Kasi Majili Kathalu Episode 81 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : కన్యాకుబ్జ మహారాజు తాళధ్వజునికి ఇరవైమంది రాకుమారులు. వారిలో మొదటి ఐదుగురూ తూర్పుదిక్కు రాజ్యలను గెలిచి వచ్చారు. తర్వాతి ఐదుగురూ ఉత్తర దిగ్విజయ యాత్రకు వెళ్లి, ఇంకా ఇంటికి రాలేదు. ఆ తర్వాతి ఐదుగురిలో నలుగురు వరుణద్వీపాధిపతిని గెలవాలనేప్రయత్నంలో ఉండగా.. దేవకాంతలను దర్శించారు.
ముఖమంటపంలో వరుసగా నిలబడి ఉన్న నలుగురు అన్నదమ్ములనూ దేవకాంతలు తిలకించారు. తెల్లని పట్టువస్ర్తాలు ధరించిన విక్రముని వద్దకు మధుమతి వెళ్లి ఇలా చెప్పసాగింది.. “ఆర్యా! నేను ఇంద్రుని కూతురిని. ప్రభావతి అనే అప్సరస వల్ల జన్మించాను. ఆ ముగ్గురూ నా స్నేహితురాళ్లు. యమునికి, వరుణునికి, కుబేరునికి కూతుళ్లు. మా నలుగురు తల్లులూ అప్సరలే కావడం వల్ల మేమొక్కచోటే పెరిగాం. యవ్వనవతులమైన తర్వాత.. ఉత్తములైన పతులను పొందే ఉపాయం కోసం బృహస్పతుల వారిని ఆశ్రయించాం. ఆయన చెప్పిన ప్రకారం ఈ గాయత్రీదేవిని నియమపూర్వకంగా ఆరాధించాం. నేటితో మా వ్రతం పరిసమాప్తమైంది. మేం మా కాబోయే వరుల కోసం ఉంచిన వస్ర్తాలను మీరు ధరించారు. ఏ ప్రకారంగా మీ చేతికి ఆ వస్ర్తాలు వచ్చాయో మేం తర్కించం. మేం కోరుకున్నది నెరవేరితే.. గాయత్రీదేవి అనుగ్రహించినట్లే భావించమని దేవగురువు ముందే చెప్పి ఉన్నారు.
అందులోనూ ఈ ద్వీపానికి శక్తిద్వీపమని పేరు. దీనికి నాలుగువైపులా శక్తి ఆలయాలున్నాయి. మధ్యలో గాయత్రీ ఆలయముంది. ఆ మహాదేవి ఆజ్ఞ లేనిదే సామాన్యులు ఈ దీవిలో ప్రవేశించలేరు. కనుక మిమ్మల్ని అతిలోక వీరులని భావిస్తున్నాం.
ఆ వేదమాత ఆజ్ఞ ప్రకారమే.. మిమ్మల్ని నేను వరిస్తున్నాను. ఇంద్రనీలపు రంగు కలిగిన వస్ర్తాలు ధరించిన ఆర్యపురుషుణ్ని మా గంధవతి, ఎరుపు రంగు వస్ర్తాల్లో ఉన్నవారిని మా వారుణి వరిస్తారు. ఇక ఆ ఆకుపచ్చరంగు మా చంద్రకళ ఎంపిక. మమ్మల్ని స్వీకరించండి”.. నలుగురు దేవకన్యలూ నలుగురి మెడల్లో వరమాలలు వేశారు. జనసంచారంలేని ఆ దీవిలో నలుగురు అన్నదమ్ములూ తమ భార్యలతో కొన్నాళ్లపాటు
ఆనందంగా కాలక్షేపం చేశారు.
చివరికి ఒకనాడు విక్రముడు తన భార్య అయిన మధుమతితో మాట్లాడుతూ.. “సఖీ! మా చరిత్రనంతా నీకు చెప్పాను కదా! ఇన్నాళ్లనుంచీ మీ కేళీవిలాసాలలో మైమరిచి అసలు వచ్చిన పనిని పక్కన పెట్టేశాం. ఇక మేం క్రోధనుణ్ని జయించాల్సి ఉంది. కానీ, ఆ నగరం చుట్టూ అనేక యంత్రాలు నిర్మితమై ఉంటాయి. సముద్రమార్గంలో వెళ్తే.. ఎప్పటికీ అక్కడికి చేరుకోలేం. ఆకాశగమనం ఒక్కటే దిక్కు. స్వర్గలోకం నుంచి మాకోసం విమానాలు తీసుకురావడం సాధ్యమేనా?” అని కోరాడు.
అందుకు మధుమతి.. “మనోహరా! స్వర్గంలోని విమానశాలలో వేలాది విమానాలు ఉంటాయి. అయితే మాకు ఆకాశగమనం సహజం. జంటగా పయనించాలంటే మాత్రమే విమానాలు అవసరం అవుతాయి. అందుచేత విమానశాల అధికారులు భార్యాభర్తల జంటలకు మాత్రమే విమానాలు ఇస్తారు. మన వివాహ వృత్తాంతం మా పెద్దలతో చెప్పడానికి కొద్దిగా జంకుతున్నాం. మానవులను పెళ్లాడినందుకు వారేమైనా కోపగించుకుంటారేమోనని శంకగా ఉంది. అయితే మన సంఘటన గాయత్రీదేవి వల్లనే కలిగింది కనుక.. వారు మమ్మల్ని నిందింప కూడదు. సరే.. మమ్మల్ని పంపండి. మీకోసం విమానమొకటి తీసుకొస్తాం” అని చెప్పింది.
మరునాటి తెల్లవారుజాము వేళలో నలుగురూ స్వర్గానికి ఎగిరి వెళ్లారు. చెప్పిన గడువు లోపల వారు తిరిగి రాకపోవడంతో అన్నదమ్ములు ఒకింత నిరాశకు గురయ్యారు. మరో రెండురోజులు ఓపికగా నిరీక్షించిన తరువాత, అమ్మవారిపైనే భారంవేసి జాగరం చేశారు.
తెల్లవారే సమయానికి అంతరిక్షంలో గంటల చప్పుడు వినిపించింది. మణికాంతులతో, కనకమయమైన విమానం ఒకటి ఆలయ ప్రాంగణంలో దిగింది. రాజపుత్రుల ముఖాలు వికసించాయి.
“నాథా! మన వివాహ వృత్తాంతం విని, మా తండ్రిగారు కోపగించారు. బృహస్పతులవారు, దేవర్షి నారదులవారు నచ్చజెప్పిన తరువాత శాంతించారు. మీతో కలిసి భూలోకంలో విహరించేందుకు వీలుగా ఈ విమానాన్ని దయచేశారు” అని చెప్పింది మధుమతి.
“ప్రేయసీ! ఈ విమానం కామగమనం కలిగినది కదా! దీనిని వరుణావతీ నగరానికి పోయేలా స్మరించండి. రాత్రివేళ మమ్మల్ని అక్కడ దింపి, మీరు స్వర్గానికి వెళ్లండి. మళ్లీ మేం స్మరించినప్పుడు ఆలస్యం చేయకుండా రండి. మేం ఆ క్రోధనుణ్ని జయించిన తరువాత మనమందరం కలిసి విమానమెక్కి, మా నగరానికి పోదాం” అన్నాడు విక్రముడు.
అతను చెప్పినట్లే చేసింది మధుమతి. నలుగురు అన్నదమ్ములూ క్రోధనుడి వరుణావతీ నగరంలో దిగారు.
క్రోధనుడికి తోటి చక్రవర్తులంటే నిరసనభావం. యతులంటే అతిభక్తి. ఆ సంగతి ముందే తెలిసినందువల్ల నలుగురు అన్నదమ్ములూ యతివేషాలు వేసుకున్నారు. సూర్యోదయం కాగానే, యతులు నివసించే శంకరమఠానికి వెళ్లి, అక్కడ విడిది చేశారు.
వారక్కడకు వెళ్లిన నాలుగురోజుల్లోనే వారి పేరు నగరమంతా మారుమోగిపోయింది. చక్కటి వర్చస్సు ఉట్టిపడే యువకులైన సన్యాసులు కావడం ఒక ఆకర్షణ అయితే.. తటాకంలో నీరు తాగినప్పటినుంచి ఆకలిదప్పులు లేని కారణంగా ఎవ్వరినుంచీ కనీసం పళ్లు కూడా తీసుకోకపోవడం మరో విచిత్రంగా నగరవాసులకు తోచింది.
నలుగురు అన్నదమ్ములూ నగరంలో తరచుగా తిరిగేవాళ్లు. యథారాజా తథాప్రజా అన్నట్లు.. క్రోధనుడి రాజ్యంలో ప్రజలందరూ యతులంటే భక్తి కలిగినవాళ్లే! అందువల్ల రహదారి వెంట నడిచి పోతుంటే ప్రతి ఇంటినుంచి ఎవరో ఒకరు వచ్చి.. వాళ్లకు నమస్కరించేవారు. ఏ పళ్లో సమర్పించేవారు. ఆ పళ్లను వాళ్లు తినకుండా వేరొకరికి ఇచ్చేస్తుండేవాళ్లు. వాటిని యతిప్రసాదంగా ఇతరులు తీసుకునేవారు.
ఆ నగరంలోని ఒక వీధిలో పది యంత్రాలు ఉన్నాయి. ఒక మర తిప్పితే అన్నివైపులా ఇనుపతలుపులు మూసుకుపోతాయి. శత్రువులు వాటిని బద్దలు కొట్టి ఇవతలికి రాలేరు. ఇవతలివారు అవతలికి పోలేరు. కోటలో ఇంకా అటువంటి దుర్గాలు అనేకం ఉన్నాయి. ఎంతటి బలవంతులైనా ఆ యంత్రవ్యూహాలను ఛేదించి, ఆ రాజ్యాన్ని గెలుచుకోవడం అసాధ్యం. అన్నదమ్ములు అవన్నీ పరిశీలిస్తూ.. క్రోధనుణ్ని గెలిచే ఉపాయాలు రచిస్తూ ఉండేవారు.
మరికొద్ది రోజులకు క్రోధనుడికి కూడా వాళ్లను దర్శించుకోవాలనే కోరిక పుట్టింది. స్వయంగా వారి వద్దకు వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేశాడు. “యతిసత్తములారా! ఈపూట మీకు మా ఇంట భిక్షావందనం అర్పించుకోవడానికి మా దంపతులకు అవకాశం ఇవ్వండి. దయచేసి భద్రగజాన్ని అధిరోహించండి” అని కోరాడు.
“రాజా! మేం కోరిన భిక్షను ఇస్తానంటే తప్పకుండా వస్తాం. కానీ, మాకు వాహనాలతో పనిలేదు. నీ పరిచారకుడు ఒకరిని మాతో ఉంచు. నువ్వు ఇంటికి వెళ్లి ఏర్పాట్లు చేసుకో! మేం నడిచే వస్తాం” అన్నాడు విక్రముడు.
క్రోధనుడు అంగీకరించి, వెళ్లిపోయాడు. సోదరులు మఠానికి వెళ్లి.. లోపల జెట్టిలాగులు ధరించి, కోటకు వెళ్లారు. క్రోధనుడు వారిని సగౌరవంగా తీసుకుని వెళ్లి, పాదపూజ చేశాడు.
“స్వాములారా! ఈ భక్తుడు మీకేం సమర్పించాలో తెలియచేయండి” అని కోరాడు.
“మాకు యుద్ధభిక్ష కావాలి” అన్నాడు విక్రముడు శాంతంగా.
క్రోధనుడు ఆ మాట విని ఆశ్చర్యపోయాడు.
“చూడటానికి చిన్నపిల్లల్లా ఉన్నారు. యతివేషంలో ఉన్నారని గౌరవించాను. కానీ, మీరిలా యుద్ధం కోరడం…” అని సందిగ్ధంగా ప్రశ్నించాడు.
“రాజా! మేం యతివేషధారులమే కానీ కన్యాకుబ్జ రాజపుత్రులం. నీ యంత్ర సామర్థ్యాన్ని గురించి విని, నిన్ను గెలవాలనే ఉద్దేశంతోనే ఆకాశమార్గంలో ఇక్కడికి వచ్చాం. నీతో ద్వంద్వయుద్ధం కావాలి” అని పలికాడు విక్రముడు.
“సరే అయితే.. మీ కోరిక నెరవేరుస్తాను. మీరు నలుగురూ ఒకేసారి యుద్ధం చేయవచ్చు. కావాల్సిన ఆయుధాలు కూడా నేనే ఇస్తాను” అన్నాడు క్రోధనుడు.
“మాలో ఒకరితో పోరాడితే చాలు” అంటూ విక్రముడు పక్కనే ఉన్న గదను అందుకున్నాడు.
మిగిలిన ముగ్గురు అన్నదమ్ములూ ఆయుధాలతో ద్వారాలవద్ద నిలిచి, ఎవరూ లోనికి రాకుండా కాపలా కాస్తున్నారు.
గదాయుద్ధం ప్రారంభమైంది. క్రోధనుడు సామాన్యుడు కాడు. విక్రముడికి పరాక్రమంలో సాటిలేదు. ఒకరి గదను మరొకరు ప్రహరిస్తుంటే వస్తున్న శబ్దాలకు కోటగోడలు అదురుతున్నాయి. ఒకవైపు నుంచి మరొకవైపు వారు లంఘిస్తుంటే భూమి దద్దరిల్లుతున్నది.
శుద్ధాంతఃపురంలో అకస్మాత్తుగా యుద్ధ వాతావరణం నెలకొనేసరికి.. మహారాణి సహా అందరూ కలవరపాటుకు గురయ్యారు. గుండెలు చిక్కబట్టుకుని చూస్తున్నారు. విక్రముడి దెబ్బలకు క్రోధనుడి మర్మసంధులు సడలిపోతున్నాయి. విపరీతంగా ఆయాస పడసాగాడు.
“మహావీరా! ఒక్కక్షణం ఆగు. అలుపు తీర్చుకోనీ” అన్నాడు క్రోధనుడు.
విక్రముడు వెనక్కి తగ్గాడు.
“నీ ప్రతాపం ఇంతేనా? భూమండలం మీదనున్న చక్రవర్తులందరిలో నీ అంతటివాడు లేడని పేరు తెచ్చుకున్నావు కదా.. ఈ మాత్రానికేనా?” అన్నాడు పరిహాసంగా.
క్రోధనుడు క్రోధావేశాలతో గద అందుకోబోయాడు.
“నీకు గదాయుద్ధం చేతకాకపోతే.. నువ్వు బాగా నేర్చిన ఆయుధాన్ని ఎంచుకోవచ్చు. ఎందులో అయినా ఇంతకంటే పాండిత్యం లేదంటే.. ఓటమి ఒప్పుకొని, నా కాళ్లకింద నుంచి దూరిపో” అన్నాడు విక్రముడు మీసం మెలివేస్తూ.
క్రోధనుడిలో రోషం పొంగులు వారింది. విక్రముడితో ముష్టియుద్ధానికి తలపడ్డాడు. ఒంటినిండా దెబ్బలతో.. కాళ్లు చేతులు స్వాధీనంలో లేని స్థితిలో కొద్దిసేపటిలోనే క్రోధనుడు యుద్ధం విరమించాడు.
“రాజా! ఓటమిని అంగీకరిస్తావా.. ఇంకొంచెం సమయం తీసుకుంటావా?! కావాలంటే నీకు సాయంకోసం సైన్యాన్ని పిలుచుకో. నీకు మూడురోజులు సమయం ఇస్తున్నాను. ఆ లోపుగా నీ నుంచి రణపత్రిక రావాలి లేదా మాకు తగిన సన్మానంతో జయపత్రిక ఇవ్వాలి” అంటూ విక్రముడు అక్కణ్నుంచి తమ్ముళ్లతో సహా వెళ్లిపోయాడు.
మహారాణి లోనికి వచ్చి భర్తకు ఉపచారాలు చేయసాగింది. ఆమెతో పాటుగా చారుమతి కూడా వచ్చింది.
“బాబాయిగారూ! రేపు సాయంత్రానికల్లా నా భర్త, తన తమ్ముళ్లతో సహా వస్తారు. వారు అరివీర భయంకరులు. మీ పక్షాన యుద్ధం చేసి, మీకు విజయం చేకూర్చి పెట్టగలరు” అని ఓదార్పు వచనాలు పలికింది.
చారుమతి మరెవరో కాదు.. విక్రమాదులకు అన్నగారైన హరివర్మకు భార్య. అవంతీశ్వరుని కూతురు. బ్రహ్మరాక్షసుని బారినుంచి ఆమెను హరివర్మ కాపాడి, పరిణయమాడాడు. కన్యాకుబ్జానికి తిరిగివెళ్తూ.. ద్వారవతిలో మామగారిని కలుసుకున్నాడు హరివర్మ. ఆయన ప్రోద్బలంతోనే అవంతీశ్వరుని తోడల్లుడైన క్రోధనుని ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. విక్రమాదులు యుద్ధానికి వచ్చే సమయానికి సముద్ర విహారం కోసం వెళ్లినందువల్ల కోటలో లేడు. వస్తూనే పినమామగారి ఓటమిని తెలుసుకుని, హరివర్మ తన నలుగురు సోదరులతో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు.
విక్రముడు, మిగిలిన ముగ్గురు సోదరులు కూడా తరలివచ్చారు. యుద్ధరంగంలో ఆ తొమ్మిదిమంది సోదరులూ కలుసుకున్నారు. కొత్తగా కలిసిన బంధుత్వాలతో అప్రకటితంగా యుద్ధవిరమణ జరిగిపోయింది.
విక్రముడు ప్రభావతిని స్మరించడంతో.. ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి దేవలోక విమానాన్ని తీసుకువచ్చింది. తొమ్మిదిమంది సోదరులూ భార్యలతో సహా ఆకాశమార్గంలో మహారాష్ర్టానికి వెళ్లారు. అక్కడ వీరిని చూసిన శ్రీధరుడు ఆశ్చర్యపోయాడు.
“మీరందరూ సముద్రంలో మునిగి చనిపోయారని తెలిసి, మీ అన్నగారైన శ్రీముఖుడు ఎంతగానో దుఃఖించాడు. తాను కూడా ప్రాయోపవేశం చేయాలని తలిస్తే.. నేనే బలవంతంగా మాన్పించి, ఇంటికి పంపించాను. ఈపాటికి చేరి ఉండవచ్చు” అని తెలిపాడు.
వెనువెంటనే విమానంపై వారంతా కన్యాకుబ్జానికి ప్రయాణమయ్యారు.
అప్పటికే శ్రీముఖుడు తెచ్చిన వార్తవిని, వారి తండ్రి అయిన తాళధ్వజుడు శోకసముద్రంలో మునిగిపోయాడు. తల్లి అయిన సౌభాగ్యసుందరి దుఃఖం పట్టరానిదిగా ఉంది.
“ఎక్కువమంది పిల్లలు పుట్టడం కూడా రట్టుకే వచ్చింది. ఉత్తరానికి వెళ్లిన ఐదుగురూ ఏమైపోయారో తెలియడం లేదు. ఇప్పుడేమో ఈ వార్త వినాల్సి వచ్చింది” అంటూ గుండెలు బాదుకుంటూ శోకించసాగింది. ఇంతలో తొమ్మండుగురు సోదరులూ భార్యలతో సహా వచ్చి, తల్లి శోకాన్ని మాన్పించారు. అంతా సుఖాంతం అయిందని, ఆమె మనసును పూర్తిగా చిక్కబట్టుకునే వ్యవధి ఇవ్వకుండానే..
“చివరి ఐదుగురు రాకుమారులూ, తండ్రి అనుమతి లేకుండానే దక్షిణ దిగ్విజయ యాత్రకు తరలిపోయారు” అని ప్రతీహారి వార్త వినిపించాడు.
(వచ్చేవారం.. నాగర సర్వస్వం)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu |వరించిన అదృష్టం
Kasi Majili Kathalu | వరుణద్వీపంలో దేవకన్యలు
Kasi Majili Kathalu | పాతాళాన్ని గెలిచిన మానవుడు
Kasi Majili Kathalu | సుధన్వుడి రససిద్ధి
Kasi Majili Kathalu | పాతాళ గుహ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా