Ramaayanam | అప్పట్లో మా ఊర్లో ‘జయలక్ష్మీ నరసింహ’ అనే ఏకైక సినిమా థియేటర్ ఉండేది. అందులో ఐదారేండ్ల కిందటివీ, ఇంకా పాత సినిమాలు మాత్రమే వస్తుండేవి. లేట్గా వచ్చేవి కాబట్టి.. బాగా హిట్ అయిన సినిమాలే వచ్చేవి. ఒక్కో సినిమా వారం నుంచి పదిహేను రోజులు ఆడేది.
థియేటర్లో సినిమా మారగానే ఊర్లోకి రిక్షా బండి వచ్చేది. దానికి రెండు వైపులా పోస్టర్లు అంటించి ఉండేవి. పిల్లలంతా ఆ బండి వెనుక పరుగెత్తేవాళ్లు. అందులోంచి ఒకడు కర్ణకఠోరమైన గొంతుతో అనౌన్స్ చేసేవాడు.. ‘నేడేయ్.. చ్చూడండీయ్! మీ అభిమాన కళామందిరం జయలక్ష్మి నరసిమ్మ టాకీసు వెండితెరపై బ్రమ్మాండమైన విడుదల! మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటీయ్.. కలలు కంటున్నటువంటీయ్ చిత్ర రాజము.. మీ అభిమాన అందాల తార, మందార మాల, గులాబీ బాల వాణిశ్రీ నటించిన..’ ఇలా చెబుతుండేవాడు. దాన్నిబట్టి ‘ఓహో! ఆ సిన్మా వచ్చిందన్నమాట!’ అని తెలిసేది.
మేము ఎప్పుడో తప్ప సినిమాలకు వెళ్లేవాళ్లం కాదు. అయితే నానమ్మకు సినిమాలు ఇష్టం. సినిమాకు వెళ్లాలని అనుకున్నప్పుడల్లా మమ్మల్ని యెగరబెట్టేది. మేము వెళ్లి నాన్నను అడిగేవాళ్లం. ఎప్పుడో తప్ప.. నాన్న వద్దనేవాడు కాదు. చాలా అరుదుగా.. ‘ఇప్పుడొద్దులెండి! పైసలు లేవు’ అనేవాడు. నానమ్మ వెంటనే.. ‘నా దగ్గరున్నయ్. పోదాం.. బండి ఇయ్యమను!’ అనేది.
మాకు ఒక సవారి కచ్చడం ఉండేది. దాంట్లో గడ్డిమీద జంపఖానా పరిచి, బండికి ఒక కందిలి కట్టి సిద్ధం చేసేవాళ్లు. మేము తొందరగా అన్నాలు తిని రెడీ అయ్యేవాళ్లం. ఆ టాకీసులో రెండే షోలు. ఒకటి మాటినీ.. మధ్యాహ్నం మూడు నుంచి ఏడు దాకా. ఇక రాత్రి ఫస్ట్ కమ్ సెక్ండ్ షో.. ఎనిమిదింటి నుంచి పదకొండు కొట్టేదాకా. మేము రాత్రి షోకే వెళ్లేవాళ్లం.
ఏడు గంటలకు రికార్డులు వేసేవారు. ‘ఘనాఘన సుందరా! దినకరా శుభకరా! నా కంటి పాపలో నిలిచిపోరా!’ వంటి ఘంటసాల, సుశీల పాటలు ఎన్నో వేశాక.. సినిమా మొదలయ్యేది. పాటలు వినిపించగానే.. ‘ఇగపోదాం పాండి! నేను ఒచ్చినాక తింట’ అని తొందరపెట్టేది నానమ్మ.
సినిమా పేరుకే ఎనిమిదింటికి గానీ.. అందరూ వచ్చి సీట్లు నిండేదాకా మొదలు పెట్టేవారే కాదు. ఫస్ట్ క్లాస్లో కుర్చీలూ, మధ్య తరగతిలో బెంచీలూ, ఎక్కువ శాతం నేలక్లాసూ ఉండేవి. ఒక్క ఫస్ట్ క్లాస్కే ఫ్యాన్లు ఉండేవి. రెండు రూపాయలు, రూపాయి, ఆఠానా.. టిక్కెట్ల రేట్లు. చంకలో ఎత్తుకున్న పిల్లలకు ఫ్రీ కనుక.. చాలామంది తమ పిల్లల కాళ్లు నేలకు తాకుతున్నా.. అలాగే ఎత్తుకుని తీసుకెళ్లేవారు. అప్పటికి సీటింగ్ కెపాసిటీ అన్న పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు ఆ టాకీసు వాళ్లకు. హిట్ సినిమా అయితే జనాన్ని కుక్కేసేవాళ్లు. ఇంటర్వల్లో ఒకళ్లిద్దరు మగపిల్లలు వెదురుబుట్టలు చేతికి తగిలించుకుని వేయించిన పల్లీలు, బఠాణీలు అమ్మేవారు. భలే రుచిగా ఉండేవి.
ప్రేక్షకులు సినిమాలో చాలా లీనమయ్యేవాళ్లు. హాస్య సన్నివేశాలు వచ్చినప్పుడు పడీపడీ నవ్వడం, దుఃఖ సన్నివేశాల్లో ముక్కులు చీదుకుంటూ, కన్నీళ్లు కారుస్తూ ఏడవడం షరా మామూలే. ముఖ్యంగా సావిత్రి, శారద వంటి వాళ్లు జుట్టు విరబోసుకుని, నల్లచీరలు కట్టి ఏడుస్తూ పాట పాడుతుంటే.. మేము ఓరకంట నానమ్మను చూసేవాళ్లం. నానమ్మ చీర కొంగుతో కండ్లు తుడుచుకునేది. ఆ కష్టాలు మొగుడి పాత్ర వల్ల వస్తే.. ‘వీణ్ని బండకు కొట్టనుండె! చెడ కష్టాలు బెడుతున్నడు’ అనీ, అత్త వల్ల వస్తే.. ‘దీని దవుడలు దగ్గరికి ఒత్తనుండె! గింత రవుసు బెడ్తదా?!’ అనీ తీవ్రంగా స్పందించేది.
ఒకసారి ఓ గమ్మత్ జరిగింది. ‘ప్రేమ్నగర్’ సిన్మాలో ‘లే లే.. లేలేలే నా రాజా!’ పాట వచ్చింది. హాలంతా విజిల్స్, చప్పట్లూ, ఒకటే గోల! ఒకాయన.. ‘ఆఁ ఒస్తున్నా!’ అంటూ డాన్స్ చేస్తూ పదేపదే స్క్రీన్ దగ్గరికి వెళ్తున్నాడు. ‘వన్స్మోర్!’ అని అరుస్తున్నాడు. అప్పటికే అభిమానుల కోరికపై వన్స్మోర్ అయ్యింది. ఇంకెన్నిసార్లు వేస్తారు వాళ్లుమాత్రం?! ఆయనేమో ఎంతకూ వినడం లేదు. చివరికి నలుగురు కలిసి బలవంతంగా బయటికి పట్టుకుపోయారు. తీరా చూస్తే.. ఆయన మాకు బళ్లో పాఠాలు చెప్పే చిన్నసారు!
ప్రతి షోలో రెండుమూడు సార్లు పది నిమిషాల సేపు బ్రేక్ ఉండేది. సినిమా ఆగిపోగానే.. ‘రీలు మార్పు – నిశ్శబ్దం’ అనే ైస్లెడ్ వేసేవారు. వెంటనే అందరూ.. ‘ఓ!’ అంటూ ఒకేసారి నిట్టూర్చడం, ఆ తరువాత పెద్దగా మాట్లాడటం వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడేది. అదొక్కటేనా.. ‘దయచేసి పొగ త్రాగరాదు!’, ‘దయచేసి ఎదుటి సీట్లపై కాళ్లు పెట్టరాదు!’, ‘దయచేసి ప్రహరీ గోడలపై మూత్రము పోయరాదు!’ అంటూ రకరకాల ైస్లెడ్స్ ద్వారా కోరినా.. ఆ వద్దన్న పనులన్నీ బయటికి దయచేసి కొన్నీ, దయ చేయకుండా కొన్నీ.. ఏమాత్రం దయ లేకుండా చేసేవారు ప్రేక్షకులు. మళ్లీ సిన్మా మొదలయ్యేటప్పటికి సిగరెట్, బీడీ, చుట్ట కంపుతోనూ, పొగతోనూ నిండి హాలంతా మేఘావృతం అయ్యేది.
ఒక్కోసారి కరెంట్ పోతే అరగంటో, గంటో సినిమా ఆగిపోయేది. కరెంట్ వచ్చాకే మళ్లీ మొదలయ్యేది. ఒక్కోసారి మాకు విసుగు పుట్టి, నిద్ర వచ్చి.. ‘నానమ్మా! ఇంటికి పోదాం!’ అనేవాళ్లం. ‘పోదాం.. ఇగ ఒక్క పావుగంట చూసి, కరంటు రాకుంటె అట్లనే పొయ్యేది తియ్యి!’ అనేది గానీ.. వచ్చేది మాత్రం కాదు. ఒక్కోసారి బండివాణ్ని నిద్ర లేపి ఇంటికి వచ్చేసేవాళ్లం. కొన్నిసార్లు ఇక ఆ రోజుకు కరెంట్ రాదని తెలిస్తే.. థియేటర్ వాళ్లు మళ్లీ తెల్లవారి చూడ్డం కోసం అందరికీ నెంబర్ వేసి, పాసులు ఇచ్చేవాళ్లు. ఆ థియేటర్లో మేము ఎన్నో హిట్ సినిమాలతోబాటు కొన్ని క్లాసిక్స్ కూడా చూశాం. మాయాబజార్, లవకుశతోపాటు చిల్లరదేవుళ్లు, మా భూమి, దాసి వంటి తెలుగు సినిమాలూ, చిత్ చోర్, ఘరౌందా, రజనీగంధ, అర్ధ్ సత్య వంటి హిందీ సినిమాలు కూడా చూశాం. తరువాతి రోజుల్లో ఆ థియేటర్ మూతబడింది. మరి రెండు కొత్తవి వెలిశాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్లకు వెళ్లినా ఆ ఆనందం రాదు.
– నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
“Ramaayanam | బంధువులొస్తే.. బడికి డుమ్మా!”
“Ramaayanam | పెద్ద సారూ! చిన్న సారూ!”
“Ramaayanam | నేను బడికి వెళ్లిన విధంబెట్టిదనిన..”