నందిగ్రామ్ ఎవరివైపు?
బరిలో మమత, సువేందు
రేపే ఓటరు తీర్పు
బెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం
30 స్థానాలకు పోలింగ్
కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్షిస్తుంటే.. ఆ పశ్చిమబెంగాల్ దృష్టిని నందిగ్రామ్ నియోజకవర్గం ఆకర్షిస్తున్నది. తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆమె ప్రధాన అనుచరుడిగా, పార్టీలో నెంబర్ టూగా ఇటీవలి కాలం వరకూ వెలుగొంది.. ఇప్పుడు బీజేపీలో చేరిన సువేందు అధికారి ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఇరువురు దిగ్గజాల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నందిగ్రామ్లో ఓటర్లు తమ తీర్పును గురువారం ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తం చేయనున్నారు. బెంగాల్ అంతటా దీదీ (అక్క)గా పేరొందిన మమతా బెనర్జీ, నందిగ్రామ్తోపాటు ఆ ప్రాంతంలోని పలు నియోజకవర్గాలపై పట్టు కలిగి ఉండి, ‘దాదా’ (అన్న)గా పేరొందిన సువేందు అధికారిలలో ఎవరికి నందిగ్రామ్ దక్కుతుందన్నది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా మారింది. పశ్చిమబెంగాల్లో రెండో దశ పోలింగ్కు ప్రచారం మంగళవారం ముగిసింది. ఈ విడతలో రాష్ట్రంలోని 30 స్థానాలకు గురువారం పోలింగ్ జరుగనున్నది. 171 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 75,94,549 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఈ ఎన్నికల కోసం 10,620 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
ఛాలెంజ్ను స్వీకరించిన మమత
రెండో విడత పోలింగ్లో నందిగ్రామ్ స్థానంపైనే అందరి దృష్టి నెలకొన్నది. ఇది సువేందు అధికారి సిట్టింగ్ స్థానం. ఆయన బీజేపీలో చేరిన తర్వాత.. తనపై నందిగ్రామ్లో పోటీ పడాలని మమతకు సవాల్ చేశారు. ఆమెను భారీ మెజార్టీతో ఓడిస్తానని చెప్పారు. సువేందు విసిరిన ఈ సవాల్ను మమత స్వీకరించారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి నందిగ్రామ్ నుంచి నామినేషన్ వేశారు. దీంతో మొత్తం బెంగాల్ ఎన్నికల పోరుకు నందిగ్రామ్కు కేంద్రబిందువుగా మారిపోయింది.
అతిరథుల ప్రచారం
బెంగాల్లో అధికారాన్ని తొలిసారిగా కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ తరఫున రెండో విడుతలో ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు ప్రచారాన్ని నిర్వహించారు. మరోవైపు, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి వీల్చైర్ సాయంతో మమత ఒంటరిగా, దీటుగా ప్రచారం జరిపారు.
పోలింగ్ రోజున అల్లర్లకు కుట్రలు: మమత
నందిగ్రామ్లో పోలింగ్ రోజున మతఘర్షణలు, అల్లర్లు సృష్టించడానికి కొందరు కుట్రపన్నారని మమత పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ‘సొంత వాళ్లను చంపి ఆ నేరాన్ని మనపై మోపడానికి కూడా వాళ్లు వెనుకాడబోరు. ఇలాంటి కుట్రలు జరుగుతున్నట్టు ఇప్పటికే సమాచారమున్నది. అందరూ అప్రమత్తంగా ఉండండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె నందిగ్రామ్లో పలు సభల్లో మాట్లాడారు. ఓటర్లను భయపెట్టడానికి బీజేపీ మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లోని పోలీసులను నందిగ్రామ్లో మోహరించారని మమత ఆరోపించారు. ఓట్ల కోసం బీజేపీ మంత్రులు డబ్బు పంచుతున్నారని, దీని కోసం భద్రతాదళాల వాహనాలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ‘ఆ డబ్బు పీఎం కేర్స్ ఫండ్కు చెందినది. పెద్దనోట్ల రద్దు సమయంలో లెక్కలోకి రాని డబ్బు. ప్రభుత్వ సంస్థలను తెగనమ్మగా వచ్చిన డబ్బు’ అని అన్నారు. సువేందును ద్రోహిగా పేర్కొంటూ.. ద్రోహం చేసిన ప్రతిఒక్కరికీ.. విజయంతో తగిన సమాధానమిస్తామన్నారు.
పునర్వైభవం కోసం కామ్రేడ్ల యత్నం!
నందిగ్రామ్, మార్చి 30: నందిగ్రామ్లో పోరు మమత, సువేందు మధ్యనే కేంద్రీకృతమైనప్పటికీ.. ఆ నియోజకవర్గంలో తమ పార్టీ పునర్వైభవం కోసం సీపీఎం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు నందిగ్రామ్లో సీపీఐ ఏకఛత్రాధిపత్యం సాగించింది. అయితే భూసేకరణకు వ్యతిరేకంగా 2007లో సాగిన ఉద్యమంతో అటు నందిగ్రామ్తోపాటు రాష్ట్రంలోనూ లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. ప్రస్తుతం సీపీఎం తరఫున మీనాక్షి ముఖర్జీ అక్కడ పోటీ పడుతున్నారు. భూసేకరణ వ్యతిరేక ఉద్యమం ఒక కుట్ర అని ఆమె ఆరోపించారు. ప్రజలు ఆ విషయాన్ని గుర్తించారని, ప్రతిచోటా తనకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.
మార్పు రావాలంటే మమత ఓడాలి: అమిత్ షా
నందిగ్రామ్, మార్చి 30: బెంగాల్ ప్రజలు ఎంతో కాలంగా కోరుకొంటున్న మార్పు రావాలంటే సీఎం మమతా బెనర్జీ ఓడిపోవాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం ఆయన నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారితో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. పూలతో అలంకరించిన లారీలో సువేందు అధికారిని పక్కన నిలబెట్టుకొని నాలుగు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా రోడ్ షోకు జనం నుంచి భారీ స్పందన లభించింది. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. జైశ్రీరాం, నరేంద్ర మోదీ జిందాబాద్, అమిత్ షా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రోడ్ షో అనంతరం అమిత్ షా విలేకరులతో మాట్లాడారు. నందిగ్రామ్లో సువేందు అధికారి మమతపై రికార్డు స్థాయి మెజారిటీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ మెజార్టీ చూసి.. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలవడానికి ఏ ఒక్క రాజకీయ నేత కూడా మళ్లీ ధైర్యం చేయబోరన్నారు.
ఇవి కూడా చదవండి:
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
బీహార్లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం
రాష్ట్రపతికి గుండె శస్త్రచికిత్స
అమ్మాయిలూ.. రాహుల్తో జాగ్రత్త!
ఎయిర్పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్
రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్