న్యూఢిల్లీ : ఇటీవల టీ కల్తీ ఘటనలు పెరుగుతుండటంతో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా (టీబీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. నాణ్యమైన టీని అందించడంతో పాటు కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకోవడం, వినియోగదారులకు టీ కల్తీ మీద అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని టీబీఐ స్పష్టం చేసింది. గతంలో తయారీ కేంద్రాల్లో మాత్రమే కనిపించిన ఈ కల్తీ.. ఇప్పుడు నగరాలు, చిన్న పట్టణాల్లోని హోటళ్లు, చిన్న టీ స్టాళ్లలో కూడా కనిపిస్తున్నన్నది. అందుకే టీ బోర్డు మీడియా ప్రచారంతో పాటు కాలేజీలు, హైస్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అలాగే కల్తీ చేస్తున్న హోటళ్లు, టీ స్టాళ్ల నుంచి నమూనాలు సేకరించి చర్యలు తీసుకుంటున్నది.
ఏప్రిల్, జూన్ నెలల్లో హైదరాబాద్లోని 15 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా 3వేల కిలోల కల్తీ టీ పౌడర్, 1,500 కిలోల గడువు ముగిసిన టీ పౌడర్, 100 కిలోల కల్తీ బెల్లం, కృత్రిమ రంగులు దొరికాయి. ఈ దాడుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఫిబ్రవరిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా అతని వద్ద కల్తీ టీ పౌడర్, బెల్లం నీళ్లు కనిపించాయి. అతను ఇంటి వద్దే కల్తీ టీ పౌడర్ను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్లోని పలు దుకాణాలు, తయారీ కేంద్రాలు, హోటళ్లు, టీ స్టాళ్ల నుంచి నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎస్ఏఐ కి పంపిస్తున్నారు. 2024-25లో 1,307 నమూనాలను పరీక్షలకు పంపించగా 34.28 నమూనాలు కల్తీ అని తేలాయి. 2025-26లో 1,470 నమూనాలను పంపిస్తే అందులో 26.19 కల్తీ అని నిర్ధారణ అయినట్టు అధికారులు చెబుతున్నారు.
ఒకప్పుడు టీ పౌడర్ తయారీ కేంద్రాల్లోనే ఎక్కువగా కల్తీ జరిగేది. ప్రస్తుతం అక్కడ నిఘా పెరుగడంతో నగరాల్లోని టీ పౌడర్ అమ్మే కేంద్రాలు, దుకాణాలు, చిన్న హోటళ్లలో కూడా కల్తీ జరుగుతున్నదని అధికారులు గుర్తించారు. టీ బోర్డు ప్రకారం చెక్క పొడి, బియ్యం పిండితో పాటు కొన్ని రకాల కృత్రిమ రంగులను కలిపి కల్తీ టీ పౌడర్ను ఈ యూనిట్లలో తయారు చేస్తున్నారు. అందుకే టీ పౌడర్ తయారీ కేంద్రాల లోగోలు లేకుండానే అమ్మేస్తున్నారు.