Ramaayanam | మా బాల్యమంతా ఒక పాతకాలపు ఇంట్లో గడిచింది. ఆ ఇంటి వీధి వాకిలికి రెండుపక్కలా అరుగులు ఉండేవి. రెండు పెద్దపెద్ద వేపచెట్లు ఇరుపక్కలా విస్తరించి.. బాగా నీడనిచ్చేవి. నాన్న గ్రామ కరణం కాబట్టి పత్రాలు రాయించుకునే వారూ, భూ వివాదాల గురించి ఫిర్యాదు చేసేవారూ.. ఎవరొచ్చినా ముందు అరుగుల మీద కూర్చునే మంచీ చెడ్డా మాట్లాడుకునేవారు.
దారిన పోయేవాళ్లూ, మూటల్లో బట్టలు తెచ్చి అమ్మే వర్తకులూ, గాజుల మలారం వాళ్లూ, పూసల వాళ్లూ అందరూ మా అరుగుల మీదే కూర్చుని.. తాము తెచ్చుకున్న సద్దులు తిని, ఆ నీడన కాసేపు సేదతీరి కొంత సరుకు అమ్ముకునేవాళ్లు. అమ్మ, నానమ్మ కూడా వాళ్లను లోపలికి పిలిచి ఏవైనా కొనేవారు. వాళ్లకు కూరలు, తొక్కులూ ఇవ్వడం మహా ఇష్టంగా ఉండేది అమ్మకూ, నానమ్మకూ.
వీధి వాకిలి దర్వాజా పెద్దగా ఉండేది. చెక్క నగిషీలతో మధ్యలో గుండ్రని కొనదేలిన ఇనుప పిడులతో బరువుగా ఉండేది. మేము ఆ తలుపు జరపలేక పోయేవాళ్లం. అది దాటితే పెద్దవాకిలి. పాపం ఆ వాకిలిని అద్దంలా ఊడ్చి.. పేడతో చానిపి చల్లి, లేత ఆకుపచ్చ, పసుపుపచ్చ కలగలిసిన రంగులో తళతళ మెరిసేలా చేసేది మా రాజ మల్లమ్మ. నేను ఆమె పైన పేరడీ కట్టి.. “రాజమల్లివో! కురుమ మల్లివో.. నీవే నీటు కుమారి! నీ రాకతో వాకిలీ.. తళతళా మెరిసెనే! ఏదీ ఇంకొకసారి.. చల్లవె చెంబులతోని!” (నాగమల్లివో.. తీగమల్లివో బాణీలో) అని పాడుతుంటే.. ఆమె మురిసిపోయేది. “మా అవ్వ.. నా సక్కని తల్లి” అంటూ మెటికలు విరిచేది.
ఆ చతుశ్శాల భవంతిలో మూడు వైపులా మనసాలలు, ప్రతి మనసాల పక్కనా ఒక అర్ర (గది), మధ్యలో ఆకాశం కనిపించేలా దీర్ఘచతురస్రాకారంలో పొడవాటి గచ్చు ఉండేది. వాన వస్తే.. ఇంట్లో పడ్డట్లే అనిపించేది. ఇంటి మొత్తంలో నాలుగు గదులు, మూడు చిన్న హాల్స్.. అన్నమాట. అందులోనే పెద్ద భోజనాల గది, దాని పక్కనే వంటగది. అందులో ఓ మూలకు చిన్న గొయ్యిలాగా దాలి ఉండేది. అందులో పిడకలు వేసి నిప్పు అంటించి.. ఆ సెగమీద మట్టికుండలో పాలు కాగబెట్టేవారు. పైన మీగడ కట్టే ఆ పాలు ఎంతో రుచిగా ఉండేవి.
మా స్నానాల గది చాలా పెద్దది. సగం మేరకు పైకప్పుతో ఉండి, మిగతా సగం ఆకాశాన్ని చూస్తుండేది. అలాంటి బాత్రూంని ఐదేళ్ల క్రితం ఇండోనేషియాలోని బాలీ దీవులకు వెళ్లినప్పుడు చూశాను. అయితే, అది అధునాతనమైన బాత్రూం. మా స్నానాల గది మట్టి నేలతో, మొద్దు బండలతో ఉన్నా.. రెండిటి ఐడియా ఒకటేలా ఉండటం ఆశ్చర్యం కలిగించింది.
ఇంటి వెనుక మంచినీళ్ల బావి. దానికి చుట్టూ గోడ లేకుండా అడ్డుగా కర్రలు పాతి ఉండేది. మేము కొంచెం పెద్దయ్యాక ఎప్పుడన్నా బావిలో చేద వేసి నీళ్లు చేదుతూ.. వంగి బొక్కెన అందుకుంటుంటే, ఆ బావిలో పడిపోతామేమోనని భయం వేసేది. అదేంటో మా ఇంట్లో రాత్రిపూట కూడా తలుపులు పెట్టుకునే వాళ్లం కాదు. గాలి రావాలని అన్ని దర్వాజలూ తీసే ఉంచేవారు. పడుకునేముందు ఒక్క వీధి వాకిలి మూసి ఉంచేవారు. ప్రతి మనసాల్లో చిన్న గూళ్లు ఉండేవి. వాటిలో ఎక్క దీపాలు ఉంచేవారు. ఒక మనసాలలో నాన్న రాసుకునే టేబుల్, నాలుగు కుర్చీలు ఉండేవి. ఒక గదిలో ఒకటే ఒక అల్మారాలో మా అందరి కొత్త బట్టలూ ఉండేవి. ఓ గడమంచ మీద పరుపులూ, పక్కబట్టలూ ఉంచేవారు. బల్లలు, నవారు, నులక మంచాలు మటుకు చాలా ఉండేవి. ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా సరిపోయేవి.
ఇంకో గదిలో నాకూ, అక్కకూ చెరొక చెక్క తనబ్బీలు ఉండేవి. అందులో మేము పుస్తకాలతోపాటు పెన్సిళ్లూ, నెమలీకలూ, పత్రికల్లో వచ్చే అందమైన బొమ్మలూ, చింతకాయలూ, రేగుపళ్లూ, పిప్పరమెంట్లూ, చాక్లెట్లూ వంటి సమస్త సంపదలూ దాచుకునేవాళ్లం. ఇంటీరియర్ పట్ల కాస్త శ్రద్ధ వహించాలని నేనూ, అక్కా చాలా ప్రయత్నించాం గానీ.. కుదరలేదు. మరొక గది పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుని గుహలా ఉండేది. రాత్రిపూట ఆ అర్రలోకి వెళ్లాలంటేనే దడుసుకునేవాళ్లం. అందులో వ్యవసాయ పనిముట్లూ, పనికిరాని ఇనుప సామాన్లూ, ఒక పెద్ద ఆయుర్వేద మందులపెట్టే ఉండేవి. ఓ ఆదివారం అక్కా, నేనూ ఆటల్లో భాగంగా ఆ అర్రలోకి పోతే.. ఇత్తడి పిడి ఉన్న కత్తులు కనిపించాయి. ఇంకేముందీ.. ఇద్దరం చెరొక కత్తీ పట్టుకుని.. వీరోచితంగా పోరాడాం. ఇంతలో అమ్మ వచ్చి.. “గవ్వి ఎందుకు తీసిన్రు?” అని తిట్టి ఆ కత్తుల్ని లాక్కుంది.
ఇల్లు చాలా పాతది గనుక వానకాలం అక్కడక్కడా కురిసేది. మళ్లీ గూనపెంకులతో ఇల్లు కప్పించేవారు. కొన్నిచోట్ల దూలాలు, వాసాలు పగులు పట్టి, సగం విరిగి.. ‘కిందపడ్తాయా?’ అన్నట్టు ఉండేవి . వచ్చిన వాళ్లంతా.. “గింత పాత ఇంట్ల ఎట్ల ఉంటున్నరు? దూలమో, వాసమో, ఎనుగర్రో ఇరిగి ఎవరి మీదనన్న పడితె ఎట్ల? అయినా పడుగు తిరిగిన ఇంట్ల ఉండొద్దు. కొత్తిల్లు కట్టుకోండి” అని సలహా ఇచ్చేవారు. నాన్న నవ్వి ఊరుకునేవాడు.
మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. మా టెన్త్ అయిపోయేదాకా నేనూ, అక్కా కందిళ్ల వెలుగులోనే చదువుకున్నాం. చివరికి చాలామంది ఒత్తిడి చేస్తే.. 1976లో ఐదెకరాల పొలం అమ్మి, కొంచెం దూరంలో డాబా ఇల్లు కట్టాడు నాన్న. నిజానికి పాత ఇంటి అడుగునే కొత్తది కట్టాలని నాన్న కోరిక. కానీ, ఉన్న ఇల్లు పడగొట్టడం నచ్చక, ఆ అదనపు ఖర్చు తట్టుకోనూలేక.. ఆ ప్రయత్నం మానుకున్నాడు.
చాలా రోజులపాటు పాత ఇంటిమీద మమకారం పోలేదు. అప్పుడప్పుడూ వెళ్లి కాసేపు గడిపి వచ్చేవాళ్లం. ఎంత పాతదైనా.. మా బాల్యమంతా ఆ ఇంటితోనే ముడిపడి ఉంది. ఇప్పటికీ బతుకమ్మ పండుగప్పుడు చెరువుకు పోతున్న దారిలో.. అక్కడికి రాగానే ఎన్నో మధుర జ్ఞాపకాలు మమ్మల్ని చుట్టుముడతాయి.
నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
“Ramaayanam | మామయ్య పెండ్లి..”
Ramaayanam | పరీక్షలొస్తున్నయ్..