డిమాండ్ ఉన్న పంటలపై అన్నదాతలు దృష్టిపెట్టాలి
వరి సాగులో నియంత్రణ పాటించాలి
పత్తి, కంది, ఆయిల్పామ్ సాగు చేపట్టాలి
మంత్రి నిరంజన్రెడ్డి సూచన
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మారుతున్న పరిస్థితులకనుగుణంగా పంటల సాగు పద్ధతిలోనూ మార్పులు రావాల్సి ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. డిమాండ్ ఉన్న పంటల సాగు దిశగా దృష్టి సారించాలని రైతులకు సూచించారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్కు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పంటల మార్పిడిపై 30-40 సమావేశాలు నిర్వహించి డిమాండ్ ఉన్న పంటలను గుర్తించారని తెలిపారు. ప్రభు త్వ నిర్ణయాలతో తెలంగాణలో సాగువిస్తీర్ణం, పంటల దిగుబడి భారీగా పెరిగిందని.. అయితే మార్కెటింగ్ అంశాన్ని ఊహించుకుంటే ఆందోళనగా ఉన్నదని చెప్పారు. రైతులు వరి సాగులో నియంత్రణ పాటించి పత్తి, కంది, వేరుశనగ, ఆయిల్పామ్తోపాటు ఇతర నూనెగింజల పంట లు పండించాలని విజ్ఞప్తిచేశారు. వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నదని పేర్కొన్నారు. భవిష్యత్లో సన్న బియ్యానికే డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నదని.. ఎఫ్సీఐ చర్యలకనుగుణంగా రైతులు దొడ్డురకం ధాన్యం సాగును తగ్గించి సన్నాలను పెంచాలని కోరారు. భవిష్యత్తో కేంద్రం ప్రజాపంపిణీ వ్యవస్థను ఎత్తేస్తే.. ధాన్యం మార్కెటింగ్ మరింత ఇబ్బంది అవుతుందని తెలిపారు. ధాన్యం దిగుబడి పెరగడంతో.. ధాన్యాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించే అంశాలను కూడా కేంద్రం పరిశీలిస్తున్నదని.. బియ్యం నుంచి ఈథనాల్ను తీసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. రాబోయే సీజన్లో ఏ పంటకు డిమాండ్ ఉన్నదనే అంచనాలను పరిశీలించేందుకు మార్కెటింగ్ ప్రణాళికను రూపొందించేందుకు ప్రత్యుకంగా ఎర్నెస్ట్ యంగ్ సంస్థను నియమించినట్టు వివరించారు. సాగర్ ఎన్నికల కోసమే ధాన్యం కొనుగోలు నిర్ణయం తీసుకున్నారన్న ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి మండిపడ్డారు. ఆ నిర్ణయం ఒక్క సాగర్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించింది కాదని.. రాష్ట్రం మొత్తం రైతులకు ప్రయోజనకరమైదని వివరించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆదివాసీ బిడ్డలకు పక్కాగా ఆరోగ్యలక్ష్మి
ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100% పెనాల్టీ