రంగారెడ్డి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్)తో జిల్లాలో భారీగా ఓట్లు తగ్గనున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియకు మరో నాలుగు రోజులే గడువు ఉన్నది. గడువు ముంచుకొస్తున్నా నింపిన ఫారాలు ఇచ్చేందు కు ఓటర్లు ముందుకు రాకపోవడంతో జిల్లాలో ఆరు నుంచి ఎనిమిది లక్షలకు పైగా ఓట్లు తగ్గనున్నాయి. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో 60 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యింది. మిగిలిన వారు గడువులోగా ఫారాలు అందిస్తారని అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో ఉన్న వలస ఓటర్లంతా తమ స్వగ్రామాల్లోనే ఫారాలను అందించడంతో ఈ సెగ్మెంట్లలో భారీగా ఓట్లు తగ్గనున్నట్టు సమాచారం. ఎల్బీనగర్లో 6,82,003 ఓట్లుండగా.. నాలుగు లక్షల ఫారాల డిజిటలైజేషన్ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ సుమారు రెండు లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయి.
అలాగే, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,73,372 ఓట్లు ఉండగా.. ఇక్కడ 60 శాతమే కంప్యూటరీ కరణ కాగా, రెండు లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశమున్నట్టు సమాచారం. మహేశ్వరం నియోజకవర్గంలో 5,74,637 ఓట్లుండగా.. ఇక్కడ కూడా 65 నుంచి 70శాతమే ఆన్లైన్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సెగ్మెంట్లోనూ 30 వేల నుంచి లక్ష ఓట్ల వరకు కోల్పోయే అవకాశాలున్నాయి. ఇబ్రహీంపట్నంలో 3,44,584 ఓట్లుండగా.. ఇక్కడ కూడా 75 నుంచి 80 శాతం మాత్రమే డిజిటలైజేషన్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సెగ్మెంట్లోనూ 70నుంచి 80 వేల ఓట్లు కోల్పోయే అవకాశాలున్నాయి. రాజేంద్రనగర్లో 6,35,283 ఓట్లుండగా.. ఇక్కడ 60-65శాతమే డిజిటలైజేషన్ పూర్తికాగా.. ఈ సెగ్మెంట్లోనూ సుమారు లక్ష నుంచి లక్షా యాభైవేల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయి.
జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.ఆయా నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్చార్జీలను నియమించి పలుమార్లు బీఎల్వోలతోపాటు పొలిటికల్ పార్టీలతోనూ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సర్ ప్రక్రియలో వెనుకబడిన నియోజకవర్గాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పలుమార్లు పర్యటించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అయినప్పటికీ శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఎక్కువగా బోగస్ ఓట్లు ఉండటంతో వారి అడ్రస్లు కనిపెట్టడం బీఎల్వోలకు కష్టంగా మారింది. గతంలో ఓటు హక్కు కలిగి ఉన్న చిరునామాల్లో ప్రస్తుతం ఓటర్లు లేకపోవటంతో వారికోసం బీఎల్వోలు, బీఎల్ఏలు ఆరా తీస్తూ గాలిస్తున్నారు. గడువు మరో నాలుగు రోజులే ఉండటంతో డిజిటలైజేషన్ వందశాతం పూర్తికి అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని షాద్నగర్, కల్వకుర్తి, చేవెళ్ల వంటి నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది.