Omicron fears | మరోసారి కరోనా నీడలు అలుముకుంటున్నాయి. ఏ దేశంలో చూసినా ఒమిక్రాన్ భయాలే. కానీ, కరోనా కొత్తరూపం విషయంలో పెద్దగా ఆందోళన అవసరం లేదనీ, డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తున్నా.. రోగులపై పెద్దగా ప్రభావం చూపడం లేదనీ భరోసా ఇస్తున్నారు నిపుణులు. పెద్దల వరకూ ఫర్వాలేదు. మరి, పిల్లల మీద ప్రభావం ఎంత? ఒమిక్రాన్ వేరియంట్ థర్డ్వేవ్గా మారనుందా?.. ఇలా అనేకానేక విషయాలపై ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి విశ్లేషణ..
సాధారణంగా ఏ వైరస్లో అయినా ఐదారు ఉత్పరివర్తనాలు వస్తుంటాయి. డెల్టాలో 10 వరకూ వచ్చాయి. ఒమిక్రాన్లో అయితే.. స్పైక్ ప్రొటీన్లో ఏకంగా 32 ఉత్పరివర్తనాలు చోటుచేసుకున్నాయి. అందువల్లే డెల్టాతో పోలిస్తే, ఇన్ఫెక్షన్లు వచ్చే ఆస్కారం ఆరురెట్లు అధికం. సాధారణంగా కరోనా ఒకసారి వచ్చిన వారికి, రెండోసారి వైరస్ సోకదు. కానీ, డెల్టా వేరియంట్లో రెండోసారి సోకుతున్న సందర్భాలు ఉన్నాయి. ఒమిక్రాన్లో రీ-ఇన్ఫెక్షన్ అవకాశాలు మూడురెట్లు అధికం.
ఒమిక్రాన్ వైరస్ను తొలిసారిగా నవంబర్ 9న బోట్స్వానాలో, నవంబర్ 11న దక్షిణాఫ్రికాలో గుర్తించారు. తరువాత ఆ వైరస్ ప్రపంచంలో పలు దేశాలకు వ్యాపించింది. ఇలా జరగడానికి ఓ కారణం ఉంది. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ రోగుల సంఖ్య అధికం. అంతే కాకుండా, అక్కడ 20 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. దీనివల్ల వైరస్ ఎక్కువ మందికి వ్యాపించింది. ఈ క్రమంలో అక్కడున్న ఒక హెచ్ఐవీ రోగిలో ఈ వైరస్ ఎక్కువ కాలం ఉండిపోయింది. సాధారణంగా కరోనా వైరస్ మనిషిలో రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉండదు. రెండు వారాల్లో మనిషి అయినా చనిపోతాడు, వైరస్ అయినా చస్తుంది. కానీ అక్కడ ఒక హెచ్ఐవీ రోగిలో రెండు మూడు నెలలపాటు తిష్ఠవేసింది. ఈ వ్యవధిలో వైరస్లో డూప్లికేషన్ జరిగి పలు మార్పులు చోటుచేసుకున్నాయి. మూడు నెలల తరువాత వైరస్ బయటపడి ఇలా తీవ్రంగా మారింది.
స్పైక్ ప్రొటీన్లో 32 కొత్త ఉత్పరివర్తనాలు ఏర్పడటం వల్ల వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ అధికమే అయినా.. పెద్దగా ప్రమాదకరం కాదని తేలిపోయింది. రోగుల్లో జబ్బు తీవ్రతా కనిపించడం లేదు. వైరస్ సోకిన వారిలో ఒంటి నొప్పులు, తలనొప్పి, జలుబు వచ్చి పోతున్నాయంతే.
దక్షిణాఫ్రికా వైద్య నిపుణుల ప్రకారం.. ఇప్పటివరకు అక్కడ ఒక్క ఒమిక్రాన్ మరణం కూడా నమోదు కాలేదు. వైరస్ చాలా స్వల్పంగా వచ్చి పోతున్నది. దవాఖానలో చేరాల్సిన పరిస్థితి లేనే లేదు. డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తున్నా, జబ్బులో తీవ్రత లేకపోవడం శుభ పరిణామమే. ప్రపంచమంతా విస్తరించడంతో అందరికీ ఇమ్యూనిటీ వస్తుంది. దీనివల్ల, భవిష్యత్తులో కొత్తరకం కరోనా రాదు. దీన్నే ‘నేచర్ వ్యాక్సిన్’ (సహజ టీకా) అంటారు.
ఏదైనా వైరస్ తీవ్రరూపంలో వచ్చినప్పుడు, అది మనిషి శరీరంలో చేరితే ఆ వ్యక్తి చనిపోతాడు, వైరస్ కూడా చనిపోతుంది. కానీ ఓ మోస్తరుగా వస్తే మనిషి బతుకుతాడు, వైరస్ కూడా బతుకుతుంది. అలా జరగాలంటే వైరస్ ప్రకృతిలో కలిసిపోవాలి. దీనివల్ల అది చివరి దశకు చేరుకుంటుంది. అంటే, వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కానీ తక్కువ జబ్బును కలిగిస్తుంది. అందుకే దీన్ని చివరి దశ అంటారు. ఒమిక్రాన్ను ‘ఇమ్యూన్ ఎస్కేప్’ అనీ అంటున్నారు. కానీ ఇది పూర్తిస్థాయి ఇమ్యూన్ ఎస్కేప్ మాత్రం కాదు. వైరస్లోని స్పైక్ ప్రొటీన్లో ఎక్కువ ఉత్పరివర్తనాలు ఉండటం వల్ల ఒమిక్రాన్పై అన్ని రకాల యాంటీబాడీస్ పనిచేయవు. ఒమిక్రాన్ కోసం ఫైజర్ సంస్థ ఒక కొత్త ఔషధాన్ని తయారుచేసింది. ఇది బాగానే ప్రభావం చూపుతున్నది. అంతే కాకుండా సొట్రా-వి మ్యాబ్ అనే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా విజయవంతంగా పనిచేస్తున్నది. కరోనా చివరి దశ తరువాత, వైరస్ అనేది సంవత్సరానికి ఒకసారి సాధారణ జబ్బులా వచ్చిపోయే అవకాశాలు
ఉంటాయి. ఏడాదికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే, ఆ మాత్రం జబ్బు కూడా రాదు.
గత వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. నిజమే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పెద్దలతో పోలిస్తే.. పిల్లలే ఎక్కువగా ఆసుపత్రి పాలు అవుతున్నారు. కానీ అవన్నీ ఒమిక్రాన్ కేసులు కాదు. పిల్లల్లో వచ్చినా చాలా స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో వయోధికులే ఎక్కువ శాతం వ్యాక్సిన్ తీసుకున్నారు. పిల్లల వరకూ టీకాలు రానేలేదు. ఫలితంగా, చిన్నవయసువారే అధికంగా ఒమిక్రాన్కు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకోకపోయినా కూడా, పిల్లల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీన్నిబట్టి, ఒమిక్రాన్కు వయసుతో సంబంధం లేదని చెప్పవచ్చు. వైరస్ ముప్పు నుంచి తప్పించేందుకు పిల్లలకు సైతం టీకాలు ఇవ్వాలని మేం ప్రభుత్వాలకు సూచిస్తున్నాం. కొవాగ్జిన్, బయోలాజికల్-ఇ(బిఇ) వ్యాక్సిన్లను పిల్లల కోసమే ప్రత్యేకంగా తయారు చేశారు. వీటికి సంబంధించిన డేటా కూడా ప్రభుత్వానికి చేరింది. సర్కారు ఆమోదించడమే ఆలస్యం.
ఒమిక్రాన్ను ఇప్పుడే థర్డ్వేవ్గా భావించలేం. వచ్చినా పాక్షికంగానే వస్తుంది. కేసులు ఒక్కసారిగా పెరిగితేనే దాన్ని ‘వేవ్’ అంటారు. వేవ్గా నిర్ధారించాలంటే.. మూడు లక్షణాలు ఉంటాయి. ఒకటి, కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం. రెండు, దవాఖానలో చేరేవారి సంఖ్య పెరగడం. మూడు, మరణాల రేటు అధికం కావడం. అయితే, ఒమిక్రాన్ విషయంలో మాత్రం వేవ్లోని మొదటి లక్షణం మాత్రమే కనిపించవచ్చు. కేసుల సంఖ్య మాత్రమే పెరుగుతున్నది. మిగిలిన రెండూ.. హాస్పిటలైజేషన్, మరణాల రేటు పెద్దగా ఉండకపోవచ్చు. జనవరి, ఫిబ్రవరిలో కేసుల సంఖ్య కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జనవరి చివరిలోపు ప్రతి ఒక్కరూ టీకా తీసుకుంటే ఆ సమస్య కూడా రాకపోవచ్చు.
ఒమిక్రాన్ను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఖర్చుతో కూడినది. ఫలితం రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. అదే పీసీఆర్ పరీక్షలో రెండు మూడు గంటల్లోనే తేలిపోతుంది. కరోనా వైరస్లో ఎస్-జీన్ ఉంటుంది. ఒమిక్రాన్లో ఎస్-జీన్ ఉండదు. పీసీఆర్లో ఎస్-జీన్ కిట్ ద్వారా పాజిటివ్ వచ్చిన వ్యక్తిలో ఎస్-జీన్ ఉందో లేదో కొద్ది గంటల్లోనే తెలుసుకోవచ్చు. ఎస్-జీన్ ఉంటే అది పాత కరోనా వేరియంట్గాను, లేకపోతే ఒమిక్రాన్గాను నిర్ధారించవచ్చు.
ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు ఒమిక్రాన్పై కూడా పనిచేస్తున్నాయని నిర్ధారించారు. కాబట్టి టీకాల పనితీరుపై సందేహాలు పక్కనపెట్టి, వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ టీకాలు ఒమిక్రాన్పై కనీసం 50 శాతం మేర సమర్థంగా పనిచేస్తాయి. దీనివల్ల జబ్బు తీవ్రరూపం దాల్చకుండా ఉంటుంది. రెండు డోసులూ పూర్తయిన వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి. బూస్టర్ విషయమై ఇప్పటికే మేం ప్రభుత్వానికి స్పష్టమైన సూచన చేశాం. కరోనా సోకిన వారిలోగాని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలోగాని ఆరు నెలల తరువాత పరీక్షలు జరిపితే.. యాంటీబాడీస్ గణనీయంగా తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నది. యాంటీబాడీస్ తగ్గిపోతే మళ్లీ ఇన్
ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే రెండు డోసులు పూర్తయిన ఆరు నెలల తరువాత, బూస్టర్ డోసు తీసుకోవాలి. బూస్టర్లో క్రాస్ వ్యాక్సిన్ మంచిది. అంటే మొదటి రెండు డోసులు ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకున్న వారు, బూస్టర్ డోస్లో వేరే రకమైన వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో రెండు వేరువేరు యాంటీబాడీస్ ఉత్పన్నం అవుతాయి. ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకుంటే 900 యాంటీబాడీస్ వస్తున్నాయి. క్రాస్ వ్యాక్సిన్ అయితే 1800 యాంటీబాడీస్ వస్తున్నాయి. బూస్టర్కు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలుపలేదు. కాకపోతే, ఒమిక్రాన్ తరువాత, ప్రభుత్వం కొంత సానుకూలంగానే ఉన్నది. ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వేరియంట్ ఏమంత ప్రమాదకారి కాదు. వచ్చినా స్వల్ప లక్షణాలే కనిపిస్తాయి. సాధారణ చికిత్సతో తగ్గిపోతుంది. ఆక్సిజన్ అవసరం పడదు. మాస్కు, వెంటిలేషన్, టీకా, టెస్టింగ్ నియమాలను తప్పక పాటించాలి. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. పోస్ట్ కరోనాలో సైతం ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రీ-ఇన్ఫెక్షన్స్ వచ్చినా, స్వల్ప లక్షణాలతో వచ్చిపోతుంది. ఈ వేరియంట్ డెల్టాలా శరీర భాగాలపై దాడి చేయడం లేదు. కాబట్టి, ఒమిక్రాన్ విషయంలో ఆందోళనే అవసరం లేదు.
ఒమిక్రాన్ వల్ల ఇమ్యూనిటీ వస్తుంది. అంతేకాదు, ఒమిక్రాన్ రాకతో ప్రజల్లో వ్యాక్సినేషన్పై అవగాహన పెరిగింది. గతంలో చాలామంది, మొదటి డోస్ తీసుకుని రెండో డోస్పై నిర్లక్ష్యం వహించారు. కానీ ఇప్పుడు, వాక్సిన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా జాగ్రత్తలు కూడా పెరిగాయి. మొన్నటివరకు మాస్కులను నిర్లక్ష్యం చేసినవారు కూడా ఇప్పుడు ధరిస్తున్నారు. బూస్టర్ డోసు కోసం కూడా ఆరా తీస్తున్నారు. ఇదంతా ఒమిక్రాన్ వల్ల వచ్చిన చైతన్యమే.
కరోనా అయినా, ఒమిక్రాన్ అయినా.. మనం నాలుగు నియమాలు కచ్చితంగా పాటించాలి.
అవే.. ఎం.వి.వి.టి.
☛ఎం- మాస్క్ ధరించడం. మాస్క్ వల్ల వైరస్ నుంచి రక్షణ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వ్యాక్సిన్ కంటే కూడా మాస్కు ద్వారానే అధిక రక్షణ లభిస్తుంది.
☞ వి- వ్యాక్సినేషన్. వ్యాక్సిన్తో వైరస్ నుంచి కచ్చితంగా రక్షణ ఉంటుంది. పాత వైరస్ నుంచి 100 శాతం, కొత్త వైరస్ నుంచి కనీసం 50 శాతం రక్షణ ఉంటుందని చెప్పవచ్చు.
☛ వి- వెంటిలేషన్. ఇంట్లో తలుపులు, కిటికీలు తెరిచి పెట్టుకోవాలి. గాలి, వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి.
☞ టి- టెస్టింగ్. ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించు
కోవాలి. దీనివల్ల వెంటనే చికిత్స తీసుకోవచ్చు, ఇతరులకు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్
సీఎండీ, ఏఐజీ హాస్పిటల్
✍ మహేశ్వర్రావు బండారి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Omicron | ఒమిక్రాన్ చాలా ప్రమాదకారి.. కానీ డేటా లేదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
First Omicron death: యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం.. ధృవీకరించిన బ్రిటన్ ప్రధాని
ఏప్రిల్ నాటికి బ్రిటన్లో 75వేల ఒమిక్రాన్ మరణాలు!
Omicron | ఒమిక్రాన్ వేరియంట్కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
Omicron | ఒమిక్రాన్తో టీకా వీక్.. డెల్టా కంటే వేగంగా వ్యాప్తి
ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. బాధితుడి గ్రామంలో కరోనా పరీక్షలు..
Omicron | ఒమిక్రాన్ బాధితులలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ తీసుకున్నవారే : అమెరికా
Omicron variant | గుడ్న్యూస్.. ఈ ఒక్క ట్రీట్మెంట్తో ఒమిక్రాన్ ఖతం!!