ED summons : కేరళ మాజీ ముఖ్యమంత్రి (Kerala Ex CM) పినరయి విజయన్ (Pinarai Vijayan) కుమార్తె వీణ (Veena) కు ఈడీ సమన్లు జారీచేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కొచ్చి కార్యాలయం ముందు హాజరవ్వాలని ఈడీ ఆదేశించింది. వీణతోపాటు CMRLకు సంబంధించిన మరో తొమ్మిది మందికి సమన్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈడీతో కీలక పత్రాలను పంచుకోవడానికి నిరాకరిస్తూ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ను కార్పొరేట్ నేరాలను విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలు డాక్యుమెంటరీ, డిజిటల్, ఆర్థిక ఆధారాలను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు వీణపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ దర్యాప్తు చేపట్టింది. ఆమె నేతృత్వంలోని ఎక్సాలాజిక్ సొల్యూషన్స్కు కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్స్ రూ.2.78 కోట్లు చెల్లించడంపై అనుమానాలు లేవనెత్తింది.
సాఫ్ట్వేర్, స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లను తయారుచేసే ఎక్సాలాజిక్ ఎటువంటి సర్వీసు లేకుండానే లిస్టెడ్ కంపెనీ అయిన సీఎంఆర్ఎల్కు చెల్లింపులు చేయడాన్ని ప్రశ్నించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ సంస్థ గతంలో వీణ, ఆమె సంస్థ ఎక్స్లాజిక్ సొల్యూషన్స్కు రూ.2.73 కోట్లు చెల్లించింది. అయితే దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదు. 2023 ఆగస్టులో ఆ అంశం వెలుగులోకి రావడంతో రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ.. అవి మోసపూరితంగా ఉన్నాయని ఎస్ఎఫ్ఐఓ తన అభియోగాల్లో పేర్కొన్నది.
2017 నుంచి 2020 మధ్యలో సీఎంఆర్ఎల్ నుంచి రూ.1.72 కోట్లు పొందినట్లు ఆ ఆరోపణల సారాంశం. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఎస్ఎఫ్ఐఓకు కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ కేసు విషయంలో వీణపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.