Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్కు 1:100, గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంపుతో పాటు డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేయాలని హరీశ్రావు తన లేఖలో ప్రస్తావించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్న హామీని కూడా నెరవేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
1. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మీరు వాటికి మరో 60 ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో కాకుండా, 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరుతున్నాను. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-2 నోటిఫికేషన్లో 1:15గా పేర్కొన్నప్పటికీ, తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేశారు.
గ్రూప్-1 పరీక్ష అనేది యూపీఎస్సీ మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండదు. రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావడం వల్ల ఆశావహుల సంఖ్య పెరిగింది. 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేయడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తాము కలలు కన్న గ్రూప్-1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. నేడు ఉపముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క గతంలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకునిగా ఉన్నప్పుడు గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ వైఖరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పుకుంటున్నదో అర్థం కావటం లేదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. గతంలో మీరు చేసిన డిమాండ్ను అమలు చేయగలిగే అవకాశం మీకిప్పుడు ఉంది కానీ ఎందుకు చేయలేకపోతున్నారు..? ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకు..? గతంలో మీరు ప్రకటించిన వైఖరికి కట్టుబడి మెయిన్స్కు 1:100 చొప్పున ఎంపిక చేసి ఉద్యోగార్థులకు తగిన న్యాయం చేయండి.
2. గ్రూప్-2కు 2 వేల ఉద్యోగాలు, గ్రూప్-3కి 3 వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
3. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆందోళనకు గురవుతున్నారు. జూలై చివరి వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష ఉంది. ఏడు రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు.
4. మీరు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొదటి క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకుంటామని మీ మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించారు. 25 వేల టీచర్ పోస్టులలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా ప్రవర్తించారు. మేము ఇచ్చిన 5 వేల పోస్టులకు మరో 6 వేలు కలిపి 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతున్నాను.
5. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. పత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఆరు నెలలు దాటినా ఆ దిశగా అడుగులు పడలేదు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి తదనుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేయాలని కోరుతున్నాను.
6. అదే విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ. 4000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకున్న బకాయిలు మొత్తం సహా నిరుద్యోగ భృతిని నెలనెలా చెల్లించాలని కోరుతున్నాను.
7. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చినంక వారిని నట్టేటముంచి జీవో 46 ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తిచేశారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది మరో నిదర్శనం. ప్రభుత్వం వెంటనే జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాము.
ఇవి కూడా చదవండి..
TGSRTC | ఆధార్ కార్డులో తెలంగాణ లేదని.. ఫ్రీ టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరణ
Seetakka | మీరు ఎంత గగ్గోలు పెట్టినా పరీక్షలు వాయిదా వేయం : మంత్రి సీతక్క
Heavy Rain | తెలంగాణలో ఐదురోజులు అతిభారీ వర్షాలు..! ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
BRS Party | కాగజ్నగర్ ఉక్కు మహిళలకు పాదాభివందనాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | చేసిన పనులే చరిత్రలో నిలిపోతాయి : హరీశ్ రావు