Sonam Wangchuk : కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ శుక్రవారం తన దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి జేపీ నద్దా సమక్షంలో 26వ రోజు ఆయన నిరాహార దీక్ష విరమించారు. అయితే, ఆయన ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండానే సోనమ్ దీక్ష విరమించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై సోనమ్ వాంగ్చుక్ స్పందించారు. తాను ఎందుకు దీక్ష విరమించాల్సి వచ్చిందో వెల్లడించారు. ” నా దగ్గర రెండే దారులున్నాయి. ఒకటి నిరాహార దీక్ష కొనసాగించడం లేదా దీక్ష ముగించి ఉద్యమాన్ని కొనసాగించడం. వేలాది మంది నేను దీక్ష విరమించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ప్రాణాన్ని పణంగా పెట్టడంకంటే ఉద్యమాన్ని కొనసాగించమే ముఖ్యమని చాలామంది సూచించారు. భవిష్యత్ పోరాటాల కోసం నేను జీవించి ఉండటం చాలా ముఖ్యం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయనంతమాత్రాన ఈ ఉద్యమం విఫలమైనట్లు కాదు. ఆయన రాజీనామా చేయకపోవడం వల్ల విద్యార్థులకు పెద్దగా నష్టం లేదు. కానీ, ధర్మేంద్రకు ఉన్న గుర్తింపు మాత్రం పోతుంది. ఒకవేళ ఆయన రాజీనామా చేసి ఉంటే, తన పేరు చెడిపోకుండా ఉండేది అని సోనమ్ అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఉండకూడదని, కేసులు నమోదైతే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం తనకు తెలుసన్నారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని సోనమ్ తెలిపారు. పేపర్ లీకేజీపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందన్నారు. దేశంలో పరీక్షల నిర్వహణ అంశంపై పార్లమెంట్లో చర్చించేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయని ఆయన వెల్లడించారు.