తిరువనంతపురం: కేరళలో కరోనా ఉద్ధృతి ఇంకా తగ్గకముందే మరో వైరస్ విస్తరిస్తున్నది. జికా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తిరువనంతపురంలో జికా వైరస్ లక్షణాలు ఉన్న 13 మంది నమూనాలను పరీక్షించగా అందులో 10 మందికి పాజిటివ్ అని తేలింది. జికా వైరస్ ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాపిస్తుంది. 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు. జికా సోకితే జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. ఇది ప్రాణాంతకం కాకపోయినా గర్భిణులకు సోకితే పుట్టే బిడ్డ ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువ.