స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ, గిరిజనుల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలు వేశారు. వినూత్నమైన ఆలోచనలు, విప్లవాత్మక పథకాలతో గిరిజన సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. నిధుల కేటాయింపునకే కాదు.. వెచ్చించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్య, ఉపాధి రంగాల్లో పెద్దపీట వేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి అడుగడుగునా గిరిజన విద్రోహ విధానాలను అమలు చేస్తున్నది. చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్టీలకు ఇచ్చిన 12 హామీలను అమలు చేయడం అటుంచితే.. ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నది. నిధులను విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తున్నది. అదీగాక అరాచకాలకు పాల్పడుతున్నది. భూములనే లాక్కుంటున్నది.
– హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ)
రాష్ట్రవ్యాప్తంగా 500 జనాభా కలిగిన ప్రతి తండా, ఆదివాసీ గూడేన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించారు. మొత్తంగా 1326 తండాలు, 525 గూడెలను పంచాయతీలుగా నిర్ణయించారు. తద్వారా ఆయా వర్గాలకు చెందిన వారినే స్వయంపాలకులుగా చేశారు. అభివృద్ధికి బాటలు వేశారు.




చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన, ఆదివాసీలకు ప్రముఖంగా 12హామీలను ఇచ్చింది. వాటి అమలు సంగతి పక్కనుంచితే కేసీఆర్ అమలు చేసిన పథకాలకే కాంగ్రెస్ మంగళం పలికింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రైకార్ (ట్రైబ్స్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా గిరిజనులకు సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది. 30 వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించి రూ.265 కోట్లను సబ్సిడీ రుణాలుగా అందివ్వాలని నిర్ణయించింది. చెకులను సిద్ధం చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపింది. అందులో గత బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 45.81కోట్ల నిధులను విడుదల చేసింది. 219.19కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్నికలు రాగా, ఆ నిధుల ప్రక్రియ అక్కడితో నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను మంజూరు చేస్తామని చెప్పడమే తప్ప ఇప్పటికీ ఇవ్వని దుస్థితి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నది. కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చుచేయని పరిస్థితి. 2024-25 బడ్జెట్లో ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కు రూ.17,056 కోట్లు కేటాయించింది. ఆ నిధుల్లో 9773కోట్లు (57.30శాతం) మాత్రమే వెచ్చింది. ఆ నిధులను దారి మళ్లిస్తున్నదని గిరిజన, ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ, గిరిజనులపై ఏటికేడు దాడులు పెరిగిపోతున్నాయి. కేసుల నమోదు సంఖ్య రెట్టింపయ్యాయి. భూసేకరణ సందర్భంగా లగచర్ల పరిసర తండాల్లో గిరిజనులపై అత్యంత అమానవీయంగా ప్రభుత్వం వ్యవహరించింది. భూములను గుంజుకునేందుకు పూనుకున్నది. ఇక పోడు రైతులపై వేధింపులను రెట్టింపు చేసింది. అటవీశాఖ అధికారుల దాడులు పెరిగిపోయాయి. పోడుభూములకు సైతం కంచెలను ఏర్పాటు చేస్తున్నది. ఇదిలా ఉంటే కుమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట జీవో 49ను తీసుకొచ్చింది. ఐదో షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70, పెసా చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, సంస్కృతీసంప్రదాయాలు, ఆదివాసీల హకులను కాలరాసేందుకు పూనుకున్నది. వ్యతిరేకత వెల్లువెత్తడంతో జీవో అమలును తాత్కాలికంగా నిలిపివేసింది