లండన్: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బ్రిటన్లో 75వేల ఒమిక్రాన్ మరణాలు సంభవించే అవకాశముందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్ హెచ్చరించింది. ఒమిక్రాన్ వైరస్ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చినప్పటికీ దీని ప్రభావం బ్రిటన్పైనే ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడింది. ఈ వేరియంట్ వల్ల దవాఖానల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగొచ్చని తెలిపింది. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో బూస్టర్ డోస్ పంపిణీని బ్రిటన్ వేగవంతం చేస్తున్నది. ఇప్పటికే దాదాపు 2 కోట్ల మందికి ఆ దేశం బూస్టర్ డోస్ వేసింది. తాజాగా 30 ఏండ్లు నిండినవారందరికీ బూస్టర్ ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం నుంచి వీరికి బుకింగ్ ప్రారంభమవుతుంది. ‘ఒమిక్రాన్ను అడ్డుకోవడంలో బూస్టర్ డోస్ ఎంతో కీలకమైనదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో వీలైనంత త్వరగా ఎక్కువ మందికి ఈ డోస్ను వేయడానికి చర్యలు చేపడుతున్నాం’ అని అధికారులు తెలిపారు.