– తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిపో కమిటీ డిమాండ్
– ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేత
భద్రాచలం, ఆగస్టు 10 : భద్రాచలం డిపోలో టిఐఎం డ్రైవర్లకు రీజినల్ మేనేజర్ గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ భద్రాచలం డిపో కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం భద్రాచలం డిపో ఏఎంటీ విజయశ్రీ, ఆఫీస్ సూపరింటెండెంట్ విజయలక్ష్మికి టిఎంయు నాయకులు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం రీజినల్ కార్యదర్శి ఆర్.కృష్ణ మాట్లాడుతూ.. గత సంవత్సరం సెప్టెంబర్ 15, 17వ తేదీల్లో ఖమ్మం రీజినల్ మేనేజర్ కార్యాలయంలో విజిలెన్స్, రీజినల్ అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలను 11 నెలలు గడిచినా అమలు చేయకపోవడంపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. మూడు మస్టర్లతో కూడిన డ్యూటీలను కేటాయించాలని, ఎవరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని కోరారు.
డిపోలోని పలు అపరిష్కృత సమస్యలపై అధికారులకు మరొక వినతిపత్రం అందజేశారు. టిఐఎం డ్రైవర్లకు 2023 నాటి డ్యూటీ చార్ట్ను పునరుద్ధరించాలని, ఏడీసీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్, కండక్టర్ చార్ట్ కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు ఓటీ డ్యూటీలు, స్పెషల్ ఆఫ్ డ్యూటీలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. రాజధాని సర్వీసులకు అటెండర్లను కేటాయించాలని, సరిపడా సిబ్బందిని నియమించాలని, మెకానికల్ సిబ్బందికి అవసరమైన పరికరాలు (టూల్స్) అందించాలని కోరారు. అలాగే లేడీ కండక్టర్లకు నెలకు 3 రోజుల సెలవులు ఇవ్వాలని, నైట్ అవుట్ సర్వీస్లలో డ్రైవర్లు, కండక్టర్లకు సరైన రెస్ట్ రూమ్ల సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిఎంయూ ఖమ్మం రీజినల్ కార్యదర్శి ఆర్. కృష్ణ, భద్రాచలం డిపో కార్యదర్శి జి. యుగంధర్, చైర్మన్ ఎం.ఎస్.రావు, వైస్ ప్రెసిడెంట్ ఎ.రాంబాబు, నాయకులు శ్రీరాములు, వి.వి. రావు, ఎ.వై. నారాయణ, స్వప్నకుమారి, కె.వి.రావు పాల్గొన్నారు.

‘భద్రాచలం టిఐఎం డ్రైవర్ల హామీలను వెంటనే నెరవేర్చాలి’