Kasi Majili Kathalu Episode 80 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కన్యాకుబ్జ రాకుమారులు ఐదుగురు పశ్చిమ దిగ్విజయ యాత్ర చేస్తున్నారు. వారిలో పెద్దవాడికి మహారాష్ట్ర రాకుమారితో పెళ్లయింది. మిగిలిన నలుగురూ వరుణద్వీపానికి దండెత్తి వెళ్తుండగా.. సముద్రంలో ఓడలు మునిగిపోయాయి. విక్రముడు ముందుగా బయటపడి, ఒక ద్వీపంలోని గాయత్రీ మందిరానికి చేరుకున్నాడు. అక్కడ దేవతాకన్యలు చెప్పుకొంటున్న మాటలు వింటున్నాడు.
“ఆ్యకా! అసలేం జరిగిందో సరిగా చెప్పు” అడిగాడు నారదుడు.
అదిమి పెట్టడానికి వీల్లేకుండా పొంగి వస్తున్న దుఃఖాన్ని అతిప్రయత్నం మీద ఆపుకొంటూ.. ఆర్యకుడు తన బాధను ఇలా చెప్పసాగాడు..
“స్వామీ! మా నాగజాతిని పుట్టుకతోనే గరుడునికి ఆహారంగా విధించాడు కదా పరమాత్మ!! ఆ గరుడునికి, మాకు దాయాది పగ ఎప్పటికీ చల్లారిపోయేది కాదు. ఒకసారి అతడి ఆకలికి మా జాతి అంతరించిపోయే స్థితికి వచ్చింది. దొరికిన నాగులనందర్నీ దయావిహీనుడై భక్షించేవాడు గరుడుడు. బంధుత్వాన్ని పాటించకుండా మాకు నిత్యం ప్రాణసంకటం తెచ్చిపెట్టేవాడు. శేషుడు, వాసుకి వంటి ప్రముఖుల వంశాల జోలికి పోకుండా.. సామాన్య కుటుంబాలనే నాశనం చేసేవాడు. ఆయన ఆకలికి మూషికాద, దధిముఖ, వసంతక మొదలైన నాగ కుటుంబాలు నశించిపోయాయి. ఇంకా అలాగే వదిలేస్తే క్రమంగా నాగకులమే అంతరించిపోతుందనే భయంతో మేమంతా.. మా పెద్దలను సంప్రదించాం. వాసుకి, ఆయన మనుమడైన అశ్వతరుడు, తక్షకుడు, కర్కోటకుడు వంటి పెద్దలంతా కలిసి గరుడుని సంధికి ఒప్పించారు. దానిప్రకారం నెలకొక కుటుంబం నుంచి స్వచ్ఛందంగా, శ్రేష్ఠమైన ఆహారం సమర్పిస్తామని.. అందుకు బదులుగా మాకు సంఘ మరణాలను తప్పించాలని ఒడంబడిక చేసుకున్నాం. కిందటినెలలో మా కుటుంబం వంతు వచ్చింది. నా కుమారుడైన చికురుణ్ని, గరుడుడు మా కళ్లముందే భక్షించాడు. అంతటితో విడిచిపెట్టకుండా, తండ్రి మరణాన్ని చూసి దుఃఖిస్తున్న నా మనుమడైన సుముఖుణ్ని చూసి.. ‘వచ్చేనెలలో వీణ్ని భక్ష్యంగా ఏర్పాటుచేయండి’ అని ఆజ్ఞాపించి పోయాడు. న్యాయంగా అయితే ఏడాది తరువాత ఒక కుటుంబానికి వంతు రావాలి. మనమణ్ని కూడా పోగొట్టుకుంటే నా వంశమే పోతుంది. ఈ అన్యాయాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు?!”.. అంటూ దుఃఖాన్ని తట్టుకోలేక ఏడవసాగాడు.
నారదుడు అతణ్ని ఊరడించి..
“ఆర్యకా! ఊరడిల్లు. నీకొచ్చిన ఆపద ఏమీ లేదు. సాక్షాత్తూ మహేంద్రుని మంత్రితోనే వియ్యమందబోతున్నావు. మీవాణ్ని రక్షించే భారం ఆయనపైనే ఉంచుదాం. ముందు మీ కుటుంబమంతా పెళ్లికి తరలిరండి” అని పలికాడు.
వాళ్లు స్వర్గానికి వెళ్లిన కొద్దిరోజులకే గరుత్మంతుడు యథావిధిగా తన ఆహారం కోసం వచ్చేశాడు. జరిగిన సంగతి తెలుసుకుని, హుటాహుటిన స్వర్గానికి ఎగిరాడు. అప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. దేవేంద్రుని సభాభవనం అయిన సుధర్మలో పెళ్లితంతు నిర్వహిస్తున్నారు. ఇంతలో గరుత్మంతుడు వస్తున్నాడన్న వార్త తెలియగానే పీటలమీదనున్న పెళ్లికొడుకుతో సహా నాగులందరూ స్తంభాల మాటున, ఆసనాల చాటున కనిపించకుండా దాక్కున్నారు.
గరుత్మంతుడు వస్తూనే ఆవేశంగా.. “మహేంద్రా! నీకిది తగునా? నా ఆహారాన్ని కొల్లగొట్టి, నాకు అన్యాయం చేస్తావా?” అని ప్రశ్నించాడు.
అందుకు మహేంద్రుడు.. “పక్షిరాజా! నేను అన్ని సంగతులూ విచారించాను. వంతు రాకుండానే సుముఖుణ్ని కోరడం అక్రమం కాదా?! అతడికి బదులుగా నువ్వు కోరిన బలమైన నాగులను నీకు ఆహారంగా సమర్పిస్తాను. ఇంకేం కావాలన్నా ఇస్తాను. అతణ్ని విడిచిపెట్టు” అని పలికాడు.
“వీల్లేదు” అని హుంకరించాడు గరుత్మంతుడు.
“వీణ్ని భక్షించి తీరతానని నాగసభా మధ్యంలో శపథం చేసి వచ్చాను. ఇప్పుడు విడిచిపెడితే ఇక నాగులెవరూ నన్ను లెక్క చేయరు. కనుక నీ పట్టు విడిచి.. వాణ్ని ఇలా పంపించు” అన్నాడు.
“సుపర్ణా! మా దేవతలందరి అభిప్రాయం ఒక్కటే. నువ్వు సుముఖుణ్ని విడిచిపెట్టాలి. మేమే కాదు.. నువ్వు సేవించే విష్ణుదేవుని మాట కూడా ఇదే” అని అక్కడే ఆసీనుడై ఉన్న స్వామివారిని చూపించాడు మహేంద్రుడు.
గరుత్మంతుడు వెనక్కి తగ్గలేదు.
“మహేంద్రా! నేను కాకుండా ఉపేంద్రుణ్ని మోయగలిగిన వాడెవ్వడు?! ఆయన ధ్వజంపై నిలిచి.. ఆయనకు జయాలు చేకూర్చేవాణ్ని నేనే కదా! అంతటి ఆప్తుడనైన నా నోటిదగ్గర కూడును నా స్వామి చూస్తూ దూరం చేస్తాడా?!” అని గర్వం ప్రదర్శించాడు.
మహేంద్రుడు నిరుత్తరుడయ్యాడు. అప్పుడు విష్ణుదేవుడు కలగచేసుకుని.. “గరుడా! నువ్వు పలికిన మాటలన్నీ నాకు సంతోషాన్ని కలగచేశాయి. కానీ.. మహేంద్రుడంటే మూడులోకాలకూ అధికారి కదా! ఆయన మాటను పాటించకపోవడం ఉచితమేనా?! బుద్ధిమంతులు చేసే పనేనా?! సరే.. నన్ను మోసేవాడివి నువ్వేనని చెప్పుకొన్నావు కదా! ఏదీ నా చిటికెనవేలి బరువు మోయి చూద్దాం!” అంటూ ఎడమచేతి వేలిని అతని వక్షస్థలంపై పెట్టాడు.
పిచ్చుకపై బండరాయి పడ్డట్లుగా గరుడుడు గిలగిలలాడిపోయాడు. బలం చాలక రెక్కలు రాలిపోతుండగా, కీచుకీచుమని అరుస్తూ.. “మహాత్మా! అపరాధం చేశాను. మన్నించు” అని కన్నీరు కారుస్తూ శరణు వేడుకున్నాడు.
స్వామి కృపతో విడిచిపెట్టగా, పాపం అక్కణ్నుంచి నిష్క్రమించాడు.
అటుపైన సుముఖునికి, మాతలి కూతురైన గుణకేశితో అంగరంగవైభవంగా వివాహం జరిగింది. ఆ జంట చాలాకాలంపాటు సుఖంగా గడిపింది..
ఈ కథగల పుస్తకం మా ఇంట్లో ఉంటే చదివాను. దీనినిబట్టి, నాగకుమారులలో కూడా లోకాతీత సౌందర్యం కలవారు ఉంటారని అర్థం కావడం లేదా?! అందుకే మనకు ఎటువంటి పతులు కావాలన్నప్పుడు, నాగుల ప్రస్తావన తీసుకువచ్చాను..
* * *
..అంటూ మధుమతి చెప్పడం పూర్తిచేసింది.
త్వరలో అరుణోదయం కాబోతున్నదనే సూచనగా ఆకాశంలో వేగుచుక్క పొడిచింది.
“మనం ఇళ్లకు బయల్దేరే వేళయింది. మళ్లీ శుక్రవారం నాటికి ఇక్కడికి వచ్చి.. వ్రతాన్ని పరిసమాప్తి చేసుకుందాం. మనకు ఎటువంటి పతులు కావాలో అమ్మవారికి నివేదించుకున్నాం కదా! ఇక వారు ఏ జాతివారైనా.. అమ్మవారు మనకు ఉత్తములనే సమకూర్చుతుందని ఆశిద్దాం. మళ్లీ వచ్చినప్పుడు మనకు కాబోయే భర్తలకు అందించదగిన వస్ర్తాలను, పూలమాలలు, లేపనాది వస్తువిశేషాలను ఇప్పుడే ఇక్కడ దాచిపెడదాం” అన్నది వారుణి.
మిగిలిన వారందరూ సరేనంటూ దేవళంలోని ఒక గూటిలో ఆ దివ్యవస్తువులను నిక్షిప్తం చేసి.. మరొక్కసారి అమ్మవారికి మొక్కి, ఆకాశంలోకి ఎగిరిపోయారు.
అప్పటివరకు వారి మాటలను జాగ్రత్తగా ఆలకించిన విక్రముడు, ఆ గూడులోని వస్తువులను పరీక్షించాడు. నలుగురూ నాలుగు వేర్వేరు రంగులలోని వస్ర్తాలను అక్కడ ఉంచడం.. శుభసూచనగా తోచింది. అతనిలో ఏదో కొత్తసంకల్పం కలిగింది. తటాకంలో స్నానం చేసి, అమ్మను పూజించాడు.
మంటపంలోని ద్వారపాలిక శిల్పం చేతిలోని ఖడ్గాన్ని తీసుకుని, సముద్రం దిశగా ప్రయాణమయ్యాడు. దారిలో అంతకుముందు తనను బాధించిన ముళ్లచెట్లను ఆ ఖడ్గం సాయంతో ఖండిస్తూ ముందుకు సాగాడు. దాంతో తీరంనుంచి అమ్మవారి గుడికి చక్కటి దారి ఏర్పడింది. సాయంకాలం వరకు సముద్రతీరంలోనే గడిపాడు. ముక్కలైన ఓడశకలాలు అక్కడక్కడా కనిపించాయి. అతడికి కొంత ఆశకలిగింది. వారధి బంధనానికి ముందు దక్షిణసముద్ర తీరంలో దర్భలపై శయనించిన శ్రీరాముడిలా ఆ రాత్రంతా అక్కడే గాయత్రీ ధ్యానంలో గడిపాడు.
తెల్లవారింది. గాయత్రీ మందిర తటాకంలోని నీరు తాగడం వల్ల అతనికి ఆకలి దప్పికలు లేవు. ఆ రోజంతా ఉత్తరదిక్కుగా సముద్రం వెంట సంచరించాడు. అది ‘పోటు’ సమయం కావడంతో సముద్రం కొంత లోపలికి పోయింది. బయటికి తేలిన జలచరాలు అతని రాకచూసి తటాలున బొరియల్లోకి దూరిపోసాగాయి. ముత్తెపు చిప్పలు, నత్తగుల్లలు పోగులుగా పడి ఉండి, కాళ్లకు గుచ్చుకుంటున్నాయి. వాటిని లెక్కచేయకుండా నడక సాగించాడు.
కొంతదూరంలో పెద్ద దారువొకటి ఒడ్డుకు చేరినట్లుగా కనిపించింది. పరిశీలించి చూడగా సముద్రపు ఓడ తెరచాప కొయ్యలాగా తోచింది. గోడనంటిన బల్లుల్లా దానిమీద ముగ్గురు పురుషులు బోర్లగిలపడి కనిపించారు. విక్రముడు వారిని గుర్తించాడు.
“హా సోదరులారా!” అని అరుస్తూ వారి వద్దకు వెళ్లాడు.
వాళ్లింకా ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించి సంతోషించాడు. గబగబా గట్టుమీదికి వచ్చి ఒక చెలిమెను తవ్వాడు. దానిలోని నీటితో వారి దేహాలపై ఉప్పుకసవు పోయేలాగా కడిగాడు. ముఖాలపై నీళ్లు జల్లి, జిడ్డుపోయేలాగా తుడిచాడు. పేరుపేరునా తమ్ముళ్లను పిలవసాగాడు. ఒక దొప్పలో నీరు తీసుకొచ్చి వాళ్లకు పట్టించాడు. కొంతసేపటికి వారికి తెలివి వచ్చింది. ఒడ్డుపై దొరికిన వెలగపళ్లు తీసుకొచ్చి, గుజ్జును తమ్ముళ్ల నోటిలో పిండాడు. ఆహారం దొరకగానే వారికి కొంచెం సత్తువ వచ్చింది.
“సోదరులారా! మీకు తగిన పానీయం తీసుకువస్తాను. ఒక్క నాలుగు గడియలలో తిరిగి వస్తాను. అప్పటివరకు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి” అని పలికి.. పరుగు పరుగున గాయత్రీ ఆలయానికి వెళ్లాడు. గర్భాలయంలో ఉన్న అభిషేకపాత్రను తీసుకుని, దానినిండా తటాకపు నీరు పట్టాడు. ఆలయంలోని మధుర ఫలాలు కోసుకుని, తమ్ముళ్ల వద్దకు హుటాహుటిన వెళ్లాడు.
అప్పటికే వారు ఒకరినొకరు పలకరించుకున్నారు. విక్రముడు ముందుగా వారికి ఫలరసాలు పట్టించిన తరువాత, తటాక జలాన్ని తాగించాడు. అమృతపానం చేసినట్లుగా వారికి శరీరంలో మిక్కిలిగా బలం కలిగింది.
అప్పుడు విజయుడు.. “అన్నా! నువ్వు క్షేమంగా ఉన్నావా?! మేమెలా గట్టు చేరామో తెలియదు. ఓడతోపాటే నేనూ సముద్రంలో పడిపోయాను. చేతికేమీ ఆధారం దొరకలేదు. చాలాదూరం ఈదుకుంటూ వెళ్లాను. ఆయాసం కలిగింది. ప్రాణాలమీద ఆశలు వదులుకున్నాను. అటువంటి సమయంలో భగవంతుని సంకల్పంలా నా పక్కనే ఒక పెద్దదారువు కొట్టుకు వస్తూ కనిపించింది. ఎలాగో దానిపైకి చేరుకున్నాను. తమ్ముళ్లిద్దరూ దానిమీద ఉన్నారని నాకు తెలియదు. రెండుదినాలు దానిమీదే గడిపాను. ఆ రెండురోజులూ చెరుపు మరుపులే కానీ, ఏమీ జ్ఞాపకం లేదు. తరువాత స్మృతి తప్పింది. ఇక్కడికెలా వచ్చిపడ్డామో తెలియదు” అని తమ కథ చెప్పాడు.
చిత్రభానుడు అందుకుని.. “సోదరులారా! ఇప్పుడు మనమేం చేయగలం? ఇది ఏ దీవో తెలియదు. ఇక్కడ మనుష్య సంచారమే కనిపించడం లేదు” అన్నాడు.
చివరివాడైన నలుడు.. “ఇది వరుణద్వీపం కాదు కాబోలు. మన ఓడలన్నీ మునిగిపోయాయి. మన వార్త అన్నగారైన శ్రీముఖునికి తెలియచేసే అవకాశం లేదు. ఇంక మనం క్రోధనుణ్ని జయించడం మాట దేవుడెరుగు?! ఈ సముద్రం దాటి ఇంటికి తిరిగి పోగలమా?!” అని నిరాశ వ్యక్తం చేశాడు.
అప్పుడు విక్రముడు.. “సోదరులారా! పిరికితనం మానండి. వేదమాత సంకల్పం వల్లే మనం ఈ దీవికి కొట్టుకువచ్చాం. త్వరలో మనల్ని గొప్ప అదృష్టం వరించబోతున్నది. నా మాట నమ్మండి” అంటూ తాను ఆ దీవికి వచ్చింది మొదలు.. గాయత్రీదేవి ఆలయాన్ని కనుగొనడం, అక్కడికి దేవకన్యలు రావడం, వారు చేపట్టిన వ్రతం వరకు గల వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు.
తరువాత నలుగురూ ఆలయానికి వెళ్లారు. ముందు తటాకంలో స్నానం చేసి, వేదమాతను పూజించారు. అటుపైన విక్రముడు తన సోదరులకు దేవకాంతలు గూటిలో ఉంచిన దివ్యవస్ర్తాలను చూపించాడు.
“సోదరులారా! మరో మూడురోజులలో శుక్రవారం రానున్నది. మనం ఈ వస్ర్తాలను ధరించి, అప్పటివరకు గాయత్రీ మంత్రాన్ని ఉపాసిద్దాం” అని ప్రబోధించాడు విక్రముడు.
వారు ఆ విధంగానే చేయసాగారు. శుక్రవారం రానేవచ్చింది. సూర్యోదయం అయ్యింది మొదలు ఆ నలుగురి హృదయాలూ దేవకన్యా దర్శనం కోసం ఉర్రూతలూగసాగాయి. ఎంతకూ పొద్దుగూకేలా అనిపించలేదు. అస్తమానం ఆకాశంకేసి చూడసాగారు. ఎట్టకేలకు నింగిలో చందమామ నక్షత్రాల నడుమ పూలగుత్తిలా దర్శనమిచ్చాడు.
దేవకన్యలు కూడా తమకు కాబోయే వరులను కలుసుకోవాలనే ఆశతో ఆవేళ త్వరగానే వచ్చారు. రాకుమారులు ప్రచ్ఛన్నంగా ఉండటం వల్ల, ఏ అనుమానం లేకుండా అమ్మవారి పూజ పూర్తిచేశారు. అటుపైన గూటిలో తాము ఉంచిన వస్ర్తాలు, పూలదండలు కనిపించకపోవడంతో ఆనందపరవశంతో చుట్టూ చూడసాగారు.
అంతలో నాలుగు వేర్వేరు రంగుల వస్ర్తాలను ధరించి నలుగురు రాకుమారులు వారి కళ్ల ముందు సాక్షాత్కరించారు.
(వచ్చేవారం.. కపట యతులు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | వరుణద్వీపంలో దేవకన్యలు
Kasi Majili Kathalu | పాతాళాన్ని గెలిచిన మానవుడు
Kasi Majili Kathalu | సుధన్వుడి రససిద్ధి
Kasi Majili Kathalu | పాతాళ గుహ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా