దండేపల్లి, ఆగస్టు 6 : కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని రైతాంగానికి రాబోయే 48 గంటల్లోగా సాగు నీరందించాలని, లేదంటే హాజీపూర్ నుంచి దండేపల్లి మండలం తాళ్లపేట వరకూ రైతులతో కలిసి పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్రావు స్పష్టం చేశారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలీ భవన్లో స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది వరకు కడెం ప్రాజెక్టు నుంచి యేటా ఆగస్టు 5వ తేదీన గేట్లు ఎత్తి రైతాంగానికి సాగు నీరందించేవారని, 5వ తేదీ దాటినా సాగు నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికైనా కడెం నుంచి సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టుకు వరదలు వచ్చి గూడెం ఎత్తిపోతలు డ్యామేజ్ అయిన సందర్భంలో అప్పట్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు దగ్గరుండి గూడెం ఎత్తిపోతలను మరమ్మతులు చేయించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఆధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు గూడెం ఎత్తిపోతల పథకం వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా తాము ఎప్పుడూ రైతుల పక్షాన పోరాడుతామన్నారు. రైతులు వరినాట్లు వేస్తున్న సమయంలో సాగు నీరు అత్యవసరమున్నది, వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా దండేపల్లి మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్లు తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, చుంచు చిన్నయ్య, మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు పొడేటి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రేని శ్రీనివాస్, షేక్ చాంద్, వెంకటరమణ, ముద్దసాని తిరుపతి, పత్తిపాక శ్రీనివాస్, అల్లంల సంతోష్, ఉస్మాన్ఖాన్, నజీరుద్దీన్, గొట్ల భూమన్న, బొమ్మెన మహేశ్, హరీశ్, అఖిల్, సాయి ఉన్నారు.