న్యూఢిల్లీ, డిసెంబర్ 12: కరోనా టీకాల సామర్థ్యాన్ని ఒమిక్రాన్ తగ్గిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆదివారం హెచ్చరించింది. దీనికి డెల్టా కంటే వేగంగా వ్యాప్తించే గుణం ఉందని పేర్కొన్నది. ప్రస్తుతం ఉన్న డాటాను బట్టి.. వైరస్ సామాజిక వ్యాప్తి దశకు(కమ్యూనిటీ స్ప్రెడ్) చేరితే డెల్టా వేరియంట్ కేసులను మించిపోవచ్చని అంచనా వేసింది. అయితే ఈ వేరియంట్ సోకితే లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నట్టు ప్రాథమిక సమాచారంలో తేలినట్టు తెలిపింది. కానీ, లక్షణాలపై ఇప్పుడే నిర్ధాణకు రావొద్దని, ఎందుకంటే అందుబాటులో ఉన్న సమాచారం చాలా తక్కువ అని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 63 దేశాలకు విస్తరించింది.
ఇండియాలో మూడో వేవ్పై డబ్ల్యూహెచ్వో ఆగ్నేయాసియా దేశాల డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా వేవ్ వస్తుందని, పరిస్థితులు దయనీయంగా మారుతాయి అని చెప్పలేం. కానీ అనిశ్చితి మాత్రం తప్పక ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు. ఒరిజినల్ వైరస్తో పోలిస్తే భారీ జన్యుమార్పులతో ఏర్పడిన ఒమిక్రాన్ వేరియంట్.. మహమ్మారి వ్యాప్తిపై ప్రభావం చూపిస్తుందన్నారు. అయితే ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. ఇది తెలుసుకోవడానికి డబ్ల్యూహెచ్వో పలు దేశాల నుంచి మరింత సమాచారం కోరిందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రత ఎక్కువే
ఒమిక్రాన్ వ్యాప్తి వేగం, అది సోకితే వ్యాధి తీవ్రత, రీ ఇన్ఫెక్షన్ రేటుపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయని పూనమ్ తెలిపారు. ‘డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే, అప్పుడే నిర్ధారణకు రాలేం’ అని చెప్పారు. ‘మహమ్మారి ఇంకా వెళ్లిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉంది. మనం తప్పక జాగ్రత్తలు పాటించాలి. నిఘాను పెంచాలి. వైద్యానికి మౌలిక వసతులు పెంచాలి’ అన్నారు. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 59 దేశాలకు విస్తరించింది. దేశంలో 37 కేసులు నమోదయ్యాయి.
బూస్టర్తో ఒమిక్రాన్ నుంచి రక్షణ
ఒమిక్రాన్ నుంచి రక్షణకు బూస్టర్ డోసు చాలా సులభమైన మార్గమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బూస్టర్ డోసుతో శరీరంలో యాంటిబాడీలు పెరుగుతాయని, తద్వారా వేరియంట్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాధి నిరోధకత తక్కువ ఉన్న వారికి చాలా మంచిదని చెబుతున్నారు. ఆక్స్ఫర్డ్-అస్ట్రాజెనెకా టీకా బూస్టర్ డోసు ఒమిక్రాన్ నుంచి 70-75% రక్షణనిస్తున్నదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకటించిన నేపథ్యంలో వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులు ఈ మేరకు స్పందించారు. తట్టు, పోలియోలాంటి(లైవ్ అటెన్యుయేటెడ్) వ్యాక్సిన్లు తప్ప మిగతా ఏ టీకాలు అయినా బూస్టర్ డోసు వేసుకుంటే శరీరంలో యాంటిబాడీలు గణనీయంగా పెరుగుతాయన్నారు. ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ కూడా ఇదే విషయం చెప్పారు. కాగా, బూస్టర్ డోసు అనేది భారతదేశంలో పరిస్థితుల దృష్ట్యా అంత ప్రాధాన్య అంశం ఏం కాదని ఎపిడమాలజిస్టు చంద్రకాంత్ లహరియా చెప్పారు.
38కి చేరిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఏపీ, కేరళ, చండీగఢ్లో తొలిసారిగా ఒక్కొక్కటి చొప్పున కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఒక్కో కేసు నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 18, రాజస్థాన్ 9, కర్ణాటక 3, ఢిల్లీ 2, ఏపీ, కేరళ, చంఢీగఢ్లలో ఒక్కొక్కటి చొప్పన రికార్డయ్యాయి.