేదని, వచ్చేది పక్కాగా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆ తర్వాత తమ పరిస్థితి ఏందని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ భేటీ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి తీరును ఇద్దరు మంత్రులు ఎండగట్టినట్టుగా తెలిసింది. ‘కేసీఆర్ కుటుంబం భూముల వివాదంలో మీరు అనుసరిస్తున్న విధానం తప్పుగా అనిపిస్తున్నది’ అని కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. దీనిపై పునరాలోచన చేసుకోవాలని, లేనిపక్షంలో తమ ప్రభుత్వానికి, పార్టీకి ఉరితాడై బిగుసుకుంటుందని, దళితులతో పెట్టుకోవడం మంచిది కాదని తేల్చి చెప్పినట్టుగా తెలిసింది.
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం భూవిస్తీర్ణంపై సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ఆరోపణలు సైతం ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది. ‘ఎన్నికల సమయంలో, నెలరోజుల కిందటి వరకూ మీరే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వెయ్యి ఎకరాలంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 67 ఎకరాలు మాత్రమేనని లెక్కలతో సహా చెప్పారు. ఇదేం విధానం, ఏం చెప్పదలుచుకుంటున్నారు?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. మీరే వెయ్యి ఎకరాలని ఆరోపించి, ఇప్పుడు మీరే మీ నోటితో 67 ఎకరాలని ఎలా చెప్తారని నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. మీరే కేసీఆర్కు క్లీన్చిట్ ఇచ్చారని అన్నట్టు తెలిసింది. ఇలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని వారించినట్టు సమాచారం.