హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్లో స్కీములంటేనే స్కాములు అనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ సర్కార్ తాజా చర్యలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. లేని 22ఏ సమస్యను తెరపైకి తెచ్చి ఇప్పుడు దాన్ని పరిష్కరించేందుకు స్కీములు ప్రకటిస్తున్నది. ఈ స్కీముల మాటున స్కాములు చేసేందుకు సర్కార్ పెద్దలు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. క్రమబద్ధీకరణ పేరుతో పెద్దల భూములను సక్రమం చేసుకోవడంతోపాటు సామాన్యుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నదని తెలుస్తున్నది. అసెంబ్లీలో బుధవారం సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన 12 అంశాలు ఈ కుట్రలో భాగమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా యూఎల్సీ, అసైన్డ్ భూములు, లీజ్ ల్యాండ్స్, జీవో 59 భూములపై సర్కార్ పెద్దల కన్ను పడిందని, ఇప్పటికే ఇలాంటి వేల ఎకరాలు వారి కబంధ హస్తాల్లో ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అయితే వీటిని ప్రత్యేకంగా క్రమబద్ధీకరణ చేసుకుంటే ప్రభుత్వం బదనాం అయ్యే ప్రమాదం ఉన్నది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. అందుకే రాజమార్గంలో వీటిని హస్తగతం చేసుకొనేందుకు ఈ ప్లాన్ వేశారనే వాదనలున్నాయి. ఖజానా ఖాళీ అని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి బీద అరుపులు అరుస్తున్నారు. ప్రజల్ని ఎలా ముక్కుపిండి ఖజానా నింపుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. క్రమబద్ధీకరణ ద్వారా భారీ మొత్తంలో వసూలు చేయాలని భావించినట్టు తెలిసింది. వీటి ద్వారా రూ.వేల కోట్లు ఖజానాకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
హైకోర్టు చీవాట్లు పెట్టడంతో సమయం లేక తొందరలో తమ అధికారులు పాత నిషేధిత జాబితాను అప్లోడ్ చేయడం వల్లే ఈ సమస్య ఎదురైందని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అలాంటప్పుడు పాత జాబితాను తొలగించి కొత్తది అప్లోడ్ చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయకపోగా, సమస్యను అత్యంత క్లిష్టంగా మార్చుతూ ఏవేవో అంశాలను తెరపైకి తీసుకొస్తున్నది. ముఖ్యంగా 12 అంశాలను సీఎం రేవంత్రెడ్డి సూచించారు. వీటికి పరిష్కారం లభిస్తేనే 22ఏ నిషేధిత భూముల జాబితా సమస్య తీరుతుందని సెలవిచ్చారు. ఒకవేళ అదే నిజమైతే జాబితాను అప్లోడ్ చేసే సమయంలో ఈ 12 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుడులేని ఈ నిబంధనలు ఇప్పుడే ఎందుకు అమలు చేస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.