కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): చారిత్రక గోల్కొండ కోట, కుతుబ్షాహీ టూంబ్స్ను కాపాడేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వాటి మరమ్మతుకు తీసుకునే చర్యలు, కేటాయించిన నిధుల వివరాలను రెండు వారాల్లోగా తెలియజేయాలని సూచిస్తూ.. కౌంటర్ పిటిషన్లు దాఖలుచేయాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పురావస్తు శాఖలకు నోటీసులు జారీచేసింది. ఏప్రిల్ 15న జరిగే తదుపరి విచారణకు రాష్ర్ట పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది. గోల్కొండ కోట రాతి గోడలు బీటలు వారుతున్నాయని, వర్షాకాలంలో జరుగబోయే నష్టం గురించి ఏఎస్ఐ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. నిధుల కేటాయింపు 15 శాతమే జరిగిందని ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా తీసుకున్న హైకోర్టు విచారణ జరిపింది. గోల్కొండ టూంబ్స్ వద్ద రాత్రిళ్లు కుక్కలు వీరవిహారం చేయకుండా చూడాలని, దీపాలు ఏర్పాటుచేయాలని, చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
ఆదివాసీ బిడ్డలకు పక్కాగా ఆరోగ్యలక్ష్మి
ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100% పెనాల్టీ