అమరావతి: విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది పలు చర్యలు తీసుకుంటుంది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి గత నెల 27న ముంబై మీదుగా విశాఖపట్నం వచ్చాడు. ముంబైలో అతనికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా కొవిడ్ నెగెటివ్గా వచ్చింది. విశాఖపట్నం చేరుకున్న తర్వాత అధికారులు మరోసారి కరోనా పరీక్ష చేశారు. అందులో పాజిటివ్గా వచ్చింది.
ఈ నేపథ్యంలో అతని నమూనాలను అధికారులు హైదరాబాద్లోని సీసీఎంబీకి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. తాజాగా అందులో ఒమిక్రాన్గా తేలిందని డీఎంహెచ్వో రమణకుమారి తెలిపారు. ఒమిక్రాన్ బాదితుడిని కలిసిన 40మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ వచ్చిందని వివరించారు. బాధితుడు స్వగ్రామంలో పరిసర ప్రాంతాల్లో నివాసమున్న వందమందికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు .