సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ, జీహెచ్ఎంసీ కమిషనర్ల మధ్య కొరవడిన సమన్వయం, ఇంజినీర్ల బదిలీల అంశంలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుతో మున్సిపల్ యంత్రాంగం నవ్వులపాలవుతోంది. బదిలీల విషయంలో జీవో 575ను పకన పెట్టేశామని పైకి చెప్తున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో మాత్రం తమకు నచ్చినవారికి అదే జీవో ప్రకారం పోస్టింగులు కట్టబెడుతుండటం శాఖలో తీవ్ర దుమారం రేపుతోంది.
అందరి ట్రాన్స్ఫర్లు నిలిపివేశామంటున్న వేళ, సీనియర్ అధికారిణి వరలక్ష్మి విషయంలో ఈఎన్సీ మిగతా భాస్కర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అధికారులను విస్తుపోయేలా చేసింది. జీఓ 575 ప్రకారమే ఆమె జీహెచ్ఎంసీ నుంచి రిలీవ్ అయినట్లు భావించి పట్టణాభివృద్ధి శాఖలో చేర్చుకున్నారు. అయితే ఈ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా కమిషనర్ కర్ణన్.. వరలక్ష్మికి మళ్లీ జీహెచ్ఎంసీలోనే రీపోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఉన్నతాధికారుల మధ్య ఉన్న సమన్వయలోపానికి అద్దం పడుతోంది. అంతకుముందు ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వరలక్ష్మి కోరిన సెలవును కర్ణన్ నిరాకరించగా, ఆమె అనధికారికంగా సెలవులో వెళ్లారు. కానీ, కమిషనర్ సమాచారం లేకుండానే భాసర్ రెడ్డి ఆమె బదిలీ ప్రక్రియను పూర్తిచేయడం గమనార్హం.
సమయానికి ప్రమోషన్లు కల్పించడంలో ఈఎన్సీ భాసర్ రెడ్డి తీవ్రంగా విఫలమవ్వడమే మున్సిపల్ శాఖలో ప్రస్తుత గందరగోళ పరిస్థితులకు తానే కారణమని ఇంజినీర్ల అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమ కంటే ఎంతో జూనియర్లయిన ఇన్చార్జ్ ఎస్ఈల కింద పనిచేసేలా సీనియర్ ఈఈలను కేటాయించడంతో బల్దియాలో అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి.
గతంలో చార్మినార్ జోన్లో తనకంటే జూనియర్ ఎస్ఈగా ఉన్నాడనే నెపంతో బాధ్యతలు తీసుకోని ఓ సీనియర్ ఈఈని కమిషనర్ కర్ణన్ సస్పెండ్ చేశారు. తీరా ఇప్పుడు ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తూ మళ్లీ అదే జోన్లో అదే జూనియర్ కింద పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రామగుండం కార్పొరేషన్ నుంచి వచ్చిన మరో సీనియర్ ఈఈని, తనకంటే జూనియర్ ఉన్న గోలొండ జోన్ ఎస్ఈ కింద వేశారు. నల్లగొండ నుంచి బదిలీపై వచ్చిన సీనియర్ ఈఈ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కనీసం సీనియారిటీ జాబితా పరిశీలించే విచక్షణ కూడా లేకుండా పోస్టింగులు ఇచ్చే దుస్థితికి శాఖ దిగజారిందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.