Bhutan : భూటాన్లో శనివారం భూకంపం సంభవించింది. 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపాల తీవ్రతను కొలిచే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్సీఎస్) ఈ వివరాల్ని వెల్లడించింది. దీని ప్రకారం.. భూటాన్ ఈశాన్య ప్రాంతంలో శనివారం సాయంత్రం 4.01 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.9గా నమోదైంది.
గ్యెల్ఫోలంగ్కు 3 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. ఈశాన్య భూటాన్లోని అనేక ప్రాంతాల్లో ఈ భూకంపం నమోదైంది. అలాగే, సరిహద్దులో ఉన్న అసోంలోనూ కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనాలు వచ్చాయి. దీంతో అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇటు భూటాన్లోనూ, అటు అసోంలోనూ నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు నమోదు కాలేదు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతానికి తీవ్ర నష్టం నమోదు కాకపోయినప్పటికీ.. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నట్లు భూటాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు మూడు రోజుల క్రితం నేపాల్లో కూడా మరోసారి భూకంపం నమోదైన సంగతి తెలిసిందే. నేపాల్లో తాజాగా 4.5 తీవ్రతతో భూకంపం నమోదు కాగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.