Kasi Majili Kathalu Episode 70 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : ఆబాలగోపాలాన్నీ అలరించిన కాశీమజిలీ కథలను.. 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించారు. మణిసిద్ధుడనే యతి కాలినడకన కాశీయాత్ర చేస్తూ.. తన వద్దనున్న మణి సహాయంతో, దారిమధ్యలో అనేక దేశాల విశేషాలు తెలుసుకుని.. గోపాలకుడితో చెప్పిన కథలే ఈ కాశీమజిలీలు. 12 సంపుటాలుగా వచ్చిన ఈ కథల్లో.. ప్రస్తుతం మీరు చదవబోతున్నది 10వ భాగంలోని కథ.
కన్యాకుబ్జాన్ని తాళధ్వజుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి అనేకమంది కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడి పేరు వీరవర్మ. రెండోవాడు సుధన్వుడు. పదహారేళ్ల వయసువాడైన వీరవర్మ.. ఒకనాడు తమ్ముడితో కలిసి తండ్రిని చూడటానికి వచ్చాడు.
“తండ్రీ! నేనిప్పుడు ధనుర్వేదమంతా చదివాను. దాని ఫలం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి దిగ్విజయ యాత్ర చేయాలని అభిలాష కలిగింది. అందుకు మీ అనుమతి కోరుతున్నాను” అని అడిగాడు.
కుమారుని కోరిక విని, వారి తల్లి తల్లడిల్లింది.
“కుమారా! యువరాజుగా పట్టభద్రుడివై ఇంటి వద్దనే సుఖంగా ఉండకుండా.. ఇలా అందరితోనూ కయ్యానికి కాలుదువ్వడం ఎందుకు? దిగ్విజయ యాత్ర అంటే మాటలా!? మహాశూరులతో పోరు చేయాల్సి వస్తుంది. శత్రువులకు జాలి ఉండదు. అయినా జయాపజయాలు దైవాయత్తాలు! బాబూ! యుద్ధానికి పోవద్దు” అని నచ్చజెప్పబోయింది. కానీ, తాళధ్వజుడు కానీ, వీరవర్మ కానీ ఆమె మాటలను అంగీకరించలేదు.
“రేపటి రోజున రాజు కాదగినవాడు ముందుగానే తన వీరపరాక్రమాలను లోకానికి తేటతెల్లం చేయడం అవసరం. దిగ్విజయ యాత్ర తప్పకుండా చేయాల్సిందే! నీకు ఆరునెలలు సమయం ఇస్తున్నాను. నీతో కూడా నీ పెద్ద తమ్ముడైన సుధన్వుడిని తీసుకుని వెళ్లు. చతురంగ బలాలతో తరలి వెళ్లండి. తూర్పుదిక్కున నీ కీర్తిపతాకను ఎగురవేసి రా.. జయోస్తు!” అన్నాడు రాజు.
వీరవర్మ, సుధన్వుడు తల్లిదండ్రులకు నమస్కరించి బయల్దేరారు. తూర్పుదిక్కున ఉన్న అంగ వంగ కళింగ రాజ్యాలలో చొరబడి.. ఆయా పాలకులను శరణాగతులను చేసుకున్నారు. తమ సార్వభౌమత్వాన్ని వారిచేత అంగీకరింప చేశారు. తండ్రి విధించిన గడువు సమీపిస్తుండటంతో ఇద్దరూ ఇంటిముఖం పట్టారు.
సేనలతో కలిసి వస్తూ ఒక అరణ్యం మధ్యలో విడిది చేశారు. అది ఒక రుషిగారి తపోవనం. ఆ సంగతి తెలియని సేనావాహిని.. అది మామూలు అరణ్యమే అనుకుని, చెట్లకొమ్మలను విరిచేస్తూ.. పూలు – పళ్లను రాల్చేస్తూ.. అంతా చిందరవందర చేసేశారు.
అంతలో అక్కడికి ఒక మునికుమారుడు వచ్చి, వారిపై ఆగ్రహావేశాలు ప్రదర్శించ సాగాడు.
వీరవర్మ అతనికి నమస్కారం చేసి.. “స్వామీ! ఇది మీ తపోవనమని తెలియక ఇక్కడ విడిది చేశాం. మీరు శాపానుగ్రహ సమర్థులు. మమ్మల్ని క్షమించండి” అని వేడుకున్నాడు.
అప్పుడు శాంతించిన మునికుమారుడు.. “మా గురువుగారు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు. మీరు ఆ మహాత్ముని వద్దకు వచ్చి, తప్పు ఒప్పుకొని వెళ్లండి. లేకపోతే ముప్పు రాగలదు” అన్నాడు.
ఆ మాటలకు అంగీకరించిన వీరవర్మ.. వినీత వేషాన్ని ధరించి ఒంటరిగా, గురువు వద్దకు వెళ్లాడు. రుద్రాక్షమాలలు ధరించి, భస్మ లేపనుడైన ముని పాదాలకు సాష్టాంగం చేసి.. “మహాత్మా! నేను తాళధ్వజుని కుమారుణ్ని. నా పేరు వీరవర్మ. మా సేన తెలియక మీ తపోవనాన్ని చిందరవందర చేసింది. మీరు ప్రసన్నులై, మా తప్పు మన్నించాలని కోరుతున్నాను” అన్నాడు.
“నువ్వు తాళధ్వజుని కుమారునివా?! మీరెవరో తెలియక మా శిష్యుడు మిమ్మల్ని అదిలించినట్లు ఉన్నాడు. పోనివ్వు. ఇదీ మంచిదే! ఈపూట మా ఆతిథ్యం స్వీకరించి, రేపు వెళ్లవచ్చు” అన్నాడు ఆ ముని. దాంతో వీరవర్మ మనసు తేలికపడింది.
“రాకుమారా! అదే నా తపోవన శైలం. ఎన్నెన్నో అద్భుతాలకు నిలయం. ఆ కొండమీదనున్న గుహలో నిలిచి చూస్తే ఇంద్రాది దిక్పాలకుల నగరాలు కనిపిస్తాయి. ఇంకా ఆ కొండపైన అనేక వినోదాలు ఉన్నాయి. నా శిష్యుడు నీకవన్నీ చూపిస్తాడు. వెళ్లి చూసి రా.. ఈలోగా భోజనాదికాలు సిద్ధం చేయిస్తాను” అని చెప్పాడు ముని.
వీరవర్మకు మనసులో ఇష్టం లేకపోయినా, కాదంటే మునిగారికి ఎక్కడ కోపం వస్తుందో అని ఒప్పుకొన్నాడు. తన తమ్ముణ్ని, సేనలను అక్కడే విడిది చేయమని చెప్పి.. శిష్యుడితో కలిసి కొండపైకి మెట్ల మార్గంలో వెళ్లాడు. శిష్యుడు ఆ పర్వతం మీద అనేక వింతచెట్లను, పూలను చూపిస్తూ ఒక గుహ వద్దకు తీసుకువెళ్లాడు. దానిముందు ఒక గోపురం ఉంది. పెద్దపెద్ద కవాటాలు మూసి ఉన్నాయి.
“ఏమిటిది స్వామీ! ఏదైనా సౌధద్వారమా.. గుహాముఖమా? దీనిలో ఎవరైనా ఉన్నారా?” అని అడిగాడు వీరవర్మ.
అందుకు మునికుమారుడు.. “మా గురువుగారు చెప్పిన గుహ ఇదే! దీనిలోకి వెళ్తే దిక్పాలకుల నగరాలు కనిపిస్తాయి. రాకుమారా! ఈ తలుపులు బలశాలులు కానీ తీయలేరు. కొంచెం సాయంపట్టు” అన్నాడు.
వీరవర్మ అతణ్ని తప్పుకోమని చెప్పి, ఒక్కతోపుతో తలుపులు తెరిచాడు. లోపల విశాలంగా ఉంది. గోడలు చిత్ర విచిత్రమైన ప్రతిమలతో నింపి ఉన్నాయి.
“స్వామీ! ఈ బొమ్మలే దిక్పాలకులా?!” అని ప్రశ్నించాడు వీరవర్మ.
“కాదు రాజపుత్రా! అదుగో.. ఆ బల్లమీద నిలబడి చూస్తే ఆ విశేషాలన్నీ కనిపిస్తాయి. దానినెక్కి చూడు” అని చెప్పాడు మునికుమారుడు.
వీరవర్మ ఒక్క ఉదుటున బల్లపైకి ఎక్కాడు. అంతలో పక్కనే అమర్చిన మీట ఒకటి గుబేలుమని సడలింది.
ఆ బల్ల భూగర్భంలోకి జారిపోసాగింది. అదో పెద్ద సొరంగం. గుండ్రంగా, నునుపుగా.. పట్టుకోవడానికి ఏ ఆధారం లేకుండా ఉంది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి.
అంతూదరీ ఏమీ లేని అగాధంలో పడిపోతున్నాడతను. గట్టిగా అరిచినా ప్రయోజనం ఏమీ కనిపించలేదు. తల తిరుగుతున్నది. ఏమీ ఆలోచించ లేకపోతున్నాడు. కొంతసేపటికి స్పృహతప్పింది.
ఆ బల్ల అలా ఎంతసేపు అగాధంలోకి జారిపోయిందో తెలియదు. చివరికి అతడున్న రాతిబల్ల రెండుగా విడిపోయింది. వీరవర్మ ఒక ఇసుక పరుపుమీద పడ్డాడు. అక్కడొక రాక్షసుడు ఉన్నాడు. ప్రాణం కడబట్టి ఉన్న వీరవర్మ నెత్తిమీద ఒక గదతో మోదబోయాడు. అంతలో లంబోదరి అనే రాక్షసి వచ్చింది.
“ఆగు.. ఆగరా కుంభా! ఆ మానవుణ్ని చంపవద్దు” అని వారించింది.
“దేవీ! ఈ కళేబరంలో ఇంకా ప్రాణం ఉంది. వీణ్ని పూర్తిగా చంపి రాజుగారి వంటశాలకు తీసుకుపోవాలి కదా!” అని ప్రశ్నించాడు కుంభుడు.
దానికి లంబోదరి.. “కుంభా! మన సేనాని నరాంతకుల వారి ఇల్లాలిప్పుడు చూలాలిగా ఉన్నది. ఆమెకు పాపం తాజా నరమాంసం తినాలని కోరికగా ఉందట. ఎల్లుండే ఆవిడగారి సీమంతం. ఆనాటికి ఎలాగైనా తాజా మాంసం సంపాదించమని నరాంతకుల వారు నన్ను ఆదేశించారు. వీణ్ని అక్కడికి పంపిద్దాం. కానీ, ఇప్పుడే చంపితే ఎల్లుండికి శవం కుళ్లిపోతుంది. అందువల్ల వీణ్ని ఇలాగే తీసుకుపోయి వారికి అప్పగించు. నీకు మంచి బహుమానం దొరుకుతుంది. రాజుగారు కనుక అడిగితే, ఇవాళ ఏ కళేబరమూ శిలాయంత్రం నుంచి పడలేదని చెప్పుకో!” అని బోధించింది.
కుంభుడు సరేనంటూ వీరవర్మను ఒక తట్టలో వేసుకుని, నెత్తిన పెట్టుకుని బయల్దేరాడు.
* * *
ఆ రాజ్యాన్ని పాలించే రాక్షసరాజు పేరు వజ్రకంఠుడు. అతని కూతురు పద్మసేన. ఆమె తన చెలికత్తె అయిన ద్విజటతో కలిసి, ఉద్యానంలో విహరించి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో.. దైవవశాత్తూ వీరవర్మను తట్టలో పెట్టుకుని వెళ్తున్న కుంభుడు కనిపించాడు. రాజకుమారిని చూడటంతోనే కుంభుడు పక్కకు తొలగిపోవడానికి ప్రయత్నించాడు. అతని వాలకం కనిపెట్టిన రాజపుత్రిక.. అనుమానంతో దగ్గరికి పిలిచింది.
“ఎవరు నువ్వు? ఆ గంపలో ఏముంది? నీ ముఖం చూస్తుంటే ఏదో దాస్తున్నావని తెలుస్తున్నది. నిజం చెప్పు” అని నిలదీసింది పద్మసేన.
వాడు గజగజా వణుకుతూ.. “తల్లీ! నేను మీ దాసుణ్ని. శిలాయంత్రాన్ని కాపాడే లంబోదరికి అనుచరుణ్ని. ఆమె చెప్పిన పనినే నెరవేరుస్తున్నాను” అని చెప్పాడు.
“ఆ తట్టలో ఏముందో చూపించు!?” అని అడిగింది పద్మసేన.
ఆ రాక్షసుడు గంప కిందపెట్టాడు. పైమూత తీశాడు.
మేలిమి బంగారు వర్ణంలో మెరిసిపోతున్న వీరవర్మను చూసి పద్మసేన కన్నులు విప్పారాయి. అతని అవయవ సౌష్టవం అచ్చెరువు కలిగించింది.
“అయ్యయ్యో! ఇతనింకా ప్రాణంతోనే ఉన్నట్లున్నాడు. వీణ్ని ఇలా నొక్కిపెట్టావేమిరా?! బయటికి తీయి” అని ఆజ్ఞాపించింది.
కుంభుడు అతణ్ని తట్టలోనుంచి బయటికి తీశాడు. రాకుమార్తె అశ్వశకటంలో పడుకోబెట్టాడు.
“ఓరీ! రాజుగారు తినాల్సిన మాంసాన్ని నువ్వు వేరేచోటికి తరలించబోయావు. ఇదెంత పెద్ద అపరాధమో తెలుసా?! మా రాకుమారి మంచిది కాబట్టి నీకు ఆపద గడిచింది. ఈ విషయం ఎక్కడా చెప్పకు” అని కుంభుణ్ని బెదిరిస్తూ శకటాన్ని ముందుకు పోనిచ్చింది పరిచారిక ద్విజట.
ఇద్దరూ కలిసి వీరవర్మను అంతఃపురంలోకి చేర్చారు. అతని ఒంటికి చమురు పట్టించి.. సందులు కదిలించారు. వేడినీళ్లతో కడిగారు. మెత్తని శయ్యపైకి చేర్చి.. గోరువెచ్చని పాలను కొద్దికొద్దిగా పట్టించారు.
అలా ఎన్నిరోజులు సేవలు చేశారో తెలియదు. చివరికి అతనికి స్పృహ వచ్చింది.
తన పక్కనే ఉన్న పద్మసేనను చూసి.. “నేనెక్కడున్నాను.. సుకుమారీ! నువ్వెవరు? ఇది స్వర్గమా!? నీవు అప్సరవా!?” అని ప్రశ్నించాడు.
అందుకు పద్మసేన నవ్వి.. “ఆర్యా! ముందుగా మీరెవరో తెలియచేయండి. తరువాత మా గురించి చెబుతాను” అన్నది.
“నేను భూలోకవాసిని. తాళధ్వజుని కుమారుణ్ని. నన్ను వీరవర్మ అంటారు. దిగ్విజయ యాత్రనుంచి తిరిగి వస్తూ ఒక మునీశ్వరుని శాసనం ప్రకారం చిత్రకూటమెక్కి, భూగర్భంలోకి జారిపోయాను. నాకు అంతవరకే జ్ఞాపకం ఉంది. తరువాత ఏం జరిగిందో తెలియదు. అతను నిజమైన మహర్షే అయితే.. ఇది దిక్పాలకుల నగరాల్లో ఒకటి కావాలి. నువ్వు దేవకన్యవు కావాలి” అని పలికాడు వీరవర్మ.
“రాజపుత్రా! నువ్వు మోసపోయావు. ఇది ఊర్ధ్వలోకం కాదు. సప్త పాతాళ లోకాలలో మొదటిదైన అతల లోకం. దీని పాలకుడైన వజ్రకంఠుడు మా తండ్రి. ఆయన భూలోకంలో ఒక బోనువంటి యంత్రాన్ని ఏర్పాటుచేశాడు. అక్కణ్నుంచి ఇక్కడివరకు ఒక సొరంగాన్ని తవ్వించాడు. దానికి అలంబసుడనే రాక్షసుణ్ని కాపలాగా నియమించాడు. వాడు మునివేషం ధరించి, అక్కడికి వచ్చే మనుషులను ఆ యంత్రంలో ఎక్కించి, సొరంగంలో తోస్తాడు. అందులో పడినవారు సగం ప్రాణం కోల్పోయి, ఈలోకాన్ని చేరుకుంటారు. అలా పడ్డ మానవులను మావాళ్లు వండుకు తింటారు” అని వివరంగా చెప్పింది పద్మసేన.
ఆ మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు వీరవర్మకు.
“నువ్వు రాక్షస స్త్రీవా?! ఇంత సుకుమారంగా ఉన్నావు. పైగా నామీద దయచూపించి, బతికించావు ఎందుకు?!” అని ప్రశ్నించాడు.
“నా తండ్రి రాక్షసుడే కానీ, మా తల్లి అప్సరజాతికి చెందినది. నాకు రాక్షసజాతి అంటే సుతరామూ ఇష్టం లేదు. మావాళ్లు నాకు స్వయంవరం చాటించారు. రేపో మాపో పెళ్లికొడుకులు నాకోసం రానున్నారు. కానీ నేను మిమ్మల్ని చూడగానే వరించాను” అని చెప్పి తలవంచుకుంది పద్మసేన.
కొద్దిసేపటివరకు వీరవర్మ ఏమీ మాట్లాడ లేకపోయాడు. కొద్దిసేపటి తరువాత మంచం మీదనుంచి లేచి కూర్చున్నాడు.
“సుందరీ! నేనిక్కడికి వచ్చి సుమారు ఎన్ని రోజులై ఉంటుంది?” అని ప్రశ్నించాడు.
“మీ కాలమానానికి మా కాలమానానికి సుమారుగా పక్షం రోజుల తేడా ఉంటుంది. మా కాలమానం ప్రకారం రెండురోజుల కిందటే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను” అని చెప్పింది పద్మసేన.
“అలా అయితే ఆ బిలంలో పడి ఎన్నిరోజులు కిందికి జారానో కదా!”.. స్వగతంగానే పైకి అనుకున్నాడు వీరవర్మ.
సరిగ్గా అదే సమయానికి.. వీరవర్మ సోదరుడైన సుధన్వుడు శిలాయంత్రంపై జారి, ఇసుక పరుపుమీద పడ్డాడు. వెంటనే జాగరూకుడైన కుంభాసురుడు రాతిగదతో సిద్ధమయ్యాడు. ఇది వరకు లాగానే లంబోదరి వాణ్ని వారించింది.
“ఒరేయ్! వాడు ప్రాణాలతో ఉన్నాడో లేదో చూడు” అన్నది.
(వచ్చేవారం.. సుధన్వుడి రససిద్ధి)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా
Kasi Majili Kathalu | విడిపోయిన జంట
Kasi Majili Kathalu | అతివ సాహసం
Kasi Majili Kathalu | ఆమె పేరు పద్మిని
Kasi Majili Kathalu | గజకర్ణ – గోకర్ణ విద్యలు
Kasi Majili Kathalu | మహేంద్రజాలం టక్కుటమారం