Kasi Majili Kathalu Episode 72 | జరిగిన కథ : కన్యాకుబ్జపు రాకుమారుడైన వీరవర్మ అతలలోకంలో పడిపోయాడు. రాకుమారి పద్మసేన అతణ్ని కాపాడింది. అన్నను వెతుక్కుంటూ వచ్చిన సుధన్వుణ్ని.. రత్నావతి కాపాడింది. ఆమె ఇచ్చిన గ్రంథం ఆధారంగా సుధన్వుడు హాటక రససిద్ధిని పొందాడు. ఇంతలో సుధన్వుడు తప్పించుకుపోయాడన్న వార్తను మహారాజుకు తెలుపుతూ.. లంబోదరి రాసిన ఉత్తరం.. పద్మసేన చెలికత్తెకు దొరికింది.
“ఇందులో అంత తొందర విషయాలేమీ లేవు. రాజుగారి దగ్గరికి తర్వాత వెళ్లొచ్చు. ముందు యువరాణి గారి దగ్గరికి రా!” అని ఉత్తరంతోపాటు కుంభాసురుణ్ని కూడా వెంట తీసుకుపోయింది ద్విజట.
పద్మసేన ఆ ఉత్తరాన్ని ఆసాంతం చదువుకుంది.
“కుంభా! వాడెవడో శిలాయంత్రం మీద జారిపడ్డవాడు.. నిన్ను కొట్టి పారిపోయినట్లుగా ఇందులో రాసి ఉంది. ఎవడు వాడు? ఎన్నేళ్లుంటాయ్?! పోలికలు చెప్పగలవా?!” అని ప్రశ్నించింది. కుంభాసురుడు వినయంగా..
“తల్లీ! మీ దగ్గర నిజం దాచడం ఎందుకు? ఆనాడు మీరొక మనిషిని కాపాడారు. మరో రెండు రోజులకు మరొక కుర్రవాడు శిలాయంత్రం మీద జారిపడ్డాడు. ఈ రెండోవాడికీ, మొదటివాడికీ దగ్గరి పోలికలు ఉన్నాయి. బహుశా అన్నదమ్ములు కావచ్చు. ఆ రెండోవాణ్ని లంబోదరి స్వయంగా తీసుకెళ్లి నరాంతకుల వారికి అప్పగించింది. ఆయనేమో వాణ్ని బోనులాంటి ఇంటిలో బంధించాడు. కానీ ఆ కుర్రవాడు సంకెళ్లు తెంచుకుని, తలుపులు విరగ్గొట్టి పారిపోయాడు. అందువల్ల నేరం తనమీదికి రాకుండా ఉండటం కోసం మా లంబోదరి కథను ఇలా మార్చి, రాజుగారికి ఉత్తరం రాసి ఉంటుంది. అంతే! ఇందులో మా తప్పేమీ లేదు” అని విన్నవించాడు.
“నీ తప్పేమీ లేకపోవచ్చు. కానీ, ఈ విషయం తెలిస్తే మహారాజు నిన్ను దండించక మానరు. కనుక ఈ ఉత్తరం ఆయనకు చూపవద్దు. నువ్వు ఇంటికి వెళ్లిపో! లంబోదరి అడిగితే ఉత్తరం నేను పుచ్చుకున్నానని చెప్పుకో!” అన్నది యువరాణి పద్మసేన. వాణ్ని పంపించిన తరువాత వీరవర్మ వద్దకు వెళ్లి, జరిగిన విషయమంతా చెప్పింది. ఉత్తరం చూపించింది.
“అయితే ఆ వచ్చినవాడు నా తమ్ముడు సుధన్వుడే కావచ్చు. బహుశా వీళ్లు వాణ్ని చంపి తిని.. ఇలా చెబుతున్నారేమో అనిపిస్తున్నది” అన్నాడు వీరవర్మ దిగులుగా.
“మనోహరా! మీరు చింతించకండి. అసలేం జరిగిందో నేను ఆరాతీస్తాను” అని చెప్పింది పద్మసేన.
ఆ సాయంత్రమే నరాంతకుని మేనకోడలు రత్న సేనను తన మందిరానికి పిలిపించింది.
“రత్నావతీ! ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశావేం!” అని అపేక్షగా పలకరించింది.
“పద్మసేనా! నువ్వు అలా అనకూడదు. నువ్వు రాజపుత్రికవు. మేం సేవకులం. నీ ఆజ్ఞ అయితే నిత్యం వచ్చి సేవించకోకుండా ఉంటామా!” అన్నది రత్నావతి. ఆమె చేయిపుచ్చుకుని..
“సఖీ! మన స్నేహంలో హెచ్చుతగ్గులు లేవు. నువ్వెప్పుడైనా ఇక్కడికి రావచ్చు.. పోవచ్చు” అని స్నేహాన్ని ప్రకటించి.. క్షేమసమాచారాలు అడుగుతున్నట్లుగా..
“మీ నరాంతకుల వారి భార్య గర్భవతి అయినదట కదా! త్వరలో సీమంతం కూడా చేయబోతున్నారని విన్నాను” అని ప్రశ్నించింది పద్మసేన. రత్నావతి చిరునవ్వు నవ్వింది.
“ఇటువంటి సమయంలో ఏవేవో తినాలని కోరికగా ఉంటుంది కాబోలు. మీ మేనత్తకు ఏం కావాలో కనుక్కున్నావా?!” అని పద్మసేనే మళ్లీ అడిగింది. ఆమెకు అన్ని విషయాలూ తెలిసే అడుగుతున్నదని అర్థమైంది రత్నావతికి. ఇక చెప్పక తప్పదు అనుకుని..
“ఆవిడ నరమాంసం తినాలని కోరుకుంది. మావయ్య తెచ్చాడు. కానీ, ఆ మానవుడు బలవంతుడు కావడంతో తలుపులు బద్దలు కొట్టి పారిపోయాడు” అని చెప్పింది.
“నేను నమ్మలేను. సగం చచ్చిన మానవుడు మన లోకంలోని ఇనప తలుపులు బద్దలు కొట్టగలడా?! ఇందులో ఏదో రహస్యం ఉంది. సఖీ! నాతో చెప్పు. ఏం జరిగినా నీ మీదకు రాకుండా నేను చూసుకుంటాను” అని పద్మసేన హామీ ఇచ్చింది. దాంతో.. సుధన్వుడు బందీగా రావడం, అతనితో తాను ప్రేమలో పడటం.. ‘చతుర్దశ భువన సంగ్రహం’ అనే పుస్తకాన్ని తాను సుధన్వుడికి ఇవ్వడం, అతణ్ని చెరసాలనుంచి తప్పించడం మొదలైన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పివేసింది రత్నావతి.
అంతా సావధానంగా ఆలకించిన తరువాత.. “అయితే నువ్వు కూడా నా దారిలోకే వచ్చావన్నమాట. రాక్షసజాతిని కాదని, మానవుణ్ని వరించావు. బాగుంది” అన్నది పద్మసేన నవ్వుతూ. రత్నావతి ప్రశంసాపూర్వకంగా నవ్వి..
“నువ్వు రాజకుమారివి. నువ్వు కావాలనుకుంటే దేవతలు కూడా దిగివస్తారు” అన్నది.
“అదేమీ కాదు. నేనూ నీలాగే ఒక మానవుణ్ని వరించాను. అతనెవరో కాదు.. నువ్వు వరించిన సుధన్వుడికి సాక్షాత్తూ అన్నగారే. కానీ, మా ప్రేమ సఫలమయ్యే మార్గం కనిపించడం లేదు. రేపోమాపో నా స్వయంవరానికి అన్ని లోకాలనుంచి రాక్షస ప్రముఖులు రానున్నారు” బేలగా అన్నది పద్మసేన.
“అయితే ఒక పనిచేయి. ఫలితం ఉండొచ్చు” అంటూ పద్మసేన చెవిలో రహస్యంగా ఏవో మాటలు చెప్పింది రత్నావతి. ఆ మాటలు వింటూనే పద్మసేన ఆనందం పట్టలేక రత్నావతిని కౌగిలించుకుంది.
అనుకున్నట్లుగానే పద్మసేన స్వయంవరానికి రాక్షస ప్రముఖులందరూ విచ్చేశారు. పద్మసేన సముచితమైన అలంకరణలతో ద్విజట తోడురాగా సభాస్థలికి వెళ్లింది. ఆ రాక్షసుల వృత్తాంతాలు తెలుసుకునే నిమిత్తం వారి సింహాసనాల మధ్యనుంచి మెల్లగా నడవసాగింది. సర్వజ్ఞుడనే రాజపరివ్రాజకుడు ఆమె వెంట ఉండి.. స్వయంవరానికి విచ్చేసిన రాజకుమారుల చరిత్రలన్నీ వివరంగా చెప్పసాగాడు. అతను చెప్పేది వింటూ, తలపంకిస్తూ.. ఒక్కొక్క వీరుణ్ని కొద్దిసేపు పరికించి చూస్తూ ముందుకు సాగిపోయింది పద్మసేన.చివరిగా వజ్రకంఠుని ఆసనం వద్దకు వచ్చింది.
“నాన్నగారూ! నా స్వయంవరానికి ఇంతటి మహా వీరులు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వీరి బలపరాక్రమాలు, విద్యా ఐశ్వర్యాలను గురించి వింటుంటే వీరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియకుండా ఉంది. ఒకపని చేద్దాం. వీరిలో ఎవరు లోకైకవీరులో వారినే తేల్చుకోమందాం. మూడురోజుల గడువు లోపల మిగతా వారందరినీ గెలిచిన వీరుణ్నే నేను వరిస్తాను” అని చెప్పి.. తండ్రి సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కణ్నుంచి వెళ్లిపోయింది.
స్వయంవర మంటపం కాస్తా యుద్ధరంగంగా మారిపోయింది. పద్మసేన మీద ప్రీతితో రాక్షసరాజులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. నెత్తురు ఏరులై పారుతున్నది. మహాబల సంపన్నులైన రాక్షసులందరూ చూస్తుండగానే విగతజీవులుగా మారిపోతున్నారు. వజ్రకంఠునికి, అతని సైనికాధికారులకు కూడా ఎవరో ఒకరి పక్షం వహించి.. యుద్ధంలో పాల్గొనక తప్పలేదు.
చివరికి మహారాజుతో సహా ఆ మహాయుద్ధంలో వీరుడనేవాడు ఎవడూ ప్రాణాలతో మిగిలి లేడు. ప్రాణాలతో మిగిలిన వారెవరికీ కాళ్లుచేతులు లేవు. మిగిలిన వాళ్లంతా వృద్ధులు. దాంతో అతల లోకంలో చెప్పుకోదగిన వీరులెవరూ లేకపోయారు. ఆ సమయంలో వీరవర్మ విల్లమ్ములు చేత పట్టుకుని, యుద్ధరంగానికి వెళ్లాడు. అతల రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పట్టభద్రుడై పద్మసేనను చేపట్టాడు. అతలలోకంలో ఉన్న యంత్రాలన్నిటి సమాచారం తెలుసున్నాడు. భూలోకం నుంచి మానవులను పడేసే శిలాయంత్రం వద్ద మెత్తని పరుపులు వేయించి, అందులో పడ్డ మానవులను సురక్షితంగా ఉంచేలా కాపలా కట్టుదిట్టం చేశాడు.
అది జరిగిన కొంతకాలానికి.. హాటకరస సిద్ధిని పొందిన సుధన్వుడు యక్షసైన్యానంతో అతల రాజ్యంపై దండయాత్రకు వచ్చాడు. ఆ రాజ్యాన్ని తన అన్న వీరవర్మే పాలిస్తున్నాడని తెలిసి ఆనందపడ్డాడు. సుధన్వుడికి రత్నసేనతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే సుధన్వుడి విద్య అధోలోకాల మీద ప్రభావం చూపగలదు కానీ, ఊర్ధ్వగమనానికి సాయం చేసేది కాదు. దాంతో తిరిగి భూలోకానికి మార్గం లభించక అన్నదమ్ములిద్దరూ చింతాక్రాంతులయ్యారు.అటువంటి సమయంలో ఒకనాడు..
శిలాయంత్రం మీదనుంచి ఒక మనిషి జారిపడ్డాడు. వాణ్ని కాపలాదారులు వీరవర్మ దగ్గరికి తీసుకువచ్చారు. వీరవర్మ అతణ్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. అతనెవరో కాదు.. చిత్రకూట పర్వతం మీదనుంచి మనుషులను బిలద్వారంలోకి తోసివేసే అలంబసుని శిష్యుడే. వాణ్ని వీరవర్మ గుర్తుపట్టాడు కానీ, వాడు వీరవర్మను గుర్తుపట్టలేదు. సింహాసనంపై ఉన్నది వజ్రకంఠుడే అనుకున్నాడు.
ఆ జాబు చదువుకున్న ప్రతాపరుద్రుడు చాలా సంతోషించాడు. దాని ప్రకారం పెద్ద తోలుసంచులు తయారు చేసి.. బిలద్వారం వెంట కిందికి పంపాడు. అతలలోకంలో ఉన్న విలువైన రత్నమాణిక్యాలను ముందుగా పైకి తరలించారు వీరవర్మ, సుధన్వుడు.ఆ తరువాత తాము కూడా భార్యలతో సహా భూలోకానికి చేరుకున్నారు.
“రాజా! వీరవర్మ సోదరుడు ప్రతాపరుద్రుడట. నన్ను ఏమార్చి, బిలద్వారంలోకి తోసివేశాడు” అని చెప్పాడు.
“సరే నువ్వు వెళ్లు. వాడి సంగతి నేను చూస్తానులే” అని చెప్పి.. వాణ్ని పంపేశాడు వీరవర్మ.
వాడి చర్యలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఉండమని గూఢచారులను నియమించాడు. అది జరిగిన రెండోనాడు శిలాయంత్రంపైకి బిలద్వారం వెంట ఒక ఇనుప గొలుసు జారింది. దాని చివర తోలుసంచి, అందులో ఒక ఉత్తరం ఉంది. ‘అన్నయ్యలూ! నేను ప్రతాపరుద్రుణ్ని. మీరు దండయాత్రనుంచి ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిమ్మల్ని వెతుక్కుంటూ నేను, మన తమ్ముళ్లు రాగవర్ధనుడు, జయమల్లుడు బయల్దేరాం. మీరు చిత్రకూటంపైనే తప్పిపోయారని మన దండనాథుడు ఒకడు చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని బిలంలోకి తోసివేసిన వాణ్ని నేనే ఇందులోకి తోసేశాను. దీనికి అంతటికీ కారణమైన మునివేషధారిని ఎంత హింసించినా వాడు ఎక్కువ వివరాలు చెప్పలేదు. ఒక ఉజ్జాయింపుగా ఇనుప గొలుసును తయారు చేసి బిలంలోకి విడిచిపెడుతున్నాను. ఇది మీదాకా చేరితే.. ఈ లేఖను కనుక మీరు చూస్తే నాకు జవాబు రాయండి. మిమ్మల్ని ఎలా బయటికి తీసుకురావాలో తెలియచేయండి. ఒకరోజు తర్వాత ఈ గొలుసు నేను పైకి లాగిస్తాను’.. అని రాసి ఉంది అందులో. వీరవర్మ, సుధన్వుడు బాగా ఆలోచించిన మీదట.. మరో పెద్ద సంచిలో విలువైన రత్నమాణిక్యాలతో పాటుగా ఒక లేఖను కూడా పంపారు.
‘తమ్ముడూ! మేమిద్దరం బతికే ఉన్నాం. ఇక్కడ మాతోపాటు మీ వదినలు కూడా ఉన్నారు. ఎంతో విలువైన సంపద ఉంది. ముందుగా ఆ సంపదనంతా పైకి తోడుకో. బిలద్వారంలో ఒక్కమనిషికి మాత్రమే చోటు ఉంటుంది. నువ్వు ఒక మనిషి పట్టేంత బలమైన సంచులు సిద్ధం చేసుకో. వాటి ద్వారా ఒకరి తరువాత ఒకరం బయటపడతాం” అని రాసి పంపించారు.
ఆ జాబు చదువుకున్న ప్రతాపరుద్రుడు చాలా సంతోషించాడు. దానిప్రకారం పెద్ద తోలుసంచులు తయారు చేసి.. బిలద్వారం వెంట కిందికి పంపాడు. అతలలోకంలో ఉన్న విలువైన రత్నమాణిక్యాలను ముందుగా పైకి తరలించారు వీరవర్మ, సుధన్వుడు. ఆ తరువాత తాము కూడా భార్యలతో సహా భూలోకానికి చేరుకున్నారు. ప్రతాపరుద్రుడు అన్నావదినలను చూసి చాలా సంతోషించాడు. అందరూ కలిసి కన్యాకుబ్జానికి తిరిగి వెళ్లారు.
వీరవర్మను, సుధన్వుణ్ని వెతుక్కుంటూ ఆనాడు.. ప్రతాపరుద్రునితో పాటుగా వాళ్ల తమ్ముళ్లయిన రాగవర్ధనుడు, జయమల్లుడు కూడా వెళ్లారు. రాగవర్ధనుణ్ని జయపురం యువరాణి రతిమంజరి ఆకట్టుకుంది. ఆమె ప్రేమమత్తు నుంచి బయటపడిన తరువాత రాగవర్ధనుడికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది.
తమ్ముడైన జయమల్లుణ్ని దుందుమారుడు అనేరాజు బంధించాడని తెలుసుకుని, ఆ పట్టణం మీదకు దండెత్తి వెళ్లాడు. కానీ అప్పటికే జయమల్లుడు చెరసాలనుంచి తప్పించుకుని, దుందుమారుడిని బంధించి, తానే ఆ రాజ్యానికి రాజయ్యాడని తెలుసుకుని ఆనందించాడు. రాగవర్ధనుడు, జయమల్లుడు కలిసి మళ్లీ తమ అన్నలను వెతుక్కుంటూ బయల్దేరారు. అప్పటికే వాళ్లు ముగ్గురూ కన్యాకుబ్జాన్ని చేరుకున్నారని తెలిసి ఆనందించారు. తామూ ఇంటిముఖం పట్టారు. కొడుకులందరూ క్షేమంగా తిరిగి రావడంతో తాళధ్వజుడు సంతోషించాడు.
కన్యాకుబ్జానికి తూర్పు భాగంలో వీరవర్మ జయించిన రాజ్యాలన్నిటికీ చక్రవర్తిగా అతణ్నే అభిషేకించాడు తాళధ్వజుడు. అతని తమ్ముళ్లు నలుగుతూ సామంత రాజులై.. పాలన సాగించారు.
(వచ్చేవారం.. మహిళారాజ్యంలో మగధీరుడు)
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ