దేవరకొండ రూరల్, ఆగస్టు 1 : మండలంలోని కొండ భీమనపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 167 పక్కనే ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ, శనివారం స్థానిక మహిళలు, కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ రహదారిపై ట్రాఫిక్ను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కాలనీలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం కింద తాగు నీటిని సరఫరా చేయక చాలా రోజులైందన్నారు.
రోజువారీ అవసరాలకు కూడా నీళ్లు లేకపోవటంతో పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ధర్నా కారణంగా రహదారిపై రెండు గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. తాగు నీటి సమస్యే కాకుండా, డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్థంగా ఉందని, కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాయదుర్గారెడ్డి, సిబ్బందితో వచ్చి మహిళలతో మాట్లాడారు. తాగునీరు తదితర సమస్యలపై అధికారులో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో కాలనీ వాసులు ధర్నా విరమించారు.అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించటంతో వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.