పరమానందం ( Paramaanandam ) | మా ఇంటి ముందే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండేది . అదొక గూనపెంకుల ఇల్లు. పక్కనే ఆ ఇంటి వాళ్లదే గొర్రెల దొడ్డి. మధ్య మధ్యన గాలి వీచినప్పుడల్లా మాకు ఆ గొర్రె పెంట వాసన వస్తుండేది. బాలశిక్షా అక్కడే , ఒకటో క్లాసూ అక్కడే. అట్లా వరుసగా నాలుగో తరగతి దాకా ఒక పెద్ద హాలు లాంటి గదిలోనే అన్నీ! పక్కనే ఒక అర్ర ఉండేది గానీ, అందులో ఆ ఇంటి ఓనర్లు నాగలి, గుంటుక, గొర్రు (వీటి పేర్లు నాకు తరువాత తెలిశాయి) తదితర పరికరాలు దాచుకునేవారు. ఆ వాతావరణం చాలా వింతగా అనిపించేది.
ఇంతకుముందే చెప్పినట్టు, మా బడిలో ఇద్దరే సార్లు ఉండేవారు. బాలశిక్ష నుంచి నాలుగో తరగతి దాకా అయిదు క్లాసుల వాళ్లకు ఏకకాలంలో ఇద్దరే ఎలా బోధించారా అనే అనుమానం మీకు అక్కర్లేదు. అన్ని పాఠాలూ అందరూ ఐకమత్యంగా వినాల్సిందే. ‘అ-అమ్మ, ఆ-ఆవు, ఇ-ఇల్లు’.. అయినా సరే, ‘క’ గుణింతమైనా సరే. తుకారాం నాలుగో తరగతిలో ఉండేవాడు. ఎప్పటికీ చిరంజీవిగా ఉండేలా ఆంజనేయుడికి ఎవరో వరమిచ్చినట్టు ..తుకారాం కూడా ఎన్నో ఏళ్లుగా అదే క్లాస్లో ఉండేవాడు. సార్ల సౌలభ్యం కోసమో, ఎంతచెప్పినా చదువు ఒంటబట్టక పోవడమో.. కారణం తెలిసేది కాదు. అయితే, తుకారాం చదువు తప్ప మిగతా వాటిలో సకలకళా వల్లభన్. మంచిగా పాటలు పాడేవాడు. డ్యాన్స్ కూడా చేసేవాడు. డీయీవో వచ్చినప్పుడు ఎంటర్ టెయిన్మెంట్ కోసం తుకారాంను ప్రవేశపెట్టేవారు సార్లు. అతను ‘ఆకేస్కో.. పోకేస్కో నా రాజా!’ అనే పాటపాడుతూ డ్యాన్స్ చేసేవాడు. లేకపోతే వీధి భాగవతంలోని ‘అల్లిరాణిని నేనే’ పాట పాడుతూ ఎగిరేవాడు. చూసేవాళ్లంతా నవ్వుతుంటే తను ఆనందించేవాడు. మూడో తరగతికి వచ్చేదాకా మాకు నోట్బుక్స్ అంటే తెలియదు. పలకా, బలపం, పాఠ్యపుస్తకం, వల్లె వేయడం.. అంతే! పలకలు తుడిచీ, తుడిచీ అందులో ఎంతో ప్రావీణ్యం సంపాదించేవాళ్లం. పలక రాయికిచుట్టూ కర్ర ఫ్రేమ్ ఉన్న పలకలు రాయడానికి బావుండేవి. కొంతమంది పలకలు ఫ్రేమ్ విరిగి పోయి, ఊడిపోయి, పలక కూడా రెండు మూడు పక్కలుగా విరిగి శ్రీలంక దేశపటంలా ఉండేవి. ఆ తరువాతి రోజుల్లో రేకు పలకలు వచ్చాయిగానీ, అవేమంత బాగుండేవి కావు. పలకలకు రోజూ పదిసార్లు స్నానాలు పోయడం వల్ల పైన ఉన్న కోటింగ్ పెచ్చులు పెచ్చులుగా లేచిపోయి రాయడానికి ఏ మాత్రం సౌకర్యంగా ఉండేవి కావు.
పలకలకు గట్టి పెట్టడం అనేది ఒక బృహత్తర కార్యం. మాటిమాటికీ దిద్దడం, మలపడం మళ్లీ దిద్దడం.. ఇదే పనాయె! కొందరు పిల్లలు షార్ట్ కట్ మెథడ్ కనిపెట్టి నోట్లోని ఉమ్మి తీసి పలకలకు రుద్ది ఆ తడితో అక్షరాలను తుడిచివేసేవాళ్లు. ఇది గమనించిన సార్లు ఆ కారణానికి కూడా పిల్లల్ని ఎన్ని తుడుపులకు అన్ని దెబ్బలు కొట్టేవారు. చివరికి గురువులే ఓ పరిష్కారం కనిపెట్టారు. ఇంటి వాళ్లు బర్రెలకు కుడితి పెట్టే గోలెం ఒకటి కబ్జా చేసి, అందులో రోజూ నీళ్లు పోసే పనిని ఆల్ జీరోస్ (అన్ని సబ్జెక్టుల్లోనూ సున్నా మార్కులొచ్చే) పిల్లగాడికి అప్పగించారు. అతను లేనప్పుడు తుకారాం గానీ, అక్కయ్యగానీ ఉండనే ఉన్నారు. ఆ గోలెంలో అడుగున పాకురు పట్టిన నీళ్లు ఆకుపచ్చగా ఎంతో కలర్ఫుల్గా కనిపించేవి. అందులో పురుగులు లుకలుకలాడుతూ ఉన్నా పిల్లలు పలకలు గట్టి పెట్టడానికి అవే నీళ్లువాడేవారు. బద్ధకిస్టులకు ఎవరూ చూడకపోతే ఉమ్మి ఉండనే ఉండేది. మాకు మాత్రం అమ్మ ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఒక సీసాలో నీళ్లూ, పలక తుడవడానికి ఓ బట్టా ఇచ్చి పంపేది. నేను వారానికో బలపాల డబ్బా ఖతం చేసేదాన్ని. అంటే క్యాల్షియం లోపం వల్ల బలపాలూ, చాక్ పీసులూతినేదాన్నని కాదు. కొంచెం చిన్నగా అయినా ఆ బలపాన్ని వాడేదాన్ని కాదు. పైగా ఎవరైనా చిన్న బలపం ముక్కతో దిద్దుతూ నా వైపు జాలిగా చూశారంటే చాలు.. ఓ కొత్త బలపం వాళ్లకు ఇచ్చేసేదాన్ని. అలా నా వైపుజాలి చూపులు పెరిగేసరికి నేను ఎక్కువ బలపాలు కొనాల్సిన అవసరం ఏర్పడేది.
అప్పట్లో చాలామంది మగపిల్లలకు అంగీలకు గుండీలు సరిగ్గా లేకపోవడం, కాళ్లకు చెప్పులు లేకపోవడం, లాగులు పెద్దగా ఉండి జారిపోతుంటే వాటిని పైకి లాక్కుంటూ మొలతాడుతో ఆపి పెట్టడం.. సర్వసామాన్యం. అంతేకాదు, నూటికి సగానికెక్కువ మందికి గజ్జి కురుపులు, రక్తాలు కారేంత గాయాలు ఉండేవి. ఇసుకలో, దుమ్ములో, రాళ్లలో పడిపోయేంత ఆడటం, కొమ్మలూ, గోడలెక్కి దూకడం వాళ్లకు సిలబస్లా ఉండేది.
బడిలో సాయంత్రం పాఠాలు పెద్దగా ఉండేవి కావు. మూడింటి నుంచే ఒంట్లు (అంటే గుణింతాలు) నేర్పేవాళ్లు. పిల్లల్ని లైన్లలో నిలబెట్టి వల్లె వేయించేవారు.
‘ఒక్కెక్కమొకటి, ఒక్క రెండు రెండు, మూడొకట్ల మూడు, మూడు రెండ్ల ఆరు.. అంటూ ఇక ఇంటికెళ్లి పోతామనే సంతోషంలో అందరూ గొంతులు పెకిలించుకుని చదువుతుంటే మా ఇంట్లో చదువుతున్నట్టే వినపడేది. నేను చాలా రోజులు సాయంత్రం బడి డుమ్మా కొట్టేదాన్ని. ఇంటి ఎదురుగానే కనుక వాళ్లు లయబద్ధంగా చదువుతుంటే ఇష్టంగా వినీ వినీ నాకు అన్ని ఎక్కాలూ నోటికి వచ్చేవి.
ఆ బడిలో నేను పాఠాలే కాదు, చింత బరిగెల విన్యాసాలూ నేర్చుకున్నాను. సెలవుల్లో, బడి ఎగ్గొట్టిన రోజుల్లోచెట్లకూ, గోడలకూ పాఠాలు చెబుతూ.. నేనొక సార్గా (అప్పటికి లేడీ టీచర్లుంటారని కూడా నాకు తెలియదు) భావించి.. నా పై తరగతి పాఠాలు కూడా చెబుతూ, వాటితో వల్లె వేయిస్తూ చెప్పిన మాట వినని గోడలను బెత్తంతో కొడుతూ పరమానందం పొందేదాన్ని. నిజమే, ఆ రోజులే వేరు.
– నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | నేను బడికి వెళ్లిన విధంబెట్టిదనిన..