వాషింగ్టన్ : కొత్త హెచ్-1బీ వీసాలపై విధించే లక్ష డాలర్ల రుసుము అమెరికా కంపెనీలను తమ ప్రాజెక్టు పనులను విదేశాలకు తరలించేలా ఒత్తిడి చేయవచ్చని, ఇది నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించడంలో, ప్రపంచవ్యాప్తంగా పోటీపడడంలో దేశ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి హెచ్చరించారు.
మీరు ప్రతిభను దేశంలోనే సమకూర్చుకోవచ్చు లేదా ప్రాజెక్టు పనులను విదేశాలకు తరలించవచ్చు అని స్పిల్ ది టీ ఇంటర్వ్యూలో కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కంపెనీలు కేవలం చేతులు కట్టుకుని కూర్చుని ఆ పనులను చేయకుండా ఉండబోవని ఆయన అన్నారు. చట్టబద్ధమైన వలసలకు ఉన్న అడ్డంకుల(ఒక లక్ష డాలర్ల రుసుము సహా) గురించి జరిగిన చర్చలో కృష్ణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడం పైనే మన పోటీ తత్వం ఆధారపడి ఉంటుందన్నారు.