ప్రభుత్వం, వక్ఫ్బోర్డువి కావు
తీర్పు వెలువరించిన హైకోర్టు
సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేటలోని సర్వేనంబర్ 80లోని భూమి ప్రైవేటు వ్యక్తులదేనని హైకోర్టు స్పష్టంచేసింది. అవి ప్రభుత్వానికి, రాష్ర్ట వక్ఫ్బోర్డుకు చెందినది కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టీ వినోద్కుమార్తోకూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. అవి తమ భూములేనని ప్రైవేట్ వ్యక్తులు దాఖలుచేసిన రిట్ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. కాగా, ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని రాష్ట్ర ప్రభు త్వం పేర్కొన్నది. సర్వేనంబర్ 80లోని 140 ఎకరాలు వక్ఫ్బోర్డుకు చెందినవని పేర్కొంటూ దర్గా హజ్రత్ సలార్-ఇ-అయులియాకు అప్పగించడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు పేర్కొన్నది. వక్ఫ్ భూములుగా పరిగణిస్తూ 2014 నవంబర్ 1న జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ను సాయిపవన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ముగ్గురు హైకోర్టులో సవాల్ చేశారు. ముంతకాబ్లో ఆస్తిని చేర్చడం, రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొనడాన్ని రద్దుచేయాలని కే ప్రవీణ్కుమార్ మరో రిట్ దాఖలు చేశారు.
పిటిషన్దారులకు కోర్టు ఖర్చులు చెల్లించాలి
‘ఈ భూములపై 2006లోనే తుది డిక్రీ వచ్చింది. ప్రభుత్వ ఆస్తి కాదని సుప్రీంకోర్టు 2013లో తేల్చింది. ఆ తర్వాత వక్ఫ్బోర్డు 2014 నవంబర్ 1న ఆ భూమి వక్ఫ్దేనంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం చెల్లదు. వక్ఫ్బోర్డుకు వక్ఫ్నామా ఇచ్చిన వ్యక్తికి ఆస్తిపై యాజమాన్య హక్కు ఎలా వచ్చిందో చూపలేదు. 1955లో వక్ఫ్నామా ఇచ్చినప్పుడు చేతులు కాలాయని చెప్పి సంతకం చేయని ఆ వ్యక్తి.. ఆ తర్వాత ఏడాది క్రయవిక్రయ పత్రాలపై సంతకాలు చేశారు. మరోవైపు జా గీర్ద్ద్రుతో ఇది ప్రభుత్వ భూమేనని సర్కారు వాదన కు ఆధారాలు చూపలేదు. అందుకే అది ప్రభుత్వ, వక్ఫ్బోర్డు భూమి కాదు. సర్వేనంబర్ 80, 80 ఏ నుంచి డీ వరకు భూములపై ఏవిధమైన లావాదేవీలకు అనుమతించరాదని రిజిస్ట్రేషన్ అధికారులకు వక్ఫ్బోర్డు 2020 జూన్ 16న రాసిన లేఖ చెల్లుబాటు కాదు. రెవెన్యూరికార్డుల్లో ప్రభుత్వ భూమి అని రాసిన దానిని తొలగించాలి. సర్వేనంబర్ 80లోని ఆస్తిని ఏ, బీ, సీలుగా వర్గీకరించి 50 ఎకరాలు ప్రవీణ్కుమార్, ఇతరుల పేర్లపై రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేయాలి. ఆ సర్వేనంబర్లలోని ఆస్తిహక్కుల విషయంలో ప్రభు త్వం, వక్ఫ్బోర్డులు జోక్యం చేసుకోరాదు. ప్రవీణ్కుమార్, సాయిపవన్ ఎస్టేట్స్, మరో ఇద్దరికి రాష్ర్ట ప్రభు త్వం,వక్ఫ్బోర్డులు రూ.50వేల చొప్పున కోర్టు ఖర్చుల కోసం చెల్లించాలి’ అని 78 పేజీల తీర్పులో హైకోర్టు పేర్కొన్నది. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు చెప్పా రు. ఈ భూముల వివాదంలోనే ఇటీవల ప్రవీణ్కుమార్తోపాటు మరికొంత మందిని కిడ్నాప్ చేసిన కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్తపై బోయిన్పల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
ఇవి కూడా చదవండి:
ఆదివాసీ బిడ్డలకు పక్కాగా ఆరోగ్యలక్ష్మి
ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100% పెనాల్టీ