హైదరాబాద్: రాష్ట్రంలో నేడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర డాటా సెంటర్లో కొత్త యూపీఎస్ ఏర్పాటు కారణంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగనుంది. దీంతో రిజిస్ట్రేషన్లు తిరిగి సోమవారం ప్రారంభం కానున్నాయి. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ చేపట్టే రిజిస్ట్రేషన్ల ‘కార్డు’ పోర్టల్ గచ్చిబౌలిలోని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ (టీఎస్డీసీ)కు అనుసంధానమై ఉంది. దీనిని 2011లో ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ శాఖల్లోని వివిధ అప్లికేషన్లకు ఆన్లైన్ సేవలు అందిస్తున్నది. అయితే ఎస్డీసీలో మెరుగైన పవర్ బ్యాకప్ కోసం శుక్రవారం నుంచి కొత్త యూపీఎస్ ఏర్పాటు పనులు కొనసాగనున్నాయి.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డేటా సెంటర్లో కొత్త యూపీఎస్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్డీసీ స్తంభించిపోతుండటంతో రిజిస్ట్రేషన్ల కార్డు పోర్టల్ కూడా పని చేయదు. దీంతో ఇవాళ రాష్ట్రంలోని 141 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదు. మళ్లీ సోమవారం నుంచి యధావిధిగా జరగనున్నాయి.