Ramaayanam | మా ఇంటి ముందున్న పాఠశాల పక్కనే ఖాళీ స్థలం. దాని పక్కనే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండేది. ఆఫీస్ అంటే పెద్ద సెటప్ ఏమీ లేదు. ఓ గది, దాని ముందో వరండా.. అంతే! ఆ వరండాకు పొడిగింపుగా బల్లలు వేసి ఆ వేదిక మీద మా ఊరి కళాకారులు వీధి భాగవతాలు ప్రదర్శించేవారు.
ఆరోజు ఉదయం నుంచే సందడి మొదలయ్యేది. పొద్దుటే ఓ నలుగురైదుగురు మా ఇంటికి వచ్చి బల్లలు అడిగి తీసుకెళ్లేవారు. అప్పట్లో మా ఇంట్లో ఆరేడు చెక్క నగిషీ బల్లలు ఉండేవి. అందులో రెండు బల్లలు ఈ భాగోతం వాళ్లు ఎగిరి, దూకడం వల్లే విరిగి పోయాయని మా ఇంట్లో వాళ్లు అనుకుంటూ ఉండేవాళ్లు. కానీ, వాళ్లు వచ్చి అడిగినప్పుడు మాత్రం లేదనకుండా ఇచ్చేవాళ్లు. ఆ తరువాత ఒకర్ని పెట్రోమాక్స్ లైట్ కోసం పంపేవాళ్లు. నిండా కిరసనాయిలు పోసి అదీ ఇచ్చాక, మరి కొంతసేపటికి రెండు బిందెలు కావాలని వచ్చేవాళ్లు. మా పెరట్లో బావి దగ్గరే వాటిని తోమి రెండు బిందెల నిండా బావి నీళ్లు చేదుకుని వెళ్లేవాళ్లు. ఆ తరువాత పువ్వుల కోసం ఇంకొకళ్లు.. ఇలా ఏదో ఒక వస్తువు అడుగుతూనే ఉండేవాళ్లు. ఆ రోజుల్లో పల్లెటూళ్లలో రాత్రి తొందరగా అన్నాలు తినేవారు. రాత్రి ఎనిమిదింటికే ఊరంతా సద్దుమణిగేది. వీధి భాగోతం ఉన్న రోజు మాత్రం అందరూ వచ్చి స్టేజీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కూర్చునేవారు. చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చేవారు. ఒకవేళ వాళ్లు నిద్రపోతే కూడా తల్లులు తమ ఒళ్లో పిల్లల తలలు మాత్రం ఉంచి, ఆ ఇసుక, మట్టిలోనే పడుకోబెట్టేవారు. ఎలోళ్లు లేదా సుంకరోళ్లు ఊరంతా అన్ని వీధులూ తిరిగి కాపలా కాసేవారు.
మా ఇంటి ముందు మొద్దుబండిలో గడ్డి పరిచి, దాని మీద జంపఖానా వేయించేవారు. ఆ బండి మీద కూర్చుని చూస్తే స్టేజీ చాలా బాగా కనిపించేది. నానమ్మకు వీధి భాగోతం పరమ ఇష్టంగా ఉండేది. వర్షాకాలం తరువాత ఎక్కువగా దీపావళి, సంక్రాంతి రోజుల్లో వీటిని ప్రదర్శించేవారు. అక్కనూ, నన్నూ చెరోపక్కనా కూచోబెట్టుకుని మొదటినుంచీ చివరి దాకా.. తెల్లవారుఝామున నాలుగైనా సరే, చూసేది నానమ్మ. మాకు చలి వేస్తే అమ్మవి మెత్తని నూలు చీరలు తల మీది నుంచి మెడ చుట్టూ వచ్చేలా హరికంఠం కట్టేది. మధ్యరాత్రి మాకు ఆపుకోలేనంత నిద్ర వస్తే మమ్మల్ని చెరో తొడ మీదా పడుకోబెట్టుకునేది. అమ్మ కొద్దిసేపు చూసి వెళ్లి పడుకునేది. నాన్న అసలు చూసేవాడే కాదు. తెర తీయగానే అందరూ ‘పరాబ్రమ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానందా’ అని పాడేవారు. ఆ తరువాత డబ్బులిచ్చిన వాళ్ల పేర్లు చదువుతూ మొదట నాన్న పేరు రాగయుక్తంగా చదివేవారు. నాన్న వాళ్లకు డబ్బులూ, బియ్యం ఇలాంటివి బాగా ఇచ్చేవాడనుకుంటాను!
ఇక ఒక్కో పాత్రధారులు ఓ పాటో, పద్యమో పాడుతూ పరిచయం చేసుకునేవారు. ఉదాహరణకు ‘సతీ సావిత్రి’ అయితే, “రాజా నే.. సత్యవంత మారాజా నే.. దిమికిట.. దిమికిట.. రాజును నేనే ధారుణిలోనా.. తదికిట.. తదికిట” అంటూ తన పరిచయమే ఓ పావుగంట పాటు చేసుకునే వాడు.‘రామాయణం’ అయితే చెప్పనే అక్కర్లేదు. దశరథ మహారాజు నుంచి మొదలుపెడితే “శత్రులోక విజయుడనే.. శాత్రగ్నుడ నేనేరా! ఆఁయ్!” అంటూ శత్రుఘ్నుడి దాకా పరిచయాలకే గంట పట్టేది. ఇక సత్యభామ వచ్చేముందు పెద్ద ఆర్భాటంగా ఉండేది. “భామా.. నే.. సాత్రాజితినను లేమా నే.. అందములోనా రంభను మించిన దానా నే” అంటూ ధగధగలాడే చీర, మెరిసే నగలూ, పెద్ద జడా, దానిలో పూలూ, చేతికి ఒక పొడవాటి దస్తీ.. అట్టహాసంగా ప్రవేశించి పాట పాడుతూ ఉంటే.. హార్మనీ, తబలా, తాళాల వాళ్లు ఇంకా స్పీడుగా వాయించేవారు. సత్యభామ రెండు చేతివేళ్లతో చీరను పట్టుకుని చిందులేస్తూంటే జనం కళ్లార్పకుండా చూసి పరవశించేవారు.
ఒకసారి జనంలోంచి ఒకతను “అరేయ్ శంకర్! ఏం పాడినవ్ రా!” అంటూ గబగబా స్టేజి మీదికి వెళ్లి ఒకసోడా కొట్టి అందించాడు. సత్యభామ గటగటా ఆ సోడా తాగి.. అది ఇచ్చినతణ్ని ఎంత పంపించినా అతడు స్టేజీ దిగలేదు. చివరికి ఓ నలుగురైదుగురు అతణ్ని అమాంతం ఎత్తి కిందికి దించారు.
“ఆమె సత్యభామ కదా నానమ్మా! మరి శంకర్ అంటున్నడేంది?!” అని నా డౌట్ని వెలిబుచ్చాను.
“వాడు తోటోళ్ల శంకరే! ఆ వేషం ఏశిండు, మొగోళ్లే ఆడి వేషాలు ఏస్తరు” అని నానమ్మ చెప్పినా, నేను అతను స్త్రీ కాదంటే నమ్మలేకపోయాను.
“మరి సిన్మాల సావిత్రి, జమున.. వాళ్లు గూడ మొగోళ్లేనా?!”.. నాకు మళ్లీ డౌట్. “శవ్వా! వాళ్లెందుకైతరు? వాళ్లు ఆడోళ్లే.. చక్కనిచుక్కలు. అది సిన్మానాయె!” అనేది నానమ్మ. “మరి ఇక్కడ గూడ..” అని నేనింకా ఏదో అడగబోతుంటే.. “ఎహె! చూడు మంచిగ.. కృష్ణుడు ఒచ్చిండు” అంటూ నాకు జవాబు ఇవ్వకుండానే అందులో లీనమయ్యేది.
కృష్ణుడు, అర్జునుడు వచ్చినపుడు మహాజోరుగా ఉండేది. వాళ్లిద్దరూ కాసేపు గ్రాంథికం వదిలేసి.. “ఏంది బావా! మీ శెల్లె కోడికూర వండలేదు” అంటే.. “నువ్వు తెచ్చిస్తే వండదా బామ్మర్దీ!” అంటూ లోకల్ జోక్స్ వేసుకునేవారు. ‘సుభద్రా కల్యాణం’ అనుకుంటా.. చివరికి మంత్రాలు కూడా కృష్ణుడే చదివి.. “ఆఁ.. శెల్లెకొంగుల పెద్ద పోక కట్టిన్రా?!” అంటూ అన్ని విషయాలూ చూసుకుని పెళ్లి చేసేవాడు.
శంకర్ అనే అతను సీత, రుక్మిణి, సత్యభామ, సావిత్రి.. ఇలా స్త్రీ పాత్రలు ఎక్కువగా వేసేవాడు. పెద్ద పాటపాడి ఎగిరి, దుమికి అలసి పోయేవాడు. తెల్లవారి పెట్రోమాక్స్ లైట్ తిరిగి ఇవ్వడానికి వచ్చిన శంకర్ను “నిన్న పాటలు బాగ పాడినవురా పిలగా, ఎక్కడ నేర్చుకున్నవ్ ?!” అని నానమ్మ మెచ్చుకుంటే.. శంకర్ సిగ్గుతో మెలికలు తిరిగిపోయేవాడు.
– నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
“Ramaayanam | నేడేయ్.. చ్చూడండీయ్! మీ అభిమాన..”
“Ramaayanam | బంధువులొస్తే.. బడికి డుమ్మా!”
“Ramaayanam | పెద్ద సారూ! చిన్న సారూ!”
“Ramaayanam | నేను బడికి వెళ్లిన విధంబెట్టిదనిన..”