న్యూఢిల్లీ, జూలై 8: కొత్త ఐటీ నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్పై చర్య తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల అమలుకు కట్టుబడి ఉన్నామంటూ సంబంధిత అధికారి ఒక అఫిడవిట్ను ట్విట్టర్ కేంద్ర కార్యాలయం ఉన్న అమెరికాలో నోటరీ చేయించి ఇవ్వాలని ఆ సంస్థను ఆదేశించింది. దీనికి ట్విట్టర్ విజ్ఞప్తితో రెండు వారాల గడువును ఇచ్చింది. గడువు ఇచ్చినంతమాత్రాన ట్విట్టర్కు ఎలాంటి రక్షణ కల్పించినట్టు కాదని పేర్కొంది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం స్థానిక ఫిర్యాదుల అధికారిని (ఆర్జీవో) ఎప్పుడు నియమిస్తారో గురువారానికల్లా తెలుపాలని హైకోర్టు మంగళవారం ట్విట్టర్ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ నిబంధనల ప్రకారం… సామాజిక మాధ్యమ వేదికలు ముగ్గురు కీలక అధికారులను నియమించాల్సి ఉంది. వారు ముగ్గురూ భారత్కు చెందినవారై ఉండాలి. తాత్కాలిక చీఫ్ కంప్లియన్స్ అధికారిని మంగళవారం నియమించామని, తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిని, తాత్కాలిక నోడల్ అధికారిని ఈ నెల 11లోపు నియమిస్తామని ట్విట్టర్ తరఫు న్యాయవాది పూవయ్య తెలిపారు. రెగ్యులర్ అధికారులను నియమించడానికి 8 వారాలు గడువు కావాలని కోరారు. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ జోక్యం చేసుకుంటూ జూలై 1 వరకు కూడా కొత్త ఐటీ నిబంధనలను ట్విట్టర్ అమలు చేయలేదన్నారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.
నిబంధనలకు కట్టుబడాల్సిందే : కేంద్ర మంత్రి వైష్ణవ్
భారత్లో నివసించేవారు, పనిచేసేవారు దేశ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని ట్విట్టర్కు కేంద్ర కొత్త ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. నూతన ఐటీ నిబంధనలపై కేంద్రానికి, ట్విట్టర్ సంస్థకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై విలేకరుల ప్రశ్నించినప్పుడు వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొత్త ఐటీ రూల్స్పై ఎన్బీఏ పిటిషన్
కొత్త ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిబంధనలు ప్రభుత్వానికి అపరిమిత అధికారాలను కట్టబెడుతుందని, తద్వారా మీడియా వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రిస్తాయని పిటిషన్లో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(జీ)తోపాటు 2000లో తెచ్చిన ఐటీ చట్టానికి కొత్త ఐటీ నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది.
ఆ నోటీసును కొట్టివేయండి
బెంగళూరు: తమ ముందు హాజరుకావాలంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీ చేసిన నోటీసును కొట్టివేయాలని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టును కోరారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఓ వీడియో ట్విట్టర్లో వైరల్గా మారిందంటూ యూపీ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా వ్యక్తిగతంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ మనీశ్ మహేశ్వరికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ఆయన తాను కర్ణాటకలో నివసిస్తున్నానని, కాబట్టి యూపీలో నమోదైన కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు జారీ చేసిన నోటీసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. నేరం జరిగిన ప్రాంతంలో తాను నివసించనప్పటికీ తనను విచారణ నిమిత్తం హాజరుకావాలని పోలీసులు కోరడం తగదని పేర్కొన్నారు.